నేడు చెన్నబోయిన కమలమ్మ వర్ధంతి
ఓ మనిషి శరీరంలో నీరెంత ఉంటుందంటే ఏ డాక్టరైనా చెపుతాడు. కానీ ఓ మహిళ కంట్లో కన్నీరెంతంటే జవాబు మాత్రం ఏ వైద్యుడూ చెప్పలేడు. కన్నబిడ్డను చేజేతులా దూరం చేసుకున్న మహిళ మాత్రమే చెప్పగలదు. ఆరు నెలల బిడ్డను పట్టుకొని ఎవరు తీసుకుంటారా అని అడవిలో రెండు కిలోమీటర్లు వెదుకులాడి చివరకు కనపడిన కోయ దంపతులకు ఆ బిడ్డను అప్పగించిన తల్లి ఆవేదన, ఆక్రోశం, బాధ వర్ణనాతీతం. అమ్మపాలకు ఏడ్చే ఆ బిడ్డ ఏడుపు కంటే బిగ్గరగా ఏడుస్తూ వెనుదిరిగిన తల్లి చెన్నబోయిన కమలమ్మ.
నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరా టం, తన కన్నబిడ్డ ఈ రెండింటిలో దేన్ని వదులుకోవాలో తేల్చుకోవాల్సి వస్తే.. అదీ మహిళకు అటువంటి పరిస్థితి ఎదురైతే ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? సాధారణ మహిళల సంగతేమో కానీ, చెన్నబోయిన కమలమ్మ మాత్రం అమాయక ప్రజల కోసం తన కన్నబిడ్డనే వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. నిజాంల అణచివేత పాలనకు, నిర్దాక్షిణ్యమైన రజాకార్లు, భూస్వాముల సైన్యానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్నారు కమలమ్మ.
ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా నెల్లికుదు రు మండలం నైనాల గ్రామంలో 1901లో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో రం గారావు, రంగమ్మ దంపతులకు జన్మించారు కమలమ్మ. 15 ఏండ్ల వయసులోనే తెలంగాణ విమోచన పోరాటంలో భాగంగా రజాకార్లతో పోరాడేందుకు సాయుధ పోరాటంలో పాల్గొన్నారామె. తన భర్త చెన్నబోయిన ముకుందం అలియాస్ అప్పన్నతో కలిసి పోరాటంలో చేరడానికి ముందే పెద్ద కుమారుడిని వారి అత్తమామల వద్ద విడిచిపెట్టారు. అజ్ఞాతంలో ఉండగా పుట్టిన మరో కుమారుడిని విడిచిపెట్టాలని, లేదంటే పోరాటం నుంచి తొలగిపొమ్మని ఆ దంపతులకు దళం కమాండర్ ఎం.ఓంకార్ చెప్పారు. చంటి పిల్లవానితో ఉండటం వల్ల శత్రువులకు దొరికిపోయే ప్రమాదం ఉందని ఆయన భావించారు. రక్త సంబంధం కన్నా, వర్గ సంబంధమే విలువైనదిగా భావించి దంపతులిద్దరూ ప్రజారక్షణ, సాయుధ దళాల ప్రాణాలే ముఖ్యమంటూ పసికందును అడవిలో ఒక గుర్తు తెలియని కోయ జాతి కుటుంబానికి దానం చేశారు.
సాయుధ పోరాటంలో పాల్గొంటూనే నర్సుగా, సాంస్కృతిక బృందంలో సభ్యురాలిగా, దళంలో సాయుధ పోరాట యోధురాలిగా కమలమ్మ సేవలందించారు. ఆమె తన పాటలు, ధైర్యసాహసాలతో వందలాది మంది సాయుధ పోరాట యోధులకు, సామాన్య ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. ఆనాటి అజ్ఞాత కవి తిరునగరి రామాంజనేయులు రచించిన ‘సై.. సై.. గోపాలరెడ్డి.. నీవు నిలిచావూ ప్రాణాలొడ్డి’ పాట తన కంచు కంఠంతో పాడి దేశవ్యాప్తంగా పీడిత ప్రజల గుండెల్లో మార్మోగించారు. వృద్ధాప్యంలో కూడా నిజాం నిరంకుశత్వంపై అనేక పాటలు ఆలపించారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన తర్వాత కమ్యూనిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సీపీఐ మహిళా సమాఖ్య కార్యదర్శిగా కూడా కమలమ్మ సుదీర్ఘకాలం పనిచేశారు.
8, 9వ తరగతుల సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల్లో హైదరాబాద్ విముక్తి కోసం ఆమె చేసిన పోరాటానికి సంబంధించిన పాఠ్యాంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పొందుపరిచింది. 2008లో ఆమె పేరును నోబెల్ శాంతి బహుమతికి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ప్రతిపాదించింది. కానీ సకాలంలో ప్రతిపాదనలు పంపకపోవడంతో ఆ ప్రతిపాదన నిలిచిపోయింది. అణగారిన ప్రజల స్వేచ్ఛకు ఆమె చేసిన కృషికి గుర్తింపుగా 2016లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ విశిష్ట మహిళా పురస్కారంతో తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. 2018 మార్చి 11న కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్లో ఆమె మరణించారు.
సాయి లోహిత పులపా