Sonam Kapoor | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహుజా మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి సినిమా లేదా వ్యక్తిగత జీవితం కారణంగా కాదు.. లండన్లో ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన వివాదం కారణంగా ఈ జంట చర్చనీయాంశంగా మారింది. అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన లండన్లోని నాటింగ్ హిల్ ప్రాంతంలో నివసిస్తున్న ఈ స్టార్ కపుల్పై స్థానికులు పలు ఆరోపణలు చేస్తున్నారు.సోనమ్ కపూర్, ఆనంద్ అహుజా దంపతులు దాదాపు మూడేళ్ల క్రితం లండన్లోని నాటింగ్ హిల్ ప్రాంతంలో ఒక పాత బంగళాను భారీ ధరకు కొనుగోలు చేశారు. సుమారు 21 మిలియన్ పౌండ్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.270 కోట్లకు ఈ ఆస్తిని సొంతం చేసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆ ఇంటిని అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు మరో 4.7 మిలియన్ పౌండ్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దంపతులు తమ పిల్లలతో కలిసి అక్కడే నివసిస్తున్నారు.
ఇటీవల ఈ జంట తమ నివాసానికి సమీపంలోని ఒక అపార్ట్మెంట్లో ఐదు ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు బ్రిటీష్ మీడియా కథనాలు వెలువడ్డాయి. దాదాపు 4 మిలియన్ పౌండ్లు, అంటే రూ.51 కోట్లకు పైగా విలువైన ఈ ఫ్లాట్లను సిబ్బంది కోసం కేటాయించనున్నారనే ప్రచారం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వార్తలతో అపార్ట్మెంట్లో నివసించే పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ నివాస ప్రాంత స్వరూపం మారిపోతుందని, భారీ స్థాయిలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారికి పరోక్ష ఒత్తిళ్లు వస్తున్నాయని కూడా కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
అయితే ఈ ఆరోపణలపై సోనమ్ కపూర్ తరఫు ప్రతినిధులు స్పందించారు. ఆ ఫ్లాట్ల కొనుగోలు కపుల్ వ్యక్తిగత అవసరాల కోసం కాదని, భవిష్యత్తు పెట్టుబడుల దృష్ట్యా సంబంధిత కంపెనీ కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు. దీనికి సోనమ్ లేదా ఆమె కుటుంబంతో నేరుగా సంబంధం లేదని కూడా వెల్లడించారు. కాగా, ఆనంద్ అహుజా భారతదేశంలోని ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన ఫ్యాషన్, రిటైల్ రంగాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ పలు వ్యాపార సంస్థలను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లండన్లో ఆస్తుల వ్యవహారం అంతర్జాతీయంగా చర్చకు దారితీయడంతో ఈ వివాదం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.