‘It’s never too late to be what you might have been’. ప్రఖ్యాత ఆంగ్ల రచయిత్రి జార్జి ఇలియట్ అన్న ఈ మాటలు పీవీ నరసింహారావు జీవితానికి సదా అనువర్తితాలు. జార్జి ఇలియట్ సామాన్య రచయిత్రి కాదు. 18వ శతాబ్దం ఉత్తరార్ధం ఆంగ్ల సాహిత్యంలో అన్ని ప్రక్రియలలోనూ ఆరితేరిన విదుషీమణి. అంతేకాదు, స్త్రీవాద ఉద్యమానికి స్ఫూర్తినందించిన వారిలో ఒకరు. అన్నిటిని మించి సాహిత్యంలో, సమాజంలో సంస్కరణలను ఆశించిన అభ్యుదయశీలి.‘ఆలస్యం అమృతం విషం’ అన్న సూక్తి ఒక్కోసారి నిజం కాదనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆలస్యమైనా మేలే జరుగుతుందని భావించాలి.
నిదానమే ప్రధానం అని భావించి, మతితప్పిన కాకుల రొదలో మౌనమే ఆయుధంగా ధరించి, చిక్కని చీకటిలో కేవలం చుక్కల వెలుగులోనే సాగుతూ.. మనదేశ ప్రధానిగా పీవీసాధించిన విజయాలు అపూర్వమైనవి. ఆయనకు ముందున్న ప్రధానులు సంక్షేమంపైనే దృష్టి పెట్టారు. సంస్కరణలను పట్టించుకోలేదు. దేశ ప్రగతికి సంస్కరణలే ప్రధానమని విశ్వసించి త్రికరణశుద్ధిగా అమలుచేసి చూపించిన మేధావి పీవీ. ఆయన అమలు చేసిన సంస్కరణలన్నీ ప్రతికూల పరిస్థితుల్లోనే కావడం గమనించదగ్గ విషయం.
PV Narasimha Rao | సంఘ సంస్కరణోద్యమ పితామహుడైన రాజా రామ్మోహనరాయ్ మొదలుకొని ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రానడే, గోఖలే, జ్యోతిరావు ఫులే, స్వామి వివేకానంద, తిలక్, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, డా.బీఆర్ అంబేద్కర్, గాంధీజీ వంటి మహనీయుల సంస్కరణ ఉద్యమాలతో పీవీ ప్రభావితుడయ్యారు. ఆనాటి సంస్కరణలు సంస్కృతి పరమైనవి కావచ్చు, సమాజపరమైనవి కావచ్చు, కుల, మతపరమైనవి కావచ్చు.. గానీ, నిద్రాణమైన జాతిని సముద్ధరించే దిశగా ఆయన తీసుకొచ్చిన మార్పులు ఎంతో విశిష్టమైనవి. కొన్ని కాలపరీక్షకు నిలబడినవి ఉంటాయి. పీవీ సహజంగానే సంస్కరణశీలి. ఆయన సంస్కరణలు కేవలం భూ, ఆర్థిక పరమైనవే కావు. సాంస్కృతిక విలువల గురించి తపన ఆయన సాహితీ సృజనలో కూడా ప్రతిఫలించింది.
పీవీ నరసింహారావు స్వాతంత్య్రోద్యమ కాలంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు. నేతాజీ, గాంధీ, నెహ్రూ, స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణరావు మొదలైన మహనీయుల నాయకత్వ విధానాన్ని పీవీ ఎరిగినవారే. పైగా ఇంటర్ మొదలు న్యాయశాస్త్రం వరకు మహారాష్ట్రలో చదవడం మూలంగా ఆయనపై మహారాష్ట్ర సంస్కృతి ప్రభావం కూడా చాలా ఉన్నది. హరినారాయణ ఆప్టే మరాఠీలో రాసిన పణ్ లక్ష్యాత్ కోణ్ ఘేతో (ఆమెను ఎవరు పట్టించుకుంటారు) నవల మొత్తం వితంతు, స్త్రీ విద్యకు సంబంధించినదే. పీవీ ఈ నవలను ‘అబలా జీవితం’ పేరిట తెలుగులో అనువదించారు. ఇది సాంఘిక నవలే అయినప్పటికీ ఇతివృత్తమంతా సంస్కరణ నేపథ్యంగానే ఉంటుంది.
విశ్వనాథ సత్యనారాయణ రచించిన ‘వేయిపడగలు’ నవల ప్రధానంగా ప్రాచీన గ్రామ సువ్యవస్థను విధ్వంసం చేసిన పాశ్చాత్య నాగరికత గురించే. లుప్తమైపోతున్న మన భారతీయ సంస్కృతి విలువల పట్ల తాత్విక విచారధారతో, తార్కికంగా విమర్శిస్తూ వేయిపుటల వచనకావ్యంగా మలచిన ఈ రచన ఒక విధంగా విశ్వనాథవారి ‘ఇన్ సైడర్’ అని పేర్కొనవచ్చు. పీవీ ఇన్సైడర్లో ఆనంద్ వలె.. వేయిపడగలు నవలలో ధర్మారావు కనిపిస్తారు.
విశ్వనాథ భావజాలాన్ని తొలుత విమర్శించి, తర్వాత అంగీకరించి వేయిపడగలు నవలను ’సహస్ర ఫణ్’ శీర్షికతో అనువదించి హిందీ సాహిత్యాభిమానులకు సైతం పీవీ తన సాంస్కృతిక సంస్కరణల ఉద్దేశాన్ని పరోక్షంగా ధ్వనించారు. సహస్ర ఫణ్ చదివాక.. ఎంతో పులకించి పీవీ రచనే మూలమని, తన రచనే అనువాదమని అనుకొనే విధంగా ఉన్నదని విశ్వనాథ ప్రశంసించడం విశేషం. పీవీ ఇన్సైడర్ నవల సైతం క్షీణించిపోతున్న రాజకీయ విలువల గురించి చర్చిస్తూ.. భూ సంస్కరణల గురించి వివరించింది. ఇలా పీవీలోని సంస్కరణలు ఆయన సాహిత్యం ద్వారా ప్రతిఫలించాయి. సమాజ శ్రేయస్సు కోసం రచయిత అయినా, రాజకీయ నేత అయినా ఎలాంటి స్పష్టత కలిగి ఉండాలో ఆయన స్వయంగా ఆచరించి చూపారు.
పీవీ రాజకీయ జీవితం కంటే ముందే (1948-52) కాకతీయ వార పత్రికను స్థాపించి, పాత్రికేయ వృత్తిలో భాగంగా సమాంతరంగా సాహిత్యాన్ని చేపట్టారు. గొల్లరామవ్వ వంటి కథలు అలా వెలువడినవే! సమాజాన్ని తమ కలం ద్వారా స్కాన్ చేసే పత్రికా ప్రతినిధులు కూడా సంస్కరణ శీలురే అని ఆయన భావన. అందుకే స్వాతంత్య్రోద్యమ కాలం నాటి సంఘ సంస్కరణల్లో చాలా మంది తమ సొంత గొంతు కోసం పత్రికను స్థాపించారని ఒకానొక సందర్భంలో పీవీ వివరించారు.
1957లో పీవీ తొలిసారి మంథని నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. అయితే పదవి వచ్చేంత వరకే ఆయన ప్రశాంత గోదావరి. ఆ తర్వాత ఆయన వరద గోదావరి. తొలిసారి 1962లో ఆయన నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో న్యాయ, జైళ్లు, సమాచార, పౌర సంబంధాల శాఖ సహాయమంత్రి అయ్యారు. ఇంకేముంది.. వెంటనే తన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. విదేశాలలో జైళ్లను అధ్యయనం చేసి అధికారులతో చర్చించి హైదరాబాద్లో తొలిసారి మూడు రోజుల పాటు బహిరంగ సదస్సు నిర్వహించారు. రాజకీయ, సామాజిక, విద్యా రంగాలకు సంబంధించిన అందరినీ ఆ సదస్సుకు ఆహ్వానించారు. జైళ్ల సంస్కరణల గురించి చర్చించారు. ఫలితంగా జైళ్లలో గ్రంథాలయాలు, కల్చరల్ సెంటర్లు ఏర్పాటు చేయించి జైళ్లంటే పరివర్తన మందిరాలనే భావన కలిగించారు.
మనం సినిమాల్లో చూస్తుంటాం.. నేరస్థుడు జైలు నుంచి విడుదల కాగానే మళ్లీ తన పాత పగను సాధించడానికి వెళ్లినట్లు. పీవీ దాన్ని దృష్టిలో ఉంచుకున్నారేమో.. 1965లో అనంతపురంలో 1,600 ఎకరాల ఓపెన్ జైలు ఏర్పాటు చేయించారు. నేరస్థుల విడుదలకు ముందే సత్ప్రవర్తన ఉన్నవారిని ఇందులోకి పంపి వ్యవసాయం, తోట పనులు చేయించి తర్వాత విడుదల చేస్తారు. ఏలూరు, హైదరాబాద్లో జైళ్లల్లో జూనియర్ సర్టిఫికెట్ కోర్సు స్కూలు పెట్టించారు బాల, మహిళా నేరస్థుల కోసం. 1964లో కాసు సీఎం అయ్యారు.
ఆయన పీవీని బృహస్పతి అనేవారు. ఆయన మంత్రివర్గంలో దేవాదాయ, ధర్మాదాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టి.. ఆ శాఖలో ఎన్నో మార్పులు తెచ్చారు పీవీ. 1967లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయ్యారు. డైరెక్టర్ అఫ్ మెడిసిన్ అండ్ హెల్త్ అనేదాన్ని పీవీ కొత్తగా ఏర్పాటు చేశారు. డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీసు నిషేధించారు. 1968లో విద్యాశాఖ మంత్రి అయ్యారు. డిగ్రీ వరకు తెలుగు మీడియం బోధనా భాషగా చేశారు. తెలుగు అకాడమీ స్థాపించి ఆయనే చైర్మన్గా వ్యవహరించారు. డిటెన్షన్ విధానం రద్దు చేశారు. మెడికల్ కాలేజీలో ప్రవేశాలకు ఎంట్రెన్స్ పెట్టించారు. అధికార భాషా సంఘం ఏర్పరిచారు.
పీవీ భూసంస్కరణలు.. ఒక ప్రత్యేక అధ్యయనం. 1971 సెప్టెంబర్ 30వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పీవీ ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత ఆరు నెలలకు 1972 మార్చిలో శాసనసభ ఎన్నికలలో పీవీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించగా.. ఆయన 1972 మార్చి 20న మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. నిజానికి పీవీ కన్నా ముందే ఆయన గురువు బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా జాగీర్దారి విధానం రద్దుచేశారు. భూసంస్కరణల చట్టాన్ని ప్రవేశపెట్టి కౌలుదార్లకు యాజమాన్యపు హక్కును కల్పించారు.
పీవీ భూసంస్కరణలు.. ఒక ప్రత్యేక అధ్యయనం. 1971 సెప్టెంబర్ 30వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పీవీ ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత ఆరు నెలలకు 1972 మార్చిలో శాసనసభ ఎన్నికలలో పీవీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించగా.. ఆయన 1972 మార్చి 20న మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.
నిజానికి పీవీ కన్నా ముందే ఆయన గురువు బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా జాగీర్దారి విధానం రద్దుచేశారు. భూసంస్కరణల చట్టాన్ని ప్రవేశపెట్టి కౌలుదార్లకు యాజమాన్యపు హక్కును కల్పించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరించాక నీలం సంజీవరెడ్డి, సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి భూసంస్కరణల వంటి ప్రగతిశీల చట్టాల జోలికి పోలేదు. 1972లో సంస్కరణల గురించి, కేంద్ర సంఘం చేసిన సిఫారసుల గురించి పీవీ ఆలోచించారు. ముందే శాసనసభలో చర్చిస్తే భూస్వాములు ‘జాగ్రత్త’ పడతారని, 1972 మే 2న గవర్నర్తో అకస్మాత్తుగా ఆర్డినెన్సు జారీ చేయించారు. దాంతో ఎక్కువ భూములున్న వారి క్రయవిక్రయాలు ఆగిపోయాయి. భూకమతాలపై గరిష్ఠ పరిమితి విధింపు ఎవరినో నష్టపరచాలనో, కక్ష సాధించాలనో కాదు.. నవసమాజ నిర్మాణానికి ఈ చర్య అవసరం అని ఆయన ప్రకటించారు. తనను తాను విప్లవ తపస్విగా అభివర్ణించుకొన్నారు. ఇక కేంద్రంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పీవీ సంస్కరణలు తెచ్చారు.
నూతన జాతీయ విద్యావిధానం రూపొందించారు. గ్రామీణ విద్యార్థుల కోసం జిల్లాకు ఒక నవోదయ పాఠశాలను ఏర్పాటు చేశారు. 1991లో రాజీవ్గాంధీ దుర్మరణం అనంతరం క్లిష్ట పరిస్థితులలో ప్రధానమంత్రి పదవిని పీవీ చేపట్టారు. తన హయాంలో ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు సైతం ప్రత్యేక అధ్యయనం చేయాల్సిన అంశమే. స్థూలంగా చెప్పాలంటే, రూపాయి మార్పిడి రేటు సర్దుబాటు, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక విధానాలలో మార్పుల వలన దేశ ఆర్థిక స్థితి తిరిగి గాడిలో పడింది. పీవీ న్యూడీల్ విధానాన్ని ప్రవేశపెట్టి ‘ఇండియన్ రూజ్వెల్ట్’ అని అనిపించుకున్నారు.
అయోధ్యలో వివాదానికి పీవీ ఎంతమాత్రం కారణం కాదు. ఆయనకు ముందు ప్రధానులుగా ఉన్న రాజీవ్ గాంధీ, వీపీ సింగ్ అనుసరించిన చర్యలే దానికి కారణం. 1986లో రాజీవ్ ప్రధానిగా ఉన్నప్పుడే రామజన్మభూమి ప్రాంగణం గేట్లు తెరిచారు. 1989లోనే కాంగ్రెస్ ప్రభుత్వం శిలాన్యాస్కు అనుమతినిచ్చింది. అయోధ్యలో పూర్తి భూమిని రామమందిరానికే కేటాయిస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో వివాదాస్పద భూసేకరణకు పీవీ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయమే ఇప్పుడు నరేంద్రమోదీ ప్రభుత్వానికి లాభించింది.
అద్వానీ, జోషిలా కాకుండా పీవీని మోదీ పల్లెత్తు మాట అనలేదు. పైగా పీవీకి తగిన గుర్తింపు ఇవ్వలేదని 2014 నిజామాబాద్ సభలో సోనియా గాంధీ కుటుంబాన్ని మోదీ విమర్శించారు. తదుపరి కేసీఆర్ ప్రభుత్వం 2020లో పీవీ శతజయంతి ఉత్సవాలను ఏడాది పొడువునా నిర్వహించి అసెంబ్లీలో భారతరత్న కోసం తీర్మానం చేసింది. కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో పీవీ మరోసారి తెరపైకి వచ్చారు. తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని స్వచ్ఛంద సంస్థలు పీవీని ఆర్థిక సంస్కరణల పితామహునిగా ప్రశంసించడం ప్రారంభించాయి. విదేశాలలో సైతం పీవీ అభిమానులు జూమ్లో సెమినార్లు నిర్వహించారు. 2021 సంవత్సరానికల్లా పీవీ భారతరత్నకు అర్హుడనే భావన ప్రపంచవ్యాప్తంగా కలిగింది. ఇందుకు కేసీఆర్కు తెలుగుజాతి తొలుత ధన్యవాదాలు చెప్పాలి.
బీఆర్ఎస్, బీజేపీ.. రెండూ కాంగ్రెస్ పార్టీని ఎంతగా ఎండగట్టినా పీవీ విషయం వచ్చేసరికి ఆయనను గొప్పగా గౌరవించడం గమనించదగ్గ అంశం. శత్రువులు కీర్తించి, స్వపక్షాలు విమర్శించిన ఖ్యాతి కూడా పీవీకే దక్కింది.
చివరికి మోడువారిన పీవీ వృక్షానికి, కేసీఆర్ పాదులు తీసి, ఎరువులు వేసి, నీళ్లు పెట్టి చిగురింపజేయగా.. మోదీ ఆ వృక్షానికి భారతరత్న పురస్కారంతో జీవం పోశారు. ఇంత జరిగినా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మాత్రం ముక్తసరిగా ‘మేమూ స్వాగతిస్తున్నాం’ అని మాత్రమే పలికింది. తొలి నాళ్ల నుంచి కాంగ్రెస్లోనే ఉంటూ ఎక్కడో తెలంగాణ మారుమూల పల్లె వంగరలో పుట్టిన పీవీ స్వయంకృషితో ఎదిగి బహుముఖీన ప్రతిభతో, బహుభాషా పాండిత్యంతో, స్థితప్రజ్ఞుడై భాషించారు. రచ్చ గెలిచి, ఇంట గెలిచిన పీవీ పేరిట ఆధునిక భారత చరిత్రలో నిస్సందేహంగా ఒక సువర్ణ అధ్యాయం ఉంటుంది.
(వ్యాసకర్త: రాజకీయ, సామాజిక, సాహిత్య విశ్లేషకుడు)
– డాక్టర్ వి.వి.రామారావు 98492 37663