ఏ నినాదం వెనుక ఏ వర్గ ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకునేంతవరకు ప్రజలు మోసపోతూనే ఉంటారని లెనిన్ అన్నారు. ఈ స్టేట్మెంట్కు నేటికి ప్రాసంగిత ఉందనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా నేడు తెలంగాణ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది. దీనికి పెద్దగా ప్రపంచ జ్ఞానాన్ని ఔపోసన పట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. పోరాడి సాధించుకున్న తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కో ఇటుక పేరుస్తూ ఇల్లు నిర్మిస్తున్నట్లుగా రాష్ర్టాన్ని పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రగతిపథంలో తీసుకెళ్తున్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అవార్డులే అందుకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీలకు కండ్లు కనిపించడం లేదు. తెలంగాణలో అభివృద్ధి అనేదే లేదని, రాష్ట్రం అంధకారంలో కూరుకుపోయిందని, సీఎం కేసీఆర్పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మరో అడుగు ముందుకేసి దూషణలకు పాల్పడుతున్నారు. అట్లయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు అవార్డులు ఎందుకిస్తున్నదో ప్రతిపక్షాలే చెప్పాలి. నిజంగా వారి ఆరోపణల్లో నిజం ఉన్నదా అనే విషయాన్ని తెలంగాణ బిడ్డలుగా మనం బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రజల మెప్పు పొందినవారే అధికార పగ్గాలందుకుంటారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. తెలంగాణలోని విశాల రాశులను ఏకం చేసి సీఎం కేసీఆర్ మలిదశ పోరాటాన్ని నడిపి తెలంగాణను సాధించారు. సాధించిన తెలంగాణను అనతికాలంలోనే పరిశ్రమలు, వ్యవసాయం, సేవారంగంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించి తెలంగాణను పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చారు. ఈ రోజు మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు పోటీ పడుతుండ టమే తాజా ఉదాహరణ.
ఏ కంపెనీ కూడా వేల కోట్లను ఊరికే పెట్టుబడిగా పెట్టదు. అందుకు కారణం ఇక్కడ పీపుల్స్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉండటమే. తెలంగాణ సాధనకు ముందే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ముఖచిత్రం ఎలా ఉండాలో ముందే బ్లూ ప్రింట్ తయారుచేసుకున్న దార్శనికుడు కేసీఆర్. టీఎస్ఐపాస్ అద్భుతమైన ఆలోచనతోనే ఇది సాధ్యమైంది.
ఉద్యమనేత అయిన కేసీఆర్ అపర రాజకీయ చాణక్యుడు. ఆయనకు తెలంగాణ అన్నా, రాష్ట్ర ప్రజలన్నా అపారమైన మమకారం. అందుకే మొదటిసారి ప్రజలు మెచ్చే పాలనను అందించారు. కాబట్టే రెండోసారి కూడా రాష్ట్ర ప్రజలు కేసీఆర్కే అధికారం అప్పగించారు. ఇది ప్రజలంటే పట్టని, ప్రజలంటే గిట్టని ప్రతిపక్ష నాయకులకు రుచించడం లేదు. వారు కేవలం ‘అధికారమనే యావలో’ తొమ్మిదేండ్లుగా ఆరాటపడుతున్నారు. కానీ అధికారం ఊరికే రాదు కదా..? పక్క రాష్ర్టాలు మొదలు ఢిల్లీ నుంచి అధికారం కోసం తెలంగాణకు పరుగులు తీస్తున్నారు. ఈ పరుగుల వెనుక దాగి ఉన్న నిజమేంటో తెలుసుకోలేని స్థితిలో తెలంగాణ ప్రజలు లేరనేది జగమెరిగిన సత్యం. అందులో భాగంగానే ‘అచ్చెరా.. పాయెరా..’ అనే ఈ హడావుడి.
దానికి తాజా ఉదాహరణే మహబూబ్నగర్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఏర్పాటైన సభ ఒకటైతే, వరంగల్లో ‘రైతు సంఘర్షణ సభ’ పేరుతో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సభ మరొకటి. ప్రధాని కావాలనే కోరిక తన ఇక తీరదని రాహుల్ గాంధీకీ తెలుసు. అయినా రాహుల్ను బలవంతంగా రప్పించడం అధికార దాహం తప్ప మరేమీ కాదు. ఇక ఈ సభలు చాలవన్నట్లు రాష్ట్రంలో ఏవో విపత్తులు వచ్చినట్టు, ఆ విపత్తుల్లో రాష్ట్రం మునిగిపోతున్నట్టు, కొట్టుకుపోతున్నట్టు పాదయాత్రలు చేస్తున్నారు. సుభిక్షంగా ఉన్న రాష్ట్రంలో ప్రతిపక్షాల పాదయాత్రలు ప్రజల్లో ఒకింత విసుగును తెప్పిస్తున్నాయి.
‘మొరిగే కుక్క కరవద’నే సామె త సభలు పెడుతున్న నేతలకు, పాదయాత్రలు చేస్తున్న నాయకుల కు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ‘పసలేని నాయకులకు పాకులాటలెక్కువ’ అన్నట్టు విషయం లేని ఈ నాయకులకు విర్రవీగడం కూడా ఎక్కువే. ఈ హడావుడి చేసే నాయకులకు అసలు విషయంపై అవగాహన ఉండదు. తెలంగాణలో అధికారంలోకి వస్తే 4 వేల రూపాయల పింఛన్ ఇస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బాగానే ఉంది. ప్రజలకు మేలు చేస్తామంటే ఎవరు మాత్రం కాదంటారు. స్వాగతించాల్సిందే. అయితే ఇన్ని నీతులు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, కర్ణాటక రాష్ర్టాల్లో ఎంత పింఛన్ ఇస్తున్నారో గమనించాలి. వారు పాలించే రాష్ర్టాల్లో అరకొరగా ఇస్తూ తెలంగాణలో మాత్రం అధికారంలోకి వస్తే 4 వేలు ఇస్తామనడం ఇక్కడి ప్రజలను అవమానించడమే. తెలంగాణ ప్రజలు ఏది చెప్పినా వింటారని, గెలిచాక చూద్దాంలే అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా ప్రవర్తిస్తున్నది.
మరోవైపు తెలంగాణలో సాగుకు స్వర్ణయుగం తీసుకువచ్చిన కేసీఆర్ రైతును రాజు చేయడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, సాగుకు సరిపడా ఉచిత కరెంట్, సకాలంలో ఎరువులు, విత్తనాలు వంటివి అందిస్తూ అన్నదాతకు వెన్నెముకగా నిలుస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ధరణిని రద్దు చేస్తాం, రైతులను ఆదుకుంటాం అని వారిని రెచ్చగొట్టి, తప్పుదోవ పట్టించి తమ వైపు మలుపుకోవడానికే ప్రతిపక్షాలు విఫల ప్రయత్నం చేస్తున్నాయి. వీరి డ్రామాలకు తెలంగాణ రైతు మోసపోయే పరిస్థితి లేదు.
ఉద్యమ నాయకుడు కేసీఆర్ మీద విమర్శలు చేయడం రాజకీయ స్వార్థ మే తప్ప మరొకటి కాదనేది స్పష్టం. మేధావులు కూడా ఆలోచిస్తే తెలంగాణ సమాజానికి మేలుచేసిన వారవుతారు. చేసిన సాయాన్ని, తిన్న రేవును మరువని తెలంగాణ ప్రజలు ప్రతిపక్షాలకు తగినరీతిలో బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవు.
మొదటిసారి ప్రజలు మెచ్చే పాలనను అందించారు. కాబట్టే రెండోసారి కూడా రాష్ట్ర ప్రజలు కేసీఆర్కే అధికారం అప్పగించారు. ఇది ప్రజలంటే పట్టని, ప్రజలంటే గిట్టని ప్రతిపక్ష నాయకులకు రుచించడం లేదు. వారు కేవలం ‘అధికారమనే యావలో’ తొమ్మిదేండ్లుగా ఆరాటపడుతున్నారు. కానీ అధికారం ఊరికే రాదు కదా?
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)