పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సాకారంతో వలస బిడ్డల గోస తీరనున్నది. సమైక్య పాలకుల చేతిలో బందీ అయిన కృష్ణమ్మ తెలంగాణకు పచ్చ తోరణం కడుతున్న వేళ మన బతుకులు మారనున్నాయి. మన కోసం నిలబడిన అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోవడమే మన ముందున్న కర్తవ్యం. అందుకే ఆయనకు అపూర్వ ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్న కొల్లాపూర్కు వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివస్తున్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కొల్లాపూర్ అందరినీ పిలుస్తున్నది..
రండి..కదలిరండి.
ఒకప్పుడు నిత్యం వలస వెళ్లే పాలమూరు బిడ్డలపై దేశం జాలి చూపేది. ఎండిన భూముల్లో విత్తు నిలవక కూలీలతో పాటు రైతులు కూడా వలస బాట పట్టేవారు. భవిష్యత్తుపై నీళ్లు చల్లుకొని ఆశలు వదులుకున్న పాలమూరు నీళ్ల కోసం నిలబడిన ఉద్యమ నేత కేసీఆర్ను చూసి వసంతం ముందే వచ్చిందని సంబురపడింది. కేసీఆర్తోనే పాలమూరు పచ్చబడటం ప్రారంభమైంది. వలసలకు నిలయమైన పాలమూరు నేడు ఇతర ప్రాంతాల వారికి కూడా ఉపాధి దొరికే కర్మాగారమైంది. కేసీఆర్, కేటీఆర్ మార్గదర్శకంలో వ్యవసాయం, పారిశ్రామిక రంగంలో సమానంగా వృద్ధి చెందుతున్నది. ఎన్నికల అవసరాల కోసం సమైక్య పాలకులు పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులను, కాల్వలను సీఎం కేసీఆర్ మరమ్మతులు చేయించి, ఆధునికీకకరించి అందుబాటులోకి తీసుకొచ్చారు. అధికారం చేపట్టిన రోజు నుంచే మిషన్ కాకతీయ పేరుతో అద్భుతంగా చెరువుల పూడికను తీయించి వేలాది ఎకరాలకు సాగునీరు అందించే నిల్వ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. కొల్లాపూర్ సమీపంలోని సింగోటం చెరువును రిజర్వాయర్గా మార్చి 0.5 టీఎంసీ నీటిని నిల్వ చేయడంతో పాటు గోపల్దిన్నె రిజర్వాయర్కు లింక్ చేసి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి కృష్ణమ్మ నీటితో రైతుల పొలాలకు సాగునీరు అందిస్తూ ఎడారి లాంటి ప్రాంతంలో వరి ధాన్యం పండేలా చేశారు.
తెలంగాణకు చివరిలో ఉన్న కొల్లాపూర్ను సమైక్య రాష్ట్ర పాలకులు అభివృద్ధిలో కూడా చివరిలోనే ఉంచారు. కానీ కేసీఆర్ మాత్రం కొల్లాపూర్లో మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయి వెలుగులు పంచిన కొల్లాపూర్ ప్రజలకు నాడు చీకటి మాత్రమే మిగిలింది. కానీ నేడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు, ఇండ్లు కోల్పోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నష్ట పరిహారం అందించి అక్కున చేర్చుకొంది. సీఎం కేసీఆర్ సాగు నీటి చరిత్రలో కొల్లాపూర్కు పూర్వ వైభవం తెచ్చారు. దీని వల్ల కొల్లాపూర్ పాడి పంటలతో, సిరి సంపదలతో తులతూగుతున్నది. అందుకే మన గోస తీర్చిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకునేందుకు మన బండ్లు బాట కట్టాలి.. మన పల్లెలు కదలాలి. కరువును అనుభవించిన ముసలివాళ్లు పిల్లలను ఊతకర్రగా చేసుకొని సీఎం కేసీఆర్ బహిరంగ సభకు కదలాలి. కేసీఆర్ చేతుల మీదుగా జాలువారిన సప్తనదుల సంగమమైన కృష్ణమ్మ పవిత్రమైన జలాలను మన ఇంటి దేవుళ్లను, మన కుల దేవుళ్లను, మన గ్రామ దేవుళ్లను పూజించి ఆ జలాలతో బీడు బారిన మన పొలాలను పావనం చేయాలని ప్రార్థించాలి. మన బతుకులను మార్చిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు లక్షలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయాలి.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ నాయకులు, కొల్లాపూర్)
-దూరెడ్డి రఘువర్ధన్రెడ్డి
90300 15999