నేడు భూపతి కృష్ణమూర్తి జయంతి
దేశ స్వాతంత్య్రం కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నిస్వార్థంగా పోరాటం చేసిన నాయకుడు భూపతి కృష్ణమూర్తి. ఏ పదవులు ఆశించకుండా సొంత ఆస్తులను సైతం ఉద్యమాల కోసం ధారపోసిన త్యాగశీలి ఆయన. అభిమానులు తెలంగాణ గాంధీగా పిలుచుకొనే ఆయన జీవితమంతా పోరాటాలమయం.. భావి తరాలకు ఆదర్శప్రాయం.
కరీంనగర్ జిల్లా ముల్కనూర్కు చెందిన భూపతి కృష్ణమూర్తి 1926 ఫిబ్రవరి 21న వరంగల్లో జన్మించారు. 1944లో మహాత్మాగాంధీ జన్మదినోత్సవం సందర్భంగా కృష్ణమూర్తి జాతిపితతో పది రోజులు గడిపారు. గాంధీజీ స్ఫూర్తితో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. 1946 ఆగస్టు 11న హయగ్రీవాచారితో కలిసి ఓరుగల్లు కోట మీద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అదే సమయంలో రజాకార్ల దాష్టీకాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. 1947-48 మధ్య కాలంలో హైదరాబాద్ విమోచన పోరాటంలో చురుగ్గా పాల్గొని అజ్ఞాత జీవితం గడిపారు.
1948లో జరిగిన గంథాలయోద్యమంలో సైతం పాల్గొన్నారు. ఇడ్లీ -సాంబార్ వ్యతిరేక ఉద్యమంలోనూ క్రియాశీలకంగా పనిచేశారు. 1952లో భూపతి కృష్ణమూర్తి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదాన్ని ప్రచారం చేశారు. 1953-54లో ఫజల్ అలీ కమిషన్ వరంగల్ వచ్చినప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం డిమాండ్ను బలంగా వినిపించారు. తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే ప్రాంతంతో కలపొద్దని అవిశ్రాంతంగా పోరాటం చేశారు. వయోభారంతో బాధ పడుతున్నప్పటికీ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించారు.
1967లో వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్గా భూపతి కృష్ణమూర్తి ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదేమోనని నమ్మకం సన్నగిల్లుతున్న సమయంలో యువకులు, మేధావులతో కలిసి తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటు చేసి తెలంగాణవాదుల్లో మరోసారి ఆశను రేకెత్తించారు. 1970-74లో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ సర్కిల్ సలహా మండలి సభ్యునిగా పనిచేశారు. 1982 జనవరి 19న కార్మిక సంఘాల జాతీయ సమన్వయ సంఘం నిర్వహించిన భారత్ బంద్లో పాల్గొని అరస్టై వారం రోజుల పాటు జైలు జీవితం అనుభవించారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ ఆర్థిక స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో 1953లో ముల్కనూరు కో-ఆపరేటివ్ సొసైటీని స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షునిగా పనిచేశారు. ఈ సంఘాన్ని ఆసియా ఖండంలోనే ఆదర్శంగా, అతి పెద్ద సహకార సంఘంగా తీర్చిదిద్దారు. వరంగల్ వ్యవసాయ గ్రేస్ మార్కెట్ సభ్యునిగా, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అడ్తి అధ్యక్షునిగా, చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శిగా సేవలందించారు. వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా; వరంగల్ పట్టణ, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.
ఆయన కృషి ఫలితంగా వరంగల్లో పలు విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. 1982 నుంచి 1985 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగా కృష్ణమూర్తి పనిచేశారు. ఆయన పోరాట స్ఫూర్తికి గుర్తింపుగా స్వతంత్ర సమర కేసరి, కాళోజీ అవార్డులు లభించాయి. జీవితాంతం మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ఆచరించిన భూపతి కృష్ణమూర్తి తాను కల గన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కండ్లారా చూసి 2015 ఫిబ్రవరి 15న వరంగల్లో తుదిశ్వాస విడిచారు. ఆయన నిస్వార్థ పోరాట మార్గం మనకందరికీ స్ఫూర్తిదాయకం.
– బుద్దా ప్రవీణ్, 95053 25253