నిన్నమొన్నటి పిల్లలకు బహుశా ఈ పేరు కొంత కొత్తగా అనిపించొచ్చు కానీ తెలంగాణ యవనిక మీద తొమ్మిదిన్నర దశాబ్దాల పాటు ఎగిరిన ఉద్యమ జెండా డాక్టర్ బోయినపల్లి వెంకటరామారావు. భారత స్వాతంత్రోద్యమం మొదలుకుని మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు తెలుగు నేలమీద ఆయన పాల్గొనని ఉద్యమం లేదు. ‘బోవెరా’గా ప్రసిద్ధులైన బోయినపల్లి బాల్యంలోనే ఉద్యమంలోకి అడుగుపెట్టారు. 1935లో సిరిసిల్లలో జరిగిన ‘చతుర్థాంధ్ర మహాసభ’లో విద్యార్థి కార్యకర్తగా పాల్గొన్నారు బోయినపల్లి. అదే ఆయనను ప్రజా సేవారంగంతో పాటు ఉద్యమంలోకి ప్రవేశించడానికి కొత్తదారుల్ని చూపించింది.
ఆ స్ఫూర్తితో తన జన్మస్థలమైన కరీంనగర్ జిల్లా తోటపల్లిలో పదిహేడేండ్ల వయసులోనే ‘ఆంధ్ర విజ్ఞానవర్ధినీ గ్రంథాలయం’ స్థాపించి గ్రంథాలయోద్యమం దిశగా తన తొలి అడుగు వే శారు. నిజాం పాలనా సమయంలో, అం దులోనూ ‘గస్తీనిశాన్’ అమలులో ఉ న్న సందర్భంలో గ్రంథాలయాన్ని ప్రారంభించడం అత్యంత సాహసోపేతమైన చర్యనే కాదు, ధిక్కారస్వరం కూడా. వెంటనే నిజాం ప్రభుత్వం ఆ గ్రంథాలయాన్ని స్వాధీనం చేసుకుని బోయినపల్లిని, ఆయ న మిత్రులను ఖైదు చేసింది.
గాంధీ విధానాలు, పోరాటాలు బోయినపల్లిని అత్యంత ప్రభావితం చేశాయి. గాంధీ రచనలు చదివి వాటిపట్ల ఆకర్షి తులై గాంధీ అభిమానిగా, గాంధేయవాదిగా మారిన బోయినపల్లి భారత స్వాతంత్రోద్యమంలో కార్యకర్త అయ్యారు. గాం ధీ ఏ పిలుపునిచ్చినా దాన్ని తన ప్రాంతం లో ఆచరిస్తూ ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిలించారు. 1946 జనవరి 1న గాంధీ మద్రాసు హిందీ ప్రచారసభ కార్యక్రమం లో పాల్గొని సేవాగ్రాం వెళుతున్నప్పుడు వరంగల్ రైల్వేస్టేషన్లో గాంధీని దర్శించుకున్న బోయినపల్లి ఆయన నిరాడంబర వ్యక్తిత్వం, ఆశయాలపట్ల పూర్తిగా అంకితమైపోయారు.తొంభైనాలుగేండ్ల వయస్సు వరకు ఆయన ఆ సిద్ధాంతాలను, ఆశయాలను, నడకను, నడతను ఉనికిగా చేసుకున్నారు. అలా గాంధేయవాదిగా ‘తోటపల్లి గాంధీ’, ‘తెలంగాణ గాంధీ’గా ప్రజల హృదయాల్లో నిలిచారు.
ఆర్య సమాజోద్యమంలో కరీంనగర్ ప్రాంతంలో మమేకమై పనిచేసిన వీరు ఆ ప్రభావంతో కాంగ్రెస్ పార్టీలో ఆర్గనైజర్గా చేరి చురుకైన పాత్ర పోషించారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన జిల్లా కాంగ్రెస్ మహాసభను అన్నీ తానై నిర్వహించారు. 1942 లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కరీంనగర్ జిల్లా బెజ్జంకిలో వీరి సారథ్యంలో జరిగిన పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. అక్కడి జనానికి పోరా టం, తిరుగుబాటును నేర్పిన వీరు చాలాకాలం బెజ్జంకిలోనే నివాసం ఉన్నారు. పన్నునిరాకరణోద్యమం, మద్యపాన నిషేధోద్యమం, జైలర్ల దమననీతికి వ్యతిరేకంగా ఖైదీ సంఘటన సమితి స్థాపన మొదలుకుని కోర్టు బహిష్కరణోద్యమం వరకు వీరు ముందు నిలిచి పోరాడారు. అటు స్వాతంత్య్రోద్యమంతోపాటు, ఇటు నిజాంను గద్దెదింపే పోరాటం తెలంగాణలో సమానంగా నడిచాయి. నిజాం పోలీసులు తెలంగాణ గ్రామాల్లో చేసిన లెవీ వసూళ్ల వంటివి పేద రైతులను ఇబ్బందులకు గురిచేయగా తన దళంతో వారికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశారు. ఈ సమయంలోనే బెజ్జంకికి హయగ్రీవాచారి, బూర్గుల రామకృష్ణారావు, కేవీ రంగారెడ్డి వంటి నాయకులను రప్పించి ప్రజాచైతన్య సభలను నిర్వహించారు.
నిజాం రాజుకు వ్యతిరేకంగా ప్రతిచోట తిరంగను ఎగురవేసిన వీరు ఒక సందర్భంలో బెజ్జంకిని స్వతంత్ర గ్రామంగా ప్రకటించి నిజాం పాలననే సవాల్ చేసి నిలిచారు. గాంధీ పిలుపుతో అస్పృశ్యతా నివారణోద్యమంలో ముందు వరుసలో నిలిచారు బోయినపల్లి. హరిజన విద్యార్థులకు హాస్టళ్లలో బస కల్పించడం మొదలుకుని, బస్తీ, గ్రామాల్లో అస్పృశ్యత నివారణ దిశగా గాంధీ చూపిన ప్రతి పనిని చేశారాయన.
స్వాతంత్య్రానంతరం ‘దున్నేవాడిదే భూమి’ అన్న నినాదానికి ఆకర్షితులై ప్రజా సోషలిస్ట్ పార్టీలో చేరారు. అదే సమయంలో రెండుసార్లు రాష్ర్ట అసెంబ్లీకి పోటీచేశారు కూడా. వినోభాభావే, జయప్రకాశ్ నారాయణ ఆశయాలకు ఆసక్తుడైన బోయినపల్లి అనేక ‘ఆకలి సత్యాగ్రహాలు’ నిర్వహించారు. భూదానోద్యమంలో ముందు వరుసలో నిలిచి గ్రామగ్రామాన ప్రచారం చేశారు. తర్వాత సర్వోదయ మండలిలో పనిచేసి దాదాపు పుష్కరకాలం పాటు ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలికి అధ్యక్షులుగా సేవలందించారాయన. 1939లో మొదలైన గ్రంథాలయోద్యమాన్ని బోయినపల్లి చివరిశ్వాస వరకు వదిలి పెట్టలేదు. ఆనాడు కరీంనగర్ జిల్లాలోని ప్రతి గ్రామ ంలో గ్రంథాలయం స్థాపించేందుకు ఊరూరా పర్యటించారు. ఆయన స్ఫూర్తితోనే వందలాది గ్రంథాలయాలు కరీంనగర్తో పాటు తెలంగాణలో ని అనేక ప్రాంతాల్లో నెలకొల్పబడ్డాయి.
గాంధీ పట్ల అపారమైన ప్రేమ, ఆయన సిద్ధాంతాల పట్ల ప్రగాఢ విశ్వాసం కలిగిన బోయినపల్లికి అహింస పట్ల అచంచల విశ్వాసం ఉండేది. ఆయన తన పోరాటాలన్ని ఆ పంథాలోనే కొనసాగించారు. స్వాతంత్య్రోద్యమం మొదలుకుని భాషా సాహిత్యాలవరకు ఆయన పనిచేయని రం గం లేదు. నాటక రచయిత, కవి, సంపాదకులు, అనువాదకులు, ఉద్యమకారులైన బోయినపల్లి ‘సారస్వత జ్యోతి’ పత్రికను స్థాపించి నిర్వహించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు శాఖను ఏర్పాటు చేసి భాషా పరీక్షలు నిర్వహించారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ ప్రచారక్గా పనిచేసి హిందీ పరీక్ష నిర్వహణకు కరీంనగర్నే కేంద్రంగా మలిచారు. కరీంనగర్ జిల్లా రచయితల సంఘం ను చివరివరకు నడిపించారు.
తొలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొని అనేక ధర్నాలు, పికెటింగ్లు నిర్వహించిన బోయినపల్లి మలిదశ ఉద్యమంలోనూ 90 ఏండ్ల వయస్సులో చురుకుగా పాల్గొన్నారు. పది రోజులు ఢిల్లీలో నిరాహార దీక్షలో పాల్గొన్నారు. 2014లో ఢిల్లీలో జరిగిన క్విట్ ఇండియా వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లి, తిరుగు ప్రయాణంలో జారి పడగా తుంటి ఎముక విరిగి మంచానికి పరిమితమైనా కూడా ఆగస్టు 15న మంచంపై నుంచే జాతీయ జెండాను ఎగరేసిన నిఖార్సయి న గాంధేయవాధి బోయినపల్లి. ఆయన సేవలకు గుర్తుగా 2005లో కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో గౌరవించింది. తాను కలలుకన్న తెలంగాణను చూసిన బోవెరా 2014 అక్టోబర్ 27న అనారోగ్యంతో కన్నుమూశారు. (నేడు బోవెరా పురస్కారాన్ని విమలక్కకు ప్రదానం సందర్భంగా)
(వ్యాసకర్త : నేషనల్ బుక్ ట్రస్ట్ దక్షిణప్రాంత మేనేజర్)