‘పరాయి పాలనలో వివక్షల విచ్చుకత్తుల మధ్య తల్లడిల్లిన నేల మీద తంగేడు పూలు తలలెత్తుకున్నయి. పాలపిట్టలు పాటెత్తుకున్నయి. ఊరూరా బతుకమ్మల పూల తేరులను ఎదకెత్తుకుని చెరువులు మురిసిపోతున్నయి. కమలాలు, కలువలు సూర్యచంద్రులకు ఆహ్వానం పలుకుతున్నయి’ అంటూ తెలంగాణ దశాబ్దిని వర్ణిస్తున్నారు ప్రముఖకవి వఝల శివకుమార్.
అరవై ఏండ్ల వేదన.. నిబ్బరించుకోలేని వగపోత.. నిభాయించుకోలేని గుండెకోత. మునిపంట బిగబట్టిన ఆవేశం కట్టలు తెంచుకోవడానికి బలి పెట్టుకున్న మూడు ఉద్యమాల కాలం. అమరుల ఆత్మను ఆయుధంగా, స్వరాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యంగా సాగిన సుదీర్ఘయుద్ధం తెలంగాణ ఉద్యమం. తనది కాని బతుకుతో నిత్య ఘర్షణ పడుతున్న తెలంగాణ ముక్కలైన ఆత్మవిశ్వాసాలను కూడగట్టుకుంటున్న చారిత్రక సందర్భం మలిదశ చారిత్రక మహోద్యమ కాలం. ఆత్మ బలిదానాలు, త్యాగా లు, మడమతిప్పని దీక్షలు తెలంగాణ అస్తిత్వ కాంక్ష నేపథ్యంలోని తాత్విక భూమికకు ఊపిరై, ఉప్పెనై స్వార్థ రాజకీయ తంత్రాల గుట్టును రట్టు చేసినై. కాలాన్ని నిలదీసినై.
గుండెల్ని కలిపి కుట్టలేనప్పుడు/ గూడైనా విడిపోవాల్సిందే/ గువ్వలైనా విడిపోవాల్సిందే/ రెండు ఆలోచనల మధ్య విభజన/ రెండు ఆచరణల మధ్య విభజన.. కలసి ఉండి కలహించుకునే కంటే/ విడివడి రెండు ప్రపంచాలుగా వర్ధిల్లటం న్యాయం. బంధాలుంటాయి, అనుబంధాలుంటాయి, ఆత్మీయతలుంటాయి. తెలంగాణకు తనదైన ప్రత్యేక రాష్ట్ర విభజన అనివార్యం. ఈ సత్యాన్ని కాలం గ్రహించక తప్పదు. అందుకే మార్పు వైపు తెలంగాణను కదిలించింది కాలం. కదిలించగలిగే సత్తా ఉన్న ఉద్యమ నాయకత్వాన్ని ప్రసాదించింది కాలం. గత ఉద్యమ వైఫల్యాల అనుభవంతో నిరాశా నిస్పృహలు అలుముకున్న ప్రజల్లో మరొక్కసారి ఆత్మైస్థెర్యాన్ని నింపింది నాయకత్వం. నానాటికి దిగజారుతున్న జీవన ప్రమాణాల నేపథ్యాన్ని, దాని కారణాలను వివరించి జాతిని జాగృతపరిచింది. రాజకీయ సందర్భాలను విశ్లేషిస్తూ అనుగుణమైన అడుగులు వేయించింది. మహత్తర తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసింది. ప్రజలకు ధైర్యాన్ని, శౌర్యాన్ని నూరిపోసి మూడు కోట్ల ప్రజలను ముక్తకంఠంగా నిలబెట్టి ముందుకు కదిలించిన ఘనత సమర్థ నాయకత్వానిదే.
నా తెలంగాణ నేడు ఒక కుంతీ మాత/ప్రజలంతా దగాపడ్డ పాండవులు/సమైక్యత కింద సాగుకాని చెలకను నేను/ అంటూ ఘోషించిన కవి గుండెకోతకు జవాబులు వెతికి, ఆవేశాలు కొడిగట్టకుండా.. అనర్థాలు కమ్ముకోకుండా.. రక్తపాతం లేకుండా ప్రజాస్వామ్యయుతంగా మహోద్యమాన్ని నడిపింది. దాని అధినాయకత్వం, అది చూపించిన చాణక్యం సమయానుకూల నిర్ణయాలతో ఆటంకాలను అధిగమించి తెలంగాణ మలిదశ పోరాటాన్ని విజయతీరాల వైపు కదిలించింది.
రాజకీయ వర్గాలను ఆశ్చర్యచకితం చేస్తూ, విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ వెన్ను చూపని ప్రజల అండదండలతో, అపూర్వ రాజనీతి తో మహత్తర తెలంగాణ స్వరాష్ర్టాన్ని సాధించి చరిత్రలో ఈ మహోద్యమానికి స్థానం కల్పించింది. స్వరాష్ట్ర సాధన అనంతరం వెనుదిరిగి చూడకుండా నాడు ఏ స్వప్నాలను తలకెత్తుకుందో.. ఆ స్వప్న సాఫల్యాల వెలుగులను తెలంగాణ నేల నలుచెరుగు లా విస్తరింపజేసే బృహత్ కార్యాలకు శ్రీకారం చుట్టింది. నిర్లక్ష్యం నీడలో విధ్వంసమైన జల వనరుల పరిరక్షణను తక్షణ ఆత్మరక్షణ చర్యగా స్వీకరించింది. కాకతీయుల కాలం నాటి గొలుసు కట్టు చెరువుల పునరుద్ధరణ లక్ష్యాన్ని మిషన్ కాకతీయతో భుజాలకెత్తుకున్నది. నేడు తెలంగాణ నేల నలుచెరగులా ఊరూరా.. జలకళలు వెల్లివిరిసేలా సదా సర్వకాలాలు నిండైన చెరువులతో సస్య లక్ష్మికి స్వాగతం చెప్తున్నాయి. పిడచ కట్టుకుపోయిన 60 ఏండ్ల ఎడారి దాహార్తిని మిషన్ భగీరథ చల్లని తీయని నీళ్లతో తీరుస్తున్నది. అయోమయంలో పడిపోయిన వ్యవసాయరంగం తేరుకొని ‘రైతుబంధు’ అండతో ఆరుగాలాల పంటలతో తులతూగుతున్నది. కాలానుకూలమైన గిట్టుబాటు ధరలతో కళ్ళంలో ధాన్యాలు గడప ముందే కాంటాకు ఎక్కి రైతుల ఆర్థికవ్యవస్థలకు బలాన్ని విశ్వాసాన్నిచ్చింది.
తెలంగాణ వస్తే చీకట్లూ చింతలూ తప్ప వెలుగులుండవని భయాలు పెంచి తమ పబ్బం గడుపుకొన్నాయి సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలు. వారంతా నోరు వెళ్ళబెట్టేలా.. ప్రణాళికాబద్ధమైన ఆచరణలతో సమయానుకూల నిర్ణయాలతో 24 గంటలు మేలైన ఉచిత విద్యుత్తును అందిస్తున్నది తెలంగాణ. అటు రైతు జీవితంలో ఇటు తెలంగాణ నేల నలుచెరగులా విద్యుత్ దీప కాంతులు వెల్లి విరిసేలా చేస్తున్నది. పర్యావరణ పరిరక్షణలో అడవుల పరిరక్షణ ఆవశ్యకతను గుర్తిస్తూ ఆటవీ సంపదను కంటికి రెప్పలా కాస్తూ అభివృద్ధి చేసే దిశవైపు చర్యలు చేపడుతున్నది. అంతేకాక ఊరురా హరితవనాలను పెద్ద ఎత్తున పెంచి చల్ల చల్లని గాలులతో పూల వనాలకు పునర్జన్మను ప్రసాదిస్తున్నది. హరిత విప్లవాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలుచేస్తూ.. పచ్చని చెట్లతో నేల తల్లికి ‘హరితహారం’ వేస్తున్నది.
తలాపునా పారుతోంది. గోదారి/నీ చేను నీ చెలక ఎడారి/ రైతన్న నీ బతుకు అమాస/ అంటూ నిర్వేదపడ్డ తెలంగాణ నేల ఆపాద మస్తకాన్ని కాళేశ్వర జలాలతో అభిషేకిస్తున్నాయి. నేల తల్లికి ఆకుపచ్చ పొద్దుపొడుపులను బహుకరిస్తున్నాయి. పల్లె కన్నీరు పెడుతుందో/ కనిపించని కుట్రల/నా తల్లి బందీ అయిపోయిందో/ అని దుఃఖపడ్డ నేల మీద పల్లెలు స్వశక్తితో ఆత్మవిశ్వాసంతో నిలబడ్డాయి. సదా సర్వకాలాలు మత్తడి దుంకుతున్న కొత్తనీటి ఉత్సాహంతో కులవృత్తులను పునరుద్ధరించుకుంటూ సర్వతోముఖాభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయి. పాడిపంటలతో ఆరు కాలాల వ్యవసాయాన్ని ఆత్మవిశ్వాసంగా నిలబెట్టుకుంటున్నాయి. ఇదంతా తెలంగాణ మట్టిలో పుట్టి వ్యవసాయమే తన ఊపిరిగా మెట్టి పల్లె బతుకుల కల్లోలాల మూలా లు తెలిసిన నేతవల్లే సాధ్యమైంది.
ఇప్పుడు తెలంగాణ ఒక ఆత్మగౌరవ నినాదం. సమాజ శ్రేయస్సే పరమావధిగా పురోగమిస్తున్న స్వపరిపాలనా వేదం. ఒకప్పటి కేంద్రీకృత పాలనా వ్యవస్థల సేవలు చిట్టచివరి భాగం దాకా అందేలా 33 జిల్లాలుగా విస్తరించింది తెలంగాణ. ఒకప్పుడు తెలంగాణ ఆలోచనలు ఆశయాన్ని అవహేళన చేసిన వాళ్ళనోర్లే త్వరితగతిన జరుగుతున్న అనూహ్యమైన ఈ అభివృద్ధిని చూసి మూతపడుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తొమ్మి దేండ్లు దాటి దశాబ్ది యుగంలోకి అడుగుపెడుతున్నది. ఒకప్పుడు వాళ్ల ప్రయోజకత్వం గురించి బీరాలు పలికిన పొరుగు రాష్ట్రం ఇంతవరకూ అసలైన రాజధాని లేకుండా.. అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నది. అన్నిరంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ.. యావత్ ప్రపంచదృష్టిని ఆకర్షిస్తున్న తెలంగాణ బహుముఖ వికాసం ఇప్పుడు మేధావులకు విశేషజ్ఞులకు విశేష చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో కవులు పూజ్యం అన్న అవహేళనకు జవాబుగా సురవరం ప్రతాపరెడ్డి గోలకొండ కవుల ప్రత్యేక సంచికను వెలువరించారు. ఆ ప్రేరణతో విముక్త తెలంగాణ సాహితీ సాంస్కృతిక చైతన్యాన్ని జాగృతపరిచి కవిత్వంలో తెలంగాణ భాషకు, యాసకు పట్టం గట్టింది. కవిత్వంలో తెలంగాణకు చెందిన బహుముఖ పార్శ్వాలు ఆవిష్కృతమవుతూ తెలంగాణ జీవన శిల్పానికి అపూర్వమైన సాహిత్య గౌరవాన్ని తెచ్చిపెడుతున్నాయి. కాళోజీ కలలుగన్న తెలంగాణ భాషా వైభవం ఇప్పుడు దాశరథి, కాళోజీ వంటి మహామహుల విశేష జయంతులతో, సాహిత్య ఉత్సవాలతో సాంస్కృతిక వైభవాలతో పరిఢవిల్లుతున్నది. స్వరాష్ట్రంలో రామప్ప శిల్పకళా వైభవం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించి ఐక్యరాజ్యసమితి గుర్తింపును పొంది వెలుగొందుతుండటం గర్వించదగిన అంశం. నాగేటి చాళ్లలో నా తెలంగాణ/ పారేటి నీళ్లల్లో పానాదులల్ల/ పూసేటి పూవుల్ల పూనాసలల్ల/ తన సాంస్కృతిక మూలాల ప్రతిబింబాలను చూసి ఇప్పుడు తెలంగాణ గర్వపడుతున్నది.
ఆ చల్లని సముద్ర గర్భంలోని అన్నార్తులు అభాగ్యులుండని ఆ నవయుగాన్ని పునః ప్రతిష్ఠిస్తూ.. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యాన్ని వాళ్ల కండ్లముందే ఆవిష్కరిస్తున్నది. ఈ దశాబ్ది ముంగిట్లో దాని ప్రతిఫలాలను ఆవిష్కరిస్తున్నది. బతుకమ్మ ఒక పోరాట వారసత్వమై మలిదశ ఉద్యమానికి ఆయుధమైంది. నిరసనలోనూ బతుక మ్మ ఒక బలమైన ప్రతీకగా పోరాట సందర్భాన్ని పదునెక్కించింది. స్వీయ పాలనలో తెలంగాణ పం డుగలు బతుకమ్మ, బోనాలు, రంజాన్ వంటి ఎన్నె న్నో ఉత్సవాలు అధికారికంగా నిర్వహింపబడుతూ సంబురాలను అంబరానికెత్తి ఆనందాల కొలువులవుతున్నాయి. ప్రపంచస్థాయి సాఫ్ట్వేర్ సం స్థలు తమ కార్యకలాపాలకు తెలంగాణ అనువైనదని గ్రహించి ఈ నేల నుంచి తమ వ్యాపారాలు వృద్ధి చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి. ఆలయాల పునరుద్ధరణ బృహత్కార్యాన్ని చేపట్టి రాజుల కాలం లో కన్నా మిన్నగా కళా శిల్పాలతో యాదగిరి దేవాలయ పునర్నిర్మాణం పూర్తి చేసి.. వేములవాడ కొండగట్టు క్షేత్రాల అభివృద్ధి వైపు కదులుతున్నది.
దళిత, హరిజన , గిరిజన బడుగు బలహీనవర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ ఎన్నెన్నో పథకాలను ప్రవేశపెట్టి సమస్త కులాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. మహిళల ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ఉపయుక్తకర ప్రణాళికలను ఆచరణలో పెడుతున్నది. ఒకప్పుడు తలదాచుకునే నీడ కోసం అలమటించిన కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్లను అంది స్తూ గృహ నిర్మాణాలకు ఆర్థిక సహకారాన్ని కల్పిస్తూ ప్రజాదరణను చూరగొంటున్నది. చివరికి సంపన్నుల నుంచి పేదల వరకు ఊరూరా కనీసం అంతకుముందు అంత్యక్రియలకు జానెడు జాగా లేకుండా అలమటించిన వా రందరికీ అందుబాటులో ఉండేలా సౌకర్యవంతమైన అధునాతనమైన స్వర్గధామాలు నిర్మింపజేసి ఆకుపచ్చని ప్రాంగణాలతో ఉపయోగంలోకి తెచ్చింది.
తెలంగాణ వస్తే పాలన కుంటుపడుతుందని, అస్థిర ప్రభుత్వాలు రాష్ర్టాన్ని అతలాకుతలం చేస్తాయని భావించిన ఈర్ష్యాళువులకు తల తిరిగేలా చేసింది. తెలంగాణ ఏర్పడ్డ 2014 జూన్ 2 నుంచి నిరాటంకంగా ప్రజల మన్ననలతో సుదీర్ఘ పాలన కొనసాగిస్తూ విజయ దశాబ్దిలోకి అడుగుపెడుతున్నది. తెలంగాణ ప్రభుత్వ సమర్థతను చూస్తూ ప్రపంచ దేశాలు వేనోళ్ళ కొనియాడుతున్నాయి. దేశం మొత్తంలో సమర్థవంతమైన పాలకుడిగా తెలంగాణ రాష్ట్ర పితగా, రాజనీతి ధురంధరుడుగా, ప్రజా హృదయాలను గెలిచి నిలిచిన నేతగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కీర్తిస్తూ సమస్త ప్రపంచం జేజేలు పలుకుతున్నది.
అరవై ఏండ్ల పరాధీనత, ఆధిపత్య ధోరణులు స్వీయ పాలనలో తొమ్మిదేండ్లుగా అనూహ్యమైన అభివృద్ధిని ప్రదర్శిస్తున్నాయి. ఉత్తమ గ్రామాలుగా, ఉత్తమ నిర్వాహక సంస్థలుగా, అత్యుత్తమ పరిపాలనా రంగాలుగా జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలను, పురస్కారాలను కైవసం చేసుకుంటున్నాయి. ఇప్పటికీ తెలంగాణను మళ్లీ చీకట్లోకి నెట్టడానికి స్వేచ్ఛగా ఎదగకుండా రెక్కలు కత్తిరించడానికి మతోన్మాద రాజకీయాల కుట్రలు, అవకాశవాద కుట్రలు కాలుదువ్వు తూ కవ్విస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వాటి ఎత్తులను చిత్తు చేస్తూ తెలంగాణ తన ఐక్యతను నిరూపించుకుంటూనే పురోగమిస్తున్నది.
ఈ దశాబ్ది మహోత్సవ వేళ స్వరాష్ట్రం ప్రతిష్ఠాత్మక సచివాలయ భవనాన్ని నిర్మించుకొన్నది. కాళేశ్వరం వంటి మరెన్నో ప్రపంచ ప్రసిద్ధ ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తిచేసుకున్నది. అటు పారిశ్రామిక ఇటు వ్యవసాయకరంగాలను ప్రభావితం చేస్తూ.. ఉత్పత్తిలో, ప్రజల తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలబెడుతున్నది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి శాసనపరమైన ఆటంకాలను అధిగమింపజేసిన రాజ్యాంగ నేత బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని జాతీయస్థాయి నిర్మాణంగా చేపట్టి పూర్తి చేసింది. నూతన సచివాలయ భవనానికి ఆ మహనీయుని పేరే పెట్టి గౌరవించడం తెలంగాణ సంస్కారాన్ని ప్రపంచానికి చాటిచెప్తున్నది. ఇప్పుడు హుస్సేన్ సాగర్ తీరంలో అంబేద్కర్ నిత్యం హుస్సేన్ సాగ ర్లోని తథాగతునితో సంభాషిస్తూ.. కనువిందు చేస్తున్నాడు. ఈ దశాబ్ది ఉత్సవ కాంతులను నిత్యం తన కండ్లల్లో ప్రతిబింబింపజేస్తూ ట్యాంక్బండ్లో నూతనంగా విశిష్ఠ నిర్మాణ కౌశలంతో నిర్మింపబడిన అమరవీరుల స్తూపం తెలంగాణ స్వరాష్ట్ర పాలనా ఫలితాలను అమరవీరుల ఆత్మలకు నివేదిస్తున్నది. తెలంగాణ రాష్ర్టాభివృద్ధికి సంకేతంగా నిలుస్తున్నది.
వఝల శివకుమార్
94418 83210