దేశ పురోభివృద్ధిలో కార్మికుల భాగస్వామ్యం గణనీయంగా ఉంటుంది. కార్మికుల శ్రమ ఫలితంగా మన దేశం పారిశ్రామిక ప్రగతి ఎంతగా సాధించిందో చూస్తూనే ఉన్నాం. కానీ, కార్మికుల కష్టానికి తగ్గ ప్రతిఫలం వారికి దక్కడం లేదు. అందుకు భిన్నంగా వారి భవిష్యత్తు ప్రయోజనాల కోసం ఉద్దేశించిన సంక్షేమ పథకాలు లోపభూయిష్టంగా తయారయ్యాయి. కాలానుగుణంగా వాటిని మెరుగుపరచకపోవడంతో అవి వారి జీవిత చరమాంకంలో కనీస అవసరాలు తీర్చలేకపోతున్నాయి. పీఎఫ్ పెన్షన్ పేరిట కేంద్ర ప్రభుత్వం అరకొరగా పైసలు విదుల్చుతున్న సంగతి విదితమే. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు పింఛన్దారుల పట్ల చూపుతున్న నిర్లక్ష్య వైఖరే ఇందుకు ప్రధాన కారణం.
1952 నవంబర్ 1 నుంచి కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ చట్టాన్ని ప్రవేశపెట్టింది. 1971 మార్చి 1న అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్యామిలీ పింఛన్ పథకాన్ని తీసుకువచ్చింది. పదవీ విరమణ అనంతరం ఉద్యోగి తన శేష జీవితాన్ని సౌకర్యవంతంగా గడిపేందుకు వీలుగా దీన్ని తీర్చిదిద్దింది. ఉద్యోగి బేసిక్ వేతనం, డీఏతో కలిపిన మొత్తానికి 2.32 శాతం కాంట్రిబ్యూషన్ మినహాయించి ఈ పథకానికి జమ చేస్తుంది. దానికి ప్రభుత్వ వాటాగా 1.16 శాతం జమచేస్తుంది. 1995 నవంబర్ 16న మరింత వెసులుబాటు కల్పిస్తూ దాని స్థానంలో ఈపీఎస్-95 పథకాన్ని తీసుకువచ్చింది. దీనిలో కాంట్రిబ్యూషన్ను 2.32 శాతం నుంచి 8.33 శాతానికి పెంచింది. ప్రభుత్వ వాటా గతంలో మాదిరిగా 1.16 శాతం మాత్రమే ఉండటం గమనార్హం.
ప్రభుత్వం చెల్లించే వాటాను 1.16 శాతం నుంచి 8.33 శాతానికి పెంచాలని 2013లో కోషియారి కమిటీ తన నివేదికలో పేర్కొన్నది. తద్వారా డీఏతో కలిపి కనీస పింఛను రూ.3 వేలు ఇవ్వాలని ప్రభుత్వానికి అందులో సూచించింది. ఆ నివేదికను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను పదవీ విరమణ పొందిన ఉద్యోగులు భరించలేకపోతున్నారు. నేటికీ కనీస పింఛన్ రూ.1000, గరిష్ఠంగా రూ.3000 అందుతున్నది. 1971-75 మధ్యకాలంలో సర్వీసులో ఉన్న ఉద్యోగులను పెన్షనబుల్ సర్వీసుగా పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల వారికి భారీగా నష్టం జరుగుతున్నది.
ఫ్యామిలీ పింఛన్ స్కీం మూలధనం రూ.8419.54 కోట్లు. దీన్ని ప్రాథమిక మూలధనంగా ఈపీఎస్-95లోకి తీసుకువచ్చింది. పింఛన్కు అర్హత లేనివారికి వారి కాంట్రిబ్యూషన్కు కొంత వడ్డీ కలిపి చెల్లిస్తున్నది. తద్వారా మూలధనం 93 రెట్లు వృద్ధి సాధించి 2023 మార్చి 31నాటికి రూ.7,80,308.93 కోట్లుగా ఉన్నది. కార్మికులు చెల్లించిన కాంట్రిబ్యూషన్ మీద వచ్చిన చక్రవడ్డీలో 60 శాతం మాత్రమే పింఛన్లు, పింఛన్ అర్హతలేని వారికి చెల్లించే మొత్తం కింద వినియోగిస్తుండటం దీనికి ముఖ్య కారణం. అంటే కార్మికులు చెల్లించిన కాంట్రిబ్యూషన్ ఈపీఎఫ్వో దగ్గర అలాగే ఉన్నది.
2023 మార్చి 31నాటికి ఉద్యోగస్థులు చెల్లించిన కాంట్రిబ్యూషన్ రూ.4,87,066.16 కోట్లు (87.18 శాతం). ప్రభుత్వం చెల్లించిన వాటా రూ.68,350.63 (12.20 శాతం) కోట్లు. ఇతర ఆదాయం రూ.3,297.24 కోట్లు (0.62 శాతం).
1995 నవంబర్ 16 నుంచి 2023 మార్చి 31 వరకు చెల్లింపుల మీద వచ్చిన చక్రవడ్డీ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ మీద రూ.3,77,186.39 కోట్లు (87.18 శాతం). గవర్నమెంటు కాంట్రిబ్యూషన్ మీద రూ.52,783.60 కోట్లు (12.20 శాతం). ఇతరత్రా వచ్చిన ఆదాయం మీద రూ.2,682.44 కోట్లు (0.62 శాతం). మొత్తం రూ.4,32,652.43 కోట్లు.
పింఛన్ చెల్లింపులు రూ.1,37,028.30 కోట్లు. పింఛన్ అర్హత లేని వారికి చెల్లించిన మొత్తం రూ.88,038.33 కోట్లు. మొత్తం చెల్లింపులు 2,25,066.63 కోట్లు, ఇది రూ.3,77,186.39 కోట్లలో (ఎంపాయిస్ కాంట్రిబ్యూషన్ మీద వచ్చిన వడ్డీ) 59.67 శాతం మాత్రమే. మిగిలిన 1,52,119.76 కోట్లు (40.33 శాతం) మూలధనంలో కలిపారు.
నేషనల్ పెన్షన్ స్కీం 2004 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ స్కీంలో నెలకు రూ.15,000 లెక్క కాంట్రిబ్యూషన్ 35 ఏండ్ల పాటు కడితే రూ.63,00,000 అవుతుంది. 35 ఏండ్లకు సంవత్సరానికి 10 శాతం వడ్డీ కలిపితే చక్రవడ్డీతో సహా రూ.5,74,24.151 అవుతుంది.
ఈ మొత్తానికి ఏటా 6 శాతం చొప్పున వడ్డీకి బ్యాంకులో జమ చేస్తే నెలకు రూ.2,87,121 వస్తుంది. రూ.5,74,24, 151 కాంట్రిబ్యూషన్ కట్టినవారికి చెందుతుంది. ఈపీఎస్-95 ప్రస్తుత సీలింగ్ రూ.15,000 అంటే నెలవారీ కాంట్రిబ్యూషన్ రూ.1,250 ఇది రూ.15 వేలలో 12వ వంతు. ఈ విధంగా 35 ఏండ్లు పీఎఫ్కు చెల్లిస్తే రూ.5,25,000 అవుతుంది. దీనికి కూడా ఏడాదికి 10 శాతం వడ్డీ కలిపితే చక్రవడ్డీతో సహా రూ.47,85,346 అవుతుంది. ఈ మొత్తం పీఎఫ్కు చేరుతుంది. కాంట్రిబ్యూషన్ కట్టినవారికి కేవలం రూ.7,929 నెలకు పింఛన్ వస్తుంది. (15,000/70X37 (35+2). ఎన్పీఎస్ ప్రకారం నెలకు రూ.23,927 పింఛన్ కింద రావాలి (2,87,121/12) కానీ, రాదు.
1995 నవంబర్ 16 నాడు ఈపీఎస్-95 పింఛన్ ప్రవేశపెట్టినప్పుడు వృద్ధుల పింఛన్ నెలకు 75 రూపాయలు ఉండేది. ఇది 2004లో రూ.200 అయ్యింది. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత 5 రెట్లు పెరిగి రూ.1000 అయింది. తదుపరి 2018లో 2 రెట్లు పెరిగి 2,016 అయింది. అంటే 75 రెట్లు పెరిగింది.
75,58,913 పింఛన్దారులకు గాను 2022-23లో రూ.14,444.60 కోట్లు చెల్లించారు. అంటే సగటున నెలకు 1,592 మాత్రమే చెల్లించారు. ప్రస్తుత ఉద్యోగస్థుల పింఛన్ విధానంలో ఈపీఎస్-95 పథకానికి ఎన్పీఎస్ పింఛన్కు ఉన్న తారతమ్యం ఇది. పింఛన్ లెక్కించే విధానంలో ఈపీఎస్-95 కింద పనిచేసి రిటైరైన పబ్లిక్ సెక్టారు, ప్రైవేటు సెక్టారు ఉద్యోగులకు, ప్రభుత్వరంగంలో రిటైరైన ఉద్యోగులకు ఇంత తేడా ఎందుకు ఉండాలి? దేశాభివృద్ధిలో వీరిరువురికి సమాన ప్రాతినిధ్యం ఉన్నది. అలాంటప్పుడు ఈ వివక్ష ఎందుకు ఉండాలి? అనడిగితే వీటికి సమాధానం ఉండదు.
దేశంలో కనీస పింఛన్ పెంపు కోసం నిరీక్షిస్తూ 70 ఏండ్లు ఆపైబడిన వారు, వృద్ధులు, హయ్యర్ ఆప్షన్కు నోచుకోనివారు 80 శాతం మంది ఉన్నారు. వారి కనీస పింఛన్ 7500, డీఏతో కలిపి ఇవ్వవలసినదిగా దాదాపు ఆరేండ్లుగా ప్రభుత్వానికి నిరసనల ద్వారా తెలియజేస్తున్నారు. ప్రభుత్వం ఈపీఎస్-95 పథకాన్ని సమూలంగా సరిదిద్దాలి. లేకుంటే రాజ్యాంగ విలువలను సంరక్షించే విధంగా న్యాయవ్యవస్థ కలుగజేసుకోవాలి. ప్రాథమిక హక్కులకు భంగం లేకుండా సంఘంలో గౌరవప్రదంగా జీవించడానికి వారికి సాంఘిక భద్రత, ఆర్థిక భద్రత కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
కొల్లిపర శ్రీనివాసరావు
95731 98333