దశాబ్దాలుగా తెలంగాణలోని అనర్థాలకు,అక్రమాలకు,అన్యాయాలకు కారణభూతమైన కాంగ్రెస్ కల్లబొల్లి మాటలతో ప్రజల ముందుకొస్తున్న వైనం వారి తెంపరితనాన్ని తలపిస్తున్నది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రస్తావిస్తున్న ఆరోపణల్లో అవినీతి ఒకటి. అయితే కాంగ్రెస్ అవినీతి బాగోతాలను 2019 ఆగస్టు 22న జీన్యూస్ ప్రసారం చేసింది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నెహ్రూ మొదలు మన్మోహన్ సింగ్ వరకు 2జీ స్పెక్ట్ట్రమ్, కామన్వెల్త్ గేమ్స్ స్కాం, బొగ్గు కుంభకోణం,హెలికాఫ్టర్ల కుంభకోణం ఏ టూ జడ్ అవినీతిలో ఆరితేరినవారే. ఆ అనుభవంతో పాలకులందరూ కాంగ్రెస్ లాగానే ఉంటారనే భావంతో నిస్సిగ్గుగా తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ.
దేశంలో జరిగిన అవినీతి కార్యాకలాపాల్లో గాంధీ కుటుంబం పాత్ర లేదని చెప్పగలరా? తెలంగాణ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ప్రవచిస్తున్న కాంగ్రెస్కు అసలు ప్రజాస్వామ్యం అంటే అర్థం తెలుసా? ‘కాంగ్రెస్ అంటేనే ఎమర్జెన్సీ..ఎమర్జెన్సీ అంటేనే ఇందిరా కాంగ్రెస్’ అనే కాలంలో ఎమర్జెన్సీ విధించి పౌరహక్కులను హరించి, పత్రికలపై సెన్సార్షిప్ అమలు పరచడమే కాకుం డా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ మొదలుకొని ప్రతిపక్ష పార్టీ నేతలను స్వాతంత్య్ర సమరయోధులను, ప్రజాస్వామికవాదులను జైళ్లలో కుక్కిన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుచేసుకుంటే మంచిది. దశాబ్దాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిన మేలు ఏమీ లేకపోయినా ద్రోహాల చిట్టా చాంతాడంత పొడుగు ఉంటుంది.
తెలంగాణలో కేసీఆర్ పాలనను కుటుంబపాలన అనటం హాస్యాస్పదం. ఈ రోజు పదవుల్లో ఉన్న కేసీఆర్ కుటుంబీకులంతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారే. కేసులు, నిర్బంధాలు ఎదుర్కొన్నవారే. ప్రజల ఆమోదంతో భారీ మెజారిటీతో ఎన్నికైన వారే. మరి ఇందిరా కుటుంబం మాటేమిటి? 75ఏండ్లుగా కాంగ్రెస్ను శాసిస్తున్నది ఆ ఒక్క కుటుం బం కాదా? ఇందిరా ఆధిపత్యాన్ని ప్రశ్నించిన పాపానికి నిజ లింగప్ప, కామరాజ్ నాడార్, మొరార్జీ దేశాయ్ వంటి సీనియర్ కాంగ్రెస్ దిగ్గజాలను ఇందిరమ్మ శంకరగిరి మాన్యాలు పట్టించలేదా? రాష్ట్రపతిగా పోటీచేసిన సొంత పార్టీ అభ్యర్థి నీలం సంజీవరెడ్డిని ఇందిరాగాంధీ వెన్నుపోటుతో ఓడించలేదా? అంతెందుకు ఒక సాధారణ లోకసభ సభ్యుని హోదా లో హైదరాబాద్కు వచ్చిన రాజీవ్గాంధీని స్వాగతించడానికి వచ్చిన సీఎం అంజయ్యను బేగంపేట విమానాశ్రయంలోనే అవమానించి ఆ తర్వాత ఉద్వాసన పలుకలేదా? ఇది కుటుంబ పెత్తనం కాక మరేమిటో వివరణ ఇవ్వాలి.
సోనియాకు ఇష్టం లేకనే కదా మాజీ ప్రధాని పీవీ మరణిస్తే ఢిల్లీలో కనీసం ఆరడుగుల నేల దొరుకలేని స్థితి. అది కుటుం బ దాష్టీకం కాదా? అంతదాకా ఎందుకు ఎంతమంది ముఖ్యమంత్రుల కుటుంబాలు రాజకీయాల్లో లేవు? పీవీ, చెన్నారెడ్డి, నాదెండ్ల, కోట్ల, వై.ఎస్, కిరణ్ కుటుంబాలు రాజకీయాల్లో చక్రం తిప్పలేదా? ఎన్టీఆర్ ఇద్దరు అల్లుండ్లు, ఇద్దరు కొడుకులు, కూతురు, మనువడు, మనువరాలు రాజకీయాల్లో లేరా? అటువంటిది కేసీఆర్ది కుటుంబ పాలన అనడానికి మీకు నోరెలావస్తుంది. కాంగ్రెస్ పెద్దలకు ఏ మాత్రం నిజాయితీ ఉన్నా చేసిన పాపాలకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పుకోవాలె, కానీ అబద్ధా లతో తెలంగాణ ప్రజలను నమ్మించలేరు.
తెలంగాణలో ఉద్యోగాలే రాలేదన్న అభాండం ఒకటి. ఈ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది. పంచాయతీ సెక్రటరీలు, విద్యుత్ శాఖ, గురుకులాల టీచర్స్, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, పోలీస్ శాఖ, సింగరేణి వివిధ డిపార్ట్మెంట్లలో అర్హత గల కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులర్ చేయడం జరిగింది.
గతంలోకి వెళ్తే తెలంగాణ నిరుద్యోగులకు వరప్రదాయిని అయిన ముల్కీ నిబంధనలు ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ విరుద్ధంగా రాజ్యాంగ సవరణతో ఆ తీర్పును రద్దుచేసి తెలంగాణ నిరుద్యోగుల నోట మట్టి కొట్టింది కాంగ్రెస్ కాదా? తెలంగాణకు న్యాయంగా చెందాల్సిన రెండు లక్షల ఉద్యోగాలు అన్యాక్రాంతమైనట్లు తేల్చిన గిర్గ్లాని కమిషన్ నివేదికను తుంగలో తొక్కింది ఎవరు? నాటి పెద్దమనుషుల ఒప్పందాలు, ఆరు సూత్రాల పథకాలు, 610జీవోలు అటకెక్కించిన ఘనత కాంగ్రెస్ ది కాదా?
దేశాన్ని 54 ఏండ్లు , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను 42ఏండ్లు పాలించిన కాంగ్రెస్ తన గతం మరిచి ఇలా సుద్దులు, బుద్ధులు చెప్పడం ఆశ్చర్యమే అనిపిస్తుంది. అధికారం కోసమే అబద్ధ్దాలు వల్లిస్తూ, దింపుడు కల్లం ఆశతో ముందుకొస్తున్న కాంగ్రెస్ పట్ల అప్రమత్తంగా ఉంటే మంచిది.
డాక్టర్ సంగని మల్లేశ్వర్
98662 55355