కొన్ని నెలలుగా పడమటి గాలులు తెలంగాణ ప్రాంతాన్ని చుట్టుముడుతున్నాయి. సముద్ర తీరం లేకుండా చుట్టూ భూమి మాత్రమే ఉన్న ఈ పదేండ్ల రాష్ట్రంలోకి పశ్చిమ లేదా వాయువ్య సరిహద్దుల నుంచి కాంగ్రెస్ ‘అలలు’ చొచ్చుకు వచ్చేస్తున్నాయట. వాటివల్ల తెలంగాణలో ‘కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చినట్టు, కన్నడ గాలులే తెలంగాణలో హస్తం పార్టీని గట్టెక్కిస్తాయ’నే ప్రచారం ఒక వర్గం మీడియాలో సాగుతున్నది. ఏ మాత్రం హేతుబద్ధం కాని ఈ వింతవాదన గత తొమ్మిదిన్నరేండ్లుగా అధికారం లేకుండా నీరసించి ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దింపుడుగల్లం ఆశలయ్యాయి.
తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ మొదటినుంచి ముందంజలో ఉన్నది. రాష్ట్రంలో 2014 జూన్ నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా బీఆర్ఎస్ బలం చెక్కు చెదరలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పార్టీకి ఏర్పడిన విస్తృత పునాది స్థిరంగా ఉన్నది.
కన్నడ కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్ పోయిన ప్రాణాలు లేచివచ్చాయని చాటింపు వేసుకుంటున్నారు. 2023 మండుటెండల్లో కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణలో జరుగనున్న శాసనసభ ఎన్నికలపై ఉంటుందనేది కొందరు కాంగ్రెస్ అనుకూల ఎన్నికల విశ్లేషకుల అభిప్రాయం. ఇది ఆకాంక్షగా ఉంటే ఫరవాలేదు కానీ, దాన్ని ఎల్లకాలాలకూ వర్తించే రాజకీయ సూత్రంగా ప్రచారం చేయడమే మానసిక సోమరితనం. తాము కోరుకుంటున్న ఈ ఫలితం ‘ఆజ్మాసిస్’ (ద్రవాభిసరణం) అనే భౌతికశాస్త్ర ప్రక్రియ మాదిరిగా ఉంటుందని ఈ రాజకీయ పండితులు ప్రచారం చేస్తున్నారు. దక్షిణాదిన సాగరతీరం లేని ఏకైక రాష్ట్రమైన తెలంగాణపై సరిహద్దు రాష్ర్టాల రాజకీయ పరిణామాల ప్రభావం అనేది సమయం, సందర్భాల మీద ఆధారపడి ఉంటుంది. ఊరికే పదే పదే ఊదరగొడితే ఏం లాభం? అయితే, కన్నడ రాజకీయం ఇక్కడ పునరుక్తమవుతుందని, తమను గద్దెనెక్కిస్తుందనే భ్రమల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు గత కొద్ది నెలలుగా బతుకుతున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పడానికి కర్ణాటక ముస్లింలు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మూకుమ్మడిగా హస్తం గుర్తుకు ఓట్లేశారనే వాదన తీసుకొస్తున్నారు. ఐదేండ్ల అస్తవ్యస్త పాలనపై వ్యతిరేకతతో మిగిలిన సామాజికవర్గాల మాదిరిగానే మైనారిటీలు కూడా అక్కడ అధిక సంఖ్యలో కాంగ్రెస్ వైపు మొగ్గి ఉండవచ్చు. అంతేగానీ, అక్కడి రాజకీయ పరిస్థితులకు, తెలంగాణ పరిస్థితులకు ఏ మాత్రం పొంతన లేదని బుర్ర ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. అసలు కన్నడ శాసనసభ ఎన్నికల్లో పాలకపక్షమైన బీజేపీకి, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత హెచ్డీ కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు ఏడాది రెండు నెలలకే అంతర్గత వైరుధ్యాలతో కుప్పకూలిపోయింది. కొందరు పాలక కూటమి ఎమ్మెల్యేల ఫిరాయింపుతో తర్వాత బీఎస్ యడియూరప్ప, బసవరాజ్ బొమ్మయి నాయకత్వాన దాదాపు నాలుగేండ్లు గందరగోళ పాలన సాగింది.
అప్పట్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ముస్లిం ఆడపిల్లలు ధరించే హిజాబ్ వంటి సున్నిత అంశాలతో బీజేపీ సర్కారు చెలగాటమాడింది. మైనారిటీలు భయోత్పాతానికి గురయ్యేలా చేసింది. ఈ పరిస్థితుల్లో ముస్లింలు అధిక సంఖ్యలో 2023 కన్నడ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా మరో జాతీయపక్షానికి ఓటేసి ఉండవచ్చు. కానీ, అసలు పేరుకు త్రిముఖ పోటీగా కనిపిస్తున్న తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేనప్పుడు, అది గత ఐదేండ్లుగా పాలకపక్షం కానప్పుడు ఇక్కడి ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా ఓటు వేసి గెలిపిస్తారనేది గోబెల్స్ ప్రచారమే. ముస్లింల భద్రతకు గాని, వారి సంక్షేమానికి గాని ఎలాంటి ఇబ్బంది లేని తెలంగాణలో మైనారిటీలు హస్తం పార్టీకి దగ్గరవుతున్నారని కొందరు పరిశీలకులు వేస్తున్న అంచనా ఏ మాత్రం హేతుబద్ధంగా లేదు. ఐదేండ్లుగా తెలంగాణలో నడుస్తున్నది లౌకిక విధానాలు అనుసరించే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అని పైన చెప్పిన ప్రచారహోరులో చిక్కుకున్న రాజకీయ పండితులు మర్చిపోతున్నారు.
ఇతర రాజకీయపక్షాల అజెండాలను గుంజుకొని తనవిగా ప్రచారం చేసుకోవడం కాంగ్రెస్కు అలవాటే. 1960ల చివరలో, 1970ల మొదట్లో కమ్యూనిస్టుల అజెండాలోని కొన్ని అంశాలను నాటి కాంగ్రెస్ మాజీప్రధాని ఇందిరాగాంధీ తన సొంతవిగా చెప్పుకొంటూ వరుసగా 1971 పార్లమెంట్, 1972 అసెంబ్లీల ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పట్లో కాంగ్రెస్ నేతల నోట ‘సోషలిజం’ అనే మాట తెగ వినిపించేది. ఇప్పుడు కూడా కాంగ్రెస్
అగ్రనేత రాహుల్గాంధీ తన నాయనమ్మ మార్గంలో పయనిస్తున్నారు.
‘లోహియా సోషలిజం’ తమ లక్ష్యమని చెప్పుకొనే సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, జేడీయూ వంటి జనతా పరివార్ పార్టీలు పదిహేనేండ్లుగా చేస్తున్న ‘కులగణన’ డిమాండ్ను తన ఒరిజినల్ ఐడియాలా కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రచారం చేసుకుంటున్నది. ఓబీసీల సంక్షేమం కోసమే కులాలవారీ జనాభా లెక్కలు సేకరించాలంటున్న కాంగ్రెస్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ప్రధాన రాష్ర్టాల్లో వెనుకబడిన కులాలవారికి ఇచ్చిన టిక్కెట్లు చాలా తక్కువ. మధ్యప్రదేశ్లో పాలకపక్షం కన్నా కాంగ్రెస్ తక్కువమంది బీసీ నేతలకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చింది. ఆరున్నర శాతం ముస్లిం జనాభా ఉన్న మధ్యప్రదేశ్లో ఈ వర్గం నేతలు ఇద్దరికి మాత్రమే బీఫారాలు ఇచ్చింది. నిజానికి కులగణన ప్రభావం హిందీ రాష్ర్టాల్లోనే ఎక్కువ. తెలంగాణలో ఎంతో ఆర్భాటంగా ప్రతి పార్లమెంటు స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండేసి చోట్ల బీసీలకు టికెట్లు ఇస్తామని గొప్పగా ప్రకటించుకున్న కాంగ్రెస్ వాస్తవానికి బీఆర్ఎస్ కన్నా తక్కువ మంది బీసీలను బరిలో నిలిపింది. ఏకకాలంలో మైనారిటీలను, ఓబీసీలను మాయచేయడం సాధ్యం కాదని డిసెంబర్ 3న ఈ ‘గ్రాండ్ ఓల్డ్ పార్టీ’ (జీఓపీ)కి అర్థం కాబోతున్నది.
తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ మొదటినుంచి ముందంజలో ఉన్నది. రాష్ట్రంలో 2014 జూన్ నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా బీఆర్ఎస్ బలం చెక్కు చెదరలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పార్టీకి ఏర్పడిన విస్తృత పునాది స్థిరంగా ఉన్నది. ‘కాంగ్రెస్ ఇక్కడ పుంజుకుంటున్నదని నిరూపించడానికి కొన్ని సంస్థలు చేసిన సర్వేలకు పద్ధతి, పాడు లేదు’ అని ఇటీవల ఇంగ్లిష్ న్యూస్ చానల్ ‘ఇండియా టుడే’లో ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు, ప్రసిద్ధ రాజకీయ, సామాజికశాస్ర్తాల అధ్యయన సంస్థ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) ఎన్నికల సర్వేల విభాగం ‘లోక్నీతి’ సహ సంచాలకుడు డాక్టర్ సంజయ్కుమార్ వ్యాఖ్యానించారు. గత రెండేండ్లలో జరిగిన యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ తమిళనాడు తదితర రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సంజయ్కుమార్ అంచనాలు నిజమయ్యాయి. ‘కంటి వెలుగు’ వంటి అనేక వినూత్న పథకాలు 45 శాతానికి పైగా తెలంగాణ ఓటర్లను మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడానికి ప్రేరేపిస్తాయనే అంచనా నూరు శాతం నిజమయ్యేలా ఉంది. తెలంగాణ ఉద్యమ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ దేశ తూర్పు తీరంలోని పశ్చిమబెంగాల్, ఒడిశాలోని ప్రాంతీయ పాలకపక్షాల మాదిరిగానే మూడు దశాబ్దాలకు పైగా ఎన్నికల్లో విజయం సాధిస్తూనే ఉంటుందని, కాంగ్రెస్ నేతలు తమ కలల్లో అనుభవిస్తున్న ‘కన్నడ రాజ్య గాలులు’ తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపించలేవనేది సత్యం.
-నాంచారయ్య మెరుగుమాల
79819 42329