నేడు బుద్ధ పూర్ణిమ
క్రీ.పూ.623వ సంవత్సరంలో ఇప్పటి నేపాల్లోని లుంబినిలో ఒక రాజ కుటుంబంలో బుద్ధుడు జన్మించారు. కానీ ఆయన రాజు గానీ, చక్రవర్తి గానీ కాలేదు. ఒక గొప్ప తథాగత బుద్ధుడుగా ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.
బుద్ధుడు తన పూర్తి తాత్విక బోధనలన్నింటిలోనూ దైవ ప్రసక్తి లేకుండా దైవాన్ని నిరాకరించి ఆ చోట సత్యానికి ప్రాధాన్యాన్నిచ్చారు. దుఃఖానికి కారణం కోరిక అని, మనిషికి కోరిక ఉండకూడదనే భావరాహిత్య ఆవశ్యకతను వివరించారు.
గౌతమ శాక్యమౌని తన బోధనల్లో ప్రజ్ఞ, కరుణ, శీలం అనే మూడు గుణాలు మానవున్ని ఉదాత్త స్థాయికి తీసుకువెళ్తాయని పేర్కొంటారు. కరుణ లేని ప్రజ్ఞ వ్యర్థం, ప్రజ్ఞ లేని శీలం దుర్బలం. ఈ మూడు ఉన్నప్పుడే మానవుడు బుద్ధత్వాన్ని చేరుకుంటాడు. కరుణార్ద్ర హృదయం లేని ప్రజ్ఞ నిస్సారమైనదని బౌద్ధం చెప్తుంది. అసలు బుద్ధత్వం అంటే రెండు రకాల జ్ఞానాల పతనం జరుగుతుంది. అందులో ఒకటి బయటి వస్తువు. రెండవది లోపలి వస్తువు. ఈ రెండూ ఉండని స్థితియే బుద్ధత్వం.
బౌద్ధం జ్ఞానం కన్నా ప్రజ్ఞకు ఎక్కువ ప్రాముఖ్యాన్నిస్తుంది. జ్ఞానం విశ్వవిద్యాలయాల్లో విస్తారంగా దొరకవచ్చు కానీ ప్రజ్ఞను నీలో నీవే తెలుసుకోవాలి. ప్రజ్ఞ నీ స్మృతిలో నిలిచినప్పుడు ఆనందం. అంటే నీ స్మృతిలో నువ్వే ప్రశాంతంగా ఉండటం. అదే బుద్ధత్వం. జ్ఞానం గతానికి సంబంధించింది, ప్రజ్ఞ వర్తమానానికి సంబంధించింది. ఈ తేడాను తెలుసుకుంటే బుద్ధుని మార్గంలో ఉన్నట్టు. ఇది గురుశిష్యుల మధ్య మహా మౌనంగా ప్రసరిస్తూ ఉంటుంది. అది గురువు ఇచ్చేది కాదు. కానీ, శిష్యుడు స్వీకరించేది.
బౌద్ధం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలకు అత్యున్నత విలువనిచ్చింది. కుల, మత రహిత సమ సమాజ స్థాపనకు పూనుకొని దాన్ని ఆచరణలో పెట్టి భారతదేశ సమాజానికి ఆదర్శప్రాయంగా నిలబడింది. బౌద్ధంలో స్త్రీకి అత్యున్నతమైన విలువ, గౌరవం, స్వేచ్ఛను కల్పించింది. ఇలాంటి బౌద్ధం భారతదేశ సమాజానికే కాదు యావత్ ప్రపంచ వర్తమాన, భవిష్యత్తుకు ఒక గొప్ప దార్శనికంగా ఆదర్శప్రాయంగా ఉంటుంది.
(వ్యాసకర్త: అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫిలాసఫీ, ఓయూ)
డాక్టర్ సీహెచ్ వంశీధర్
90002 00088