భిన్న జాతులు, తెగలు, కులాలకు నిలయం మన దేశం. ఆనాటి హరప్పా వాసుల నుంచి మొదలుకొని ఆదివాసీల వరకు సువిశాల భారత్లో భాగమే. వీరంతా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నివసించారు.. నివసిస్తున్నారు. జాతులు, తెగలు, కులాలు వేరు కాబట్టి మన మూలాలు కూడా వేరు అనే భావన భారతీయులలోనూ మొదటి నుంచి నాటుకున్నది. కానీ, ఆర్యులుగా పేర్కొనే ఉత్తర భారతీయులు, ద్రావిడులుగా చెప్పుకొనే దక్షిణ భారతీయులు ఒకరేనని, జన్యుపరంగా వీరి మధ్య తేడాలు అంతగా లేవని పలు పరిశోధనల్లో స్పష్టమడం విశేషం. సంస్కృతులు, ప్రాంతాలు వేరైనా, అందరిలోనూ ఒకే రకమైన జన్యువులు ఉన్నందుకేనేమో మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తున్నది.
సింధూ నాగరికత తవ్వకాల్లో బయటపడిన మానవ అవశేషాలపై జరిపిన ఆధునిక జన్యు పరిశోధనలను ప్రముఖ ఫ్రెంచ్ రచయిత, చరిత్రకారుడు ఫ్రాన్స్వా గోటే 2020లో ప్రచురించిన ‘ఆన్ ఎంటైర్లీ న్యూ హిస్టరీ అఫ్ ఇండియా’ గ్రంథంలో ఉదహరించారు. వీటితో పాటు మన దేశంలోని అనేక ఆదిమ తెగల, కులాల జన్యు వారసత్వం గురించి గోటే తన గ్రంథంలో పేర్కొన్నారు. ఈ జన్యు పరిశోధనల ఆధారంగా (ఆర్యులుగా గుర్తింపుపొందిన) ఉత్తర భారతీయులు, (ద్రావిడులుగా పేరొందిన) దక్షిణ భారతీయుల మధ్య ఎలాంటి జన్యుపరమైన తేడాలు లేవని నిర్ధారించారు. వీరంతా ఒకే కుదురువారని స్పష్టం చేశారు. జన్యు శాస్త్రవేత్త పార్థా మజుందార్ ఈ అంశంపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. మన దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజల మధ్య ప్రాంతీయ, భాషా, సాంస్కృతిక భేదాలు ఉన్నప్పటికీ, వారి మధ్య జన్యుపరమైన తేడాలు లేవని తేల్చారు. హరప్పావాసులు, ప్రస్తుత భారతీయుల ‘వై’ క్రోమోజోముల ఏకరూపత అత్యంత ప్రధానమైన అంశంగా పరిశోధనలో తేలిందని ఆయన చెప్పారు. మన దేశంలోని పది విభిన్న తెగలు, జాతుల జన్యు పరంపరలపై పరిశోధనలు చేసిన ప్రముఖ మానవ శాస్త్రవేత్త రాయ్ చౌదరి కూడా ఇదే విషయాన్ని తేల్చిచెప్పడం గమనార్హం.
దక్షిణ భారత్లోని ఆదివాసీ తెగల జన్యు పరంపరల గురించి పరిశోధనలు చేసిన కవిసిల్డ్.. మన దేశంలోని కులాలు, ఆదివాసీల మధ్య జన్యుపరంగా చెప్పుకోదగ్గ తేడాలు లేవని స్పష్టం చేశారు. వీటితో పాటు 2017లో భారతీయ ఆదివాసీ తెగలు, వివిధ కులాల జన్యు పరంపరలపై పరిశోధనలు చేసిన జన్యు శాస్త్రవేత్త ఎం.రెడ్డి పరిశోధనలను కూడా ఫ్రాన్స్వా గోటే ప్రస్తావించారు.
సింధూ నాగరికతకు చెందిన అతి విశాలమైన రాఖీగఢ్ కట్టడాల్లో బయటపడిన మానవ అవశేషాలపై ప్రొఫెసర్ వసంత్ షిండేతో పాటు భారత్, అమెరికాకు చెందిన 28 మంది పురాతత్వవేత్తలు, జన్యుశాస్త్ర నిపుణుల బృందం విస్తృత పరిశోధనలు నిర్వహించింది. క్రీస్తు పూర్వం 2800 కాలం నాటి ఈ ప్రాంత మానవ అవశేషాల జన్యు పరిశోధనల ద్వారా అనటోలియా, ఇరాన్ నుంచి ఆర్యులు ఇక్కడకు వలస వచ్చినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని తేలింది. అప్పటి నుంచి ఇప్పటివరకు సింధూ నాగరికత విస్తరించిన ప్రాంతవాసుల డీఎన్ఏలలో ఏకరూపత ఉన్నదని 2019లో ప్రచురించిన వీరి పరిశోధనలో స్పష్టమైంది.
ఆర్యజాతి ఔన్నత్యాన్ని చాటడానికి హిట్లర్, జర్మన్ నాజీలు జన్యుశాస్ర్తాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించారు. మరోవైపు తమ గతితార్కిక భౌతికవాదానికి వ్యతిరేకంగా జన్యు శాస్త్ర పరిశోధన ఫలితాలు ఉన్నాయన్న నెపంతో సోవియట్ యూనియన్లో ఎందరో జన్యుశాస్త్రవేత్తలను మార్క్సిస్ట్ స్టాలిన్ మట్టుబెట్టారు. కారాగారాల్లో బంధించారు. రాజకీయ ప్రయోజనాల కోసం శాస్త్రీయ పరిశోధనలను దుర్వినియోగం చేస్తే దాని పర్యవసానంగా చరిత్ర వక్రీకరణకు గురై సమాజం తప్పుదోవపడుతుంది.
అందువల్ల ముందుగానే ఒక రాజకీయ భావజాలం, సిద్ధాంతాలకు తమ బుర్రను తాకట్టు పెట్టిన వారితో కాకుండా, ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిశోధనల నేపథ్యంలో చరిత్రను వాస్తవ దృక్పథంతో చెప్పే నిజమైన శాస్త్రవేత్తల అవసరం ఉన్నది. భారత చరిత్ర సంఘం ఈ విషయంలో చొరవ తీసుకొని ఆయా రంగాల్లో నిపుణులైన జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలను సమగ్రంగా ప్రచురించాలి. మన మూలాలను మనం సరిగ్గా అర్థం చేసుకోవడానికి దేశంలోని విభిన్న ప్రాంతాల్లో పురాతత్వ పరిశోధనల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. సరిపడా నిధులు కేటాయించాలి. ఎందుకంటే, ప్రపంచంలోనే వేల ఏండ్లుగా కొనసాగుతున్న ఏకైక సంస్కృతి మనదే.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వద్ద జరిపిన తవ్వకాల్లో క్రీస్తు పూర్వం 2200 నాటి ఇనుప సాధనాలు లభించాయని ఫ్రాన్స్వా గోటే పేర్కొన్నారు. ఘన చరిత్ర కలిగిన తెలంగాణ గురించి మన చరిత్ర పాఠ్యాంశాల్లో అసమగ్రంగా ఉన్నదని దీన్నిబట్టే స్పష్టమవుతున్నది. అందుకే, రాజకీయ ప్రయోజనాల కోసమో, సైద్ధాంతిక భావజాలాల వ్యాప్తి కోసమో కాకుండా ఆధునిక శాస్త్రసాంకేతిక పరిశోధనలు వెల్లడించే వాస్తవ చరిత్రను తెలుసుకుందాం.
-ఆనందేశి నాగరాజు