బిడ్డకు తండ్రిని మించిన సంరక్షకుడు లేనట్టే, తెలంగాణ పిత కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్కు మించిన సంరక్షక పార్టీ లేదన్న చర్చలు మొలకెత్తినయి తెలంగాణలో. గత తొమ్మిదిన్నరేండ్లలో కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సాధించిన అపూర్వ ప్రగతిని ప్రజలు నెమరు వేసుకోవటమే అందుకు కారణం. తెలంగాణను ఇచ్చింది తామే అంటున్నది కాంగ్రెస్. కానీ, చావు అంచులదాకా వెళ్లి తెలంగాణ అనే శిశువును కన్నది కేసీఆర్. భారత పిత గాంధీ, ఆంధ్రప్రదేశ్ పిత పొట్టి శ్రీరాములు. తెలంగాణ పిత కేసీఆర్. అన్నది చారిత్రక సత్యం.
స్వతంత్ర భారతాభివృద్ధిని చూడకుండానే గాంధీని పొట్టన బెట్టుకున్నాడు మతోన్మాద గాడ్సే. ఆంధ్రప్రదేశ్ శిశువును చూసుకోకుండానే అమరులయ్యారు పొట్టి శ్రీరాములు. అయితే, తెలంగాణ ప్రజల అదృష్టవశాత్తూ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి పరిశ్రమించే సదవకాశం కూడా తెలంగాణ పితకే లభించింది. నాడు విద్యుత్, వ్యవసాయ, పారిశ్రామిక సంక్షోభాలతో తల్లడిల్లుతున్న తెలంగాణ నుంచి, పొట్టచేత బట్టుకొని వలసలెత్తారు ప్రజలు. ఆ ఆకలి తెలంగాణను అన్నపూర్ణగా రూపొందించేందుకు తనకంటూ ఒక ప్రణాళికను రూపొందించుకున్నారు కేసీఆర్. తొమ్మిదిన్నరేండ్లలోనే దశాబ్దాలుగా ఎదిగిన భారతాగ్ర రాష్ర్టాల సరసన తెలంగాణను నిలిపారు. దటీజ్ కేసీఆర్.
పంజాబ్, హర్యానాలకు దీటైన ధాన్యాగారంగా తెలంగాణను మార్చారు కేసీఆర్. వరి ఉత్పత్తి, అటవీ పునరుద్ధరణ, విద్యుత్ వినియోగం, స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయాలలో భారతాగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దారు. అత్యధిక గురుకులాలు, వైద్య కళాశాలలు, పాలనా భవనాలను నిర్మించారు. అత్యధిక జాతీయ అవార్డుల సాధనలో రాష్ర్టాన్ని ముందువరుసలో నిలిపారు. అద్భుత, ఆధ్యాత్మిక శిల్పకళా క్షేత్ర నిర్మాణంలోనూ దేశంలోనే ప్రథమ రాష్ట్రంగా తెలంగాణ పేరొందింది. ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా, నూరు శాతం సాగునీటి వనరులను పెంపొందించుకున్న ఏకైక రాష్ట్రంగా నీతి ఆయోగ్ నుంచి ప్రశంసలందుకున్నది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవటంలో, ఉగ్రవాద నిర్మూలన విధానాల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్, పోలీసు వ్యవస్థలను ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని మోదీ కూడా ప్రశంసించారు. దశాబ్ద కాలంలో ఒక్క మతకల్లోలం గానీ, ఉగ్రవాదుల విధ్వంసం గానీ తలెత్తని ప్రశాంత తెలంగాణను రూపుదిద్దారు. వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్తునిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. హైదరాబాద్కు క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అవార్డు, 1.65 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, సాగు, తాగునీరు అందించడం, ఎడ్యుకేషన్, ఐటీ హబ్ల నిర్మాణాలు.. ఇలా ఒక్కటేమిటి అనేక అంశాల్లో దేశానికే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారు. వ్యవసాయాభివృద్ధికి సమాంతరంగా పారిశ్రామికాభివృద్ధిని సాధించిన సవ్యసాచి. దటీజ్ తెలంగాణ పిత కేసీఆర్. అందుకే ఆయన కోసం నేడు భరతమాత ఎదురుచూస్తున్నది.
‘ముఖ్యమంత్రి పదవి కోసమే రాష్ర్టాన్ని కేసీఆర్ విభజించారు’ అని ప్రత్యర్థులు విమర్శించారు. కాదు గాక కాదు. పాలనా సౌలభ్యం, ప్రగతి సాధనలకు చిన్న రాష్ర్టాలే శ్రేయస్కరమన్న అంబేద్కర్ సూచనను ఆచరించారు కేసీఆర్. తెలంగాణ రాష్ర్టాన్ని చిన్న జోన్లు, చిన్న జిల్లాలుగా విభజించి, జిల్లాకో పాలనా భవనం, వైద్య కళాశాల వంటి ఎన్నో మౌలిక సదుపాయాలను కల్పించటమే అందుకు నిదర్శనం.
‘మన పూర్వీకులు, మహనీయుల కృషిని స్మరించటం, వారిని సత్కరించటమంటే మన ప్రగతికి బాటలు నిర్మించుకోవటమే’ అన్నారు ప్లేటో. తెలంగాణలో సాగునీటి చెరువులను నిర్మించింది మన పూర్వీకులైన కాకతీయులు. ఆకాశం నుంచి గంగమ్మను భూమ్మీదికి రప్పించిన మహనీయుడు భగీరథుడు. అందుకే సాగునీటి పథకానికి ‘మిషన్ కాకతీయ’గా, ఇంటింటికీ తాగునీటి పథకానికీ ‘మిషన్ భగీరథ’గా నామకరణం చేసి వాళ్లను సన్మానించారు కేసీఆర్. వారి కృషిని ఆదర్శంగా స్వీకరించారు. అలాగే రాజ్యాంగానుగుణంగా పాలన సాగించేందుకు వీలుగా అద్భుతమైన సచివాలయాన్ని నిర్మించారు. దాని ఎదుటే సుందరవనంలో మన రాజ్యాంగ కర్త అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించి ఆయన పట్ల కృతజ్ఞతను చాటుకున్నారు.
అటువంటి తెలంగాణ పిత కేసీఆర్ను.. తెలంగాణ సాగు, తాగునీటి కోసం నిర్విరామంగా పరిశ్రమించిన హరీశ్రావును, పట్టణ, ఐటీ రంగాల అభివృద్ధికి అపూర్వంగా పరిశ్రమించిన కేటీఆర్లను ముఖ్యమంత్రి దారుణమైన భాషలో విమర్శించటం శోచనీయం. పాలనను మరింతగా ప్రజలకు చేరువ చేసి, తెలంగాణ ప్రగతి కోసం అనన్య సామాన్యంగా పరిశ్రమిస్తున్న కేసీఆర్ను ప్రజలు దూరం చేసుకోవటం దురదృష్టకరమంటున్నారు సామాజిక శ్రేయోభిలాషులు.
ఇక రాజకీయ విశ్లేషకులు చెప్తున్న కారణాలు ఇలా ఉన్నాయి. కేసీఆర్ సర్కార్ చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరనే ధీమాతోనే ప్రజలకు వాటిని పదేపదే వివరించే కార్యక్రమాన్ని ఎన్నికలొచ్చే దాకా నిర్లక్ష్యం చేశారు బీఆర్ఎస్ నేతలు. కానీ, ‘నిన్న ఉదయం మీరేం తిన్నారు’ అని అడిగితే గుర్తు తెచ్చుకునేందుకు ఆలోచిస్తారు ఎవరైనా. అది మానవ నైజం. ఎంతటి ప్రోగ్రెసివ్ పార్టీ అయినా, ఈ లాజిక్కును విస్మరించకూడదంటున్నారు విశ్లేషకులు. ఎస్సీ, బీసీ, మైనారిటీల రంగాలకు చెందిన నేతలను అంశాల వారీగా అవగాహన కల్పించి, వాళ్లతోనే విమర్శలకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వంతో పాటు సమాంతరంగా పార్టీ క్యాడర్ను ఎడ్యుకేట్ చేసుకుంటూ బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలలా ప్రభావితం చేయగల క్యాడర్ను రూపొందించుకోవాలి. తద్వారా బీఆర్ఎస్ను మరింతగా బలోపేతం చేసుకోవచ్చు.
కేసీఆర్ దీక్షాదక్షతలను మహాభారతంలోని మందపాలుడనే పక్షి మహర్షితో పోలుస్తున్నారు. ఆ మహర్షి భార్యాబిడ్డలతో ఖాండవ వనంలోని మహా వృక్షం మీద నివసిస్తుంటాడు. జ్ఞానార్థియై నిరంతరం సంచరిస్తూ ఉంటాడాయన. బిడ్డల్ని కాపాడుకుంటూ అక్కడే ఉంటుంది అతని భార్య. ఒక రోజు అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహిస్తుంటాడు. ఎగసిపడుతున్న మంటల్ని చూసి ‘అయ్యో ఈయన ఇంటిపట్టున ఉండడు. రెక్కలు రాని ఈ బిడ్డల్ని నేనెలా కాపాడుకోగలను దేవుడా’ అని ఆమె దుఃఖిస్తుంటుంది. ఎక్కడున్నా తన దివ్యదృష్టి ద్వారా భార్యాబిడ్డల యోగక్షేమాలను గ్రహిస్తుంటాడు మందపాలుడు. ఆ ప్రమాదాన్ని గ్రహించి తన భార్యబిడ్డల్ని కాపాడాలని తనున్నచోటు నుంచే అగ్నిదేవుని ప్రార్థించారు. వాళ్లు నివసించే వృక్షానికి అల్లంత దూరం నుంచే తన దిశను మార్చుకున్నాడు అగ్నిదేవుడు. హమ్మయ్య అదృష్టవశాత్తూ బతికామనుకుంటుంది ఆయన భార్య. కానీ, తన భర్త తపోశక్తే తమను కాపాడిందన్న వాస్తవం ఆమెకు తెలియదు.
నిన్న, నేడు, రేపు.. తెలంగాణ వాణిని పార్లమెంట్లో ప్రతిధ్వనింపజేయగలిగిన పార్టీ బీఆర్ఎస్.. బీఆర్ఎస్.. బీఆర్ఎస్సే. ఎందుకంటే, తెలంగాణను కన్న తల్లి బీఆర్ఎస్. కాంగ్రెస్, బీజేపీలు సవతి తల్లులు. ‘తన సొంత బిడ్డల యోగక్షేమాలు, ఎదుగుదలకు మాత్రమే సవతి తల్లి అంకితమవుతుంది’ అని దశాబ్దాల కాంగ్రెస్ పాలన, నవ వసంతాల బీఆర్ఎస్ పాలన నిరూపించాలని అన్నారొక పురోహితుడు. కాబట్టి తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రజా కవులు, గాయకులు, కళాకారులు.. కదం తొక్కుతూ, పదం పాడుతూ, పరిశ్రమిస్తూ, పరాక్రమిస్తూ రానున్న పార్లమెంట్లో బీఆర్ఎస్ను పున్నమి చంద్రునిలా భాసింపజేయాలి.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
పాతూరి వేంకటేశ్వరరావు