1952 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతాన్ని ఎక్కువగా పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే. అందులోనూ ఆంధ్ర కాంగ్రెస్ నేతలు తెలంగాణకు అన్యాయం చేసి, అభివృద్ధిని పట్టించుకోక గాలికొదిలేశారు. తాగునీళ్లు లేవు, సాగునీళ్లు లేవు.. వానలు పడితే అంతంత మాత్రం పంటలు.. లేదంటే కరువు. కనీసం పశువులు తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి. వ్యవసాయం గిట్టుబాటు గాక, బ్యాంకుల్లో, బయట వడ్డీకి తెచ్చిన డబ్బులకు మిత్తీలు కట్టలేక వేలాది మంది రైతులు పొలం గట్టున ఉండే తుమ్మ చెట్టుకో, వేప చెట్టుకో ఉరిపోసుకునే దయనీయ పరిస్థితి. ‘పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసె’ అంటు కవులు నాటి స్థితిని పాటలుగా పాడారు. కాంగ్రెస్ పాలకులు తెలంగాణకు నదీజలాల్లో, నిధుల కేటాయింపుల్లో, నియామకాల్లో తీవ్ర అన్యాయం చేశారు.
ఏండ్ల తరబడి ఆంధ్ర పాలకుల చేతిలో మోసపోయిన తెలంగాణ ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని భావించారు. అక్కడి నుంచి పుట్టిందే తొలిదశ తెలంగాణ పోరా టం. ఈ ఉద్యమంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు .కానీ.. ఆంధ్రపాలకులు తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం చేయనీయలేదు. 2001లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తన భుజాలకెత్తుకున్న కేసీఆర్.. గాంధేయమార్గంలో మలిదశ తెలంగాణ ఉద్యమం చేసి, ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అని చావు నోట్లో తలబెట్టి ఆరు దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేశారు. తెచ్చిన తెలంగాణను ఎవరి చేతిలో పెట్టినా.. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరబోవని భావించి ఉద్యమనాయకుడే.. ముఖ్యమంత్రిగా పదేండ్లలో తెలంగాణను ప్రగతిలో పరుగులు పెట్టించారు.
ఎన్నికల కోసం ఎదురు చూసిన కాంగ్రెస్, బీజేపీ రాజకీయ నిరుద్యోగులు అబద్ధాల ప్రచారం, కుట్రలు, అలవికానీ హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. తెలంగాణ ఓటర్లు వారి మాటలు నమ్మితే మోసపోయే ప్రమాదం ఉన్నది. గత పదేండ్ల పాలనను ఒక్కసారి నెమరు వేసుకొని.. ఆలోచించి ఓట్లు వేయాల్సిన సందర్భం వచ్చింది. భారతదేశానికి ఇవాళ తెలంగాణ ఒక అభివృద్ధి మాడల్. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది.
సమ్మిళిత, సమగ్రాభివృద్ధి సాధించింది. పరిపాలనలో మానవీయ కోణాన్ని ఆవిష్కరించిన కేసీఆర్.. బీడువారిన భూములను పచ్చని పంట పొలాలుగా తీర్చిదిద్దారు. నేటి తెలంగాణ శాంతి సామరస్యానికి ప్రతీక. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క మతకల్లోలం కూడా జరగలేదు. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యం పాటిస్తూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ముందుకు వెళ్తున్నది. ఉమ్మడిరాష్ట్రంలో 2700 మెగావాట్ల విద్యుత్తు కొరత ఉండేది. విద్యుత్తు లేక పరిశ్రమలను వారంలో రెండు రోజులపాటు మూసివేసేవారు. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండేది. సీఎం కేసీఆర్ సమూలమైన సంస్కరణల ద్వారా పూర్తిగా ఆ పరిస్థితులను మార్చివేశారు. విద్యుత్తు మిగులు సాధించాం. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానానికి చేరింది. గత పదేండ్లలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 118.2 శాతం పెరిగింది. తెలంగాణ జీఎస్డీపీ జాతీయ సగటుకు మించి 155.7 శాతం పెరిగింది. జీఎస్డీపీలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నది. తెలంగాణ ఏర్పాటయ్యే సమయానికి రూ.1,12,162 ఉన్న తలసరి ఆదాయం 2022-23 నాటికి రూ.3,14,732 కి పెరిగింది. తలసరి ఆదాయం పెరుగుదలలో ఇతర రాష్ర్టాలకు మించి దూసుకెళ్తున్నది. ఎన్ఎఫ్ హెచ్ఎస్ 2019-21 ప్రకారం సమానాదాయ పంపిణీలో తెలంగాణ నెంబర్వన్గా ఉన్నది.
2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు నెగెటివ్ వృద్ధిలోఉన్న తెలంగాణ 2022-23 నాటికి 15.7 శాతం వృద్ధి సాధించింది. చివరి గింజ వరకు పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. రైతుబంధు పేరిట ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇప్పటివరకు 65 లక్షల మంది రైతులకు రూ.72,815 కోట్లు అందించారు. ఎక్కడా లేనివిధంగా రైతులకు ఉచిత తాగు, సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే. రైతాంగానికి 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్తు, ధరణి పోర్టల్ ద్వారా భూ రికార్డుల కంప్యూటరీకరణ లాంటి విప్లవాత్మక మార్పులకు తెలంగాణ సాక్షీభూతంగా నిలిచింది. మిషన్ కాకతీయ కింద చెరువులు మరమ్మతు చేసుకోవడం వల్ల ఇవాళ రాష్ట్రంలో చెరువులు నిండుకుండల్లా మారి, భూగర్భజలాలు పెరగడమే కాకుండా మత్స్య సంపద కూడా పెరిగింది. ఒకప్పుడు సాగు విస్తీర్ణం 1.31 లక్షల ఎకరాలు ఉంటే.. ఇప్పుడు 2 కోట్ల పైచిలుకు ఎకరాలకు పెరిగింది. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది తెలంగాణ. 2014లో రూ.62 లక్షల కోట్లు గా ఉన్న రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు రూ.2 లక్షల 94 వేల కోట్లకు చేరుకున్నది. తాగునీటిపై రాష్ట్ర ప్రభుత్వం రూ.36 వేల కోట్లు ఖర్చుచేసింది. మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ కల్పించారు. విద్యుత్తు రంగంలో రూ.38 వేల కోట్లు ఖర్చుచేశారు. 2014లో 7,778 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తయ్యేది. ఇప్పుడది 19,464 మెగావాట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యానికి చేరుకున్నది.
తలసరి విద్యుత్తు వినియోగం 2,126 యూనిట్లకు చేరింది. ఇది దేశంలోనే అత్యధికం. 2014 నుంచి ఈ ఏడాది జనవరి వరకు రూ.3.31 లక్షల కోట్ల పెట్టుబడులతో 22,100 పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరుచేసింది. తద్వారా 22 లక్షల 36 వేల పరో క్ష ఉద్యోగాలను సృష్టించారు. 2014లో రాష్ట్రం నుంచి రూ.57 వేల కోట్ల విలువైన ఐటీ ఉత్పత్తులు ఎగుమతవ్వగా.. ఇప్పుడు రూ.2.41 లక్షల కోట్లకు చేరా యి. యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్ వంటి బహుళజాతి కంపెనీలు సైతం తమ యూనిట్లను హైదరాబాద్లో ఏర్పాటు చేశాయి. సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే ఇదంతా సాధ్యమైంది. రూ.11 వేల కోట్లకుపైగా ఆసరా పథకం కింద 44 లక్షల మందికిపైగా అర్హులకు పింఛన్లు అందించారు. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకువచ్చారు. 10 వేల మెడికల్ సీట్లను పెంచారు. ప్రతీ జిల్లా దవాఖానకు అనుబంధంగా మెడికల్ కాలేజీని ఏర్పాటుచేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కింది.
ఉద్యమంలో చొరబడటం.. చేతిలోకి తీసుకోవడం..ద్రోహం చేయడం ఇదే 70 ఏండ్ల పాటు ఈ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో కాంగ్రెస్ పోషించిన పాత్ర. ఒక్కరంటే ఒక్క నాయకుడు కూడా తెలంగాణకు చివరిదాక కట్టుబడిన దాఖలా లేదు. ఎవరో రేపిన ఉద్యమ వేడిని ఎన్నికల పెనంగా వాడేసుకోవడం, అధికారం దక్కగానే మాట మార్చేయడం తెలంగాణ కాంగ్రెస్ చరిత్ర అంతా ఇంతే! స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అటు దేశంలో, ఇటు తెలుగు రాష్ర్టాల్లో కాంగ్రెస్ చేయని స్కాం అంటూ లేదు. అందుకే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు. అయినా ఆ పార్టీ తీరు మారలేదు.
తెలంగాణలో బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నది. అలాంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వొద్దని, కేవలం మూడు గంటలు ఇస్తే సరిపోతుందని వ్యాఖ్యానించడం ఆ పార్టీ రైతు వ్యతిరేకతను బయటపెట్టింది. ఇటీవల కర్ణాటకలో బీజేపీ మీదున్న వ్యతిరేకత పుణ్యమాని గెలిచింది. కానీ, తమ పరిస్థితి పెనం మీదినుంచి పొయ్యిలో పడ్డట్టయిందని వారు తెలుసుకునేందుకు ఎంతో సమయం పట్టలేదు. కుర్చీలాటతో, సిగపట్లతో కాంగ్రెస్ పరువు బజారుకెక్కింది. ఏడాదికో ముఖ్యమంత్రిని మార్చిన చరిత్ర కలిగిన పార్టీలో ఏదైనా జరగొచ్చునని చెప్పుకొంటున్నారు కన్నడిగులు. ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా అనాదిగా జరిగే తంతు ఇదే. సీఎంలను గద్దె దింపేందుకు అల్లర్లు సృష్టించిన హీనచరిత్ర కాంగ్రెస్ది. అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అలవికానీ హామీలతో మభ్యపెడుతున్నది. ప్రజలారా ఆలోచించండి మోసపోతే.. గోసపడుతం.
-బచ్చు శ్రీనివాస్
93483 11117