మహా భారతంలో సకల శాస్ర్తాల సారం. సకల వేద సారమైన ఈ పంచమ వేదానికి మణి మకుటం వంటిది భగవద్గీత. కురుక్షేత్రంలో గీతాకారుడు అర్జునుడికి చేసిన కర్తవ్య బోధనే భగవద్గీత. ఇది మానవాళికి గొప్ప ప్రబోధం. నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం. ఈ సందర్భంగా గీతామృతాన్ని ఆస్వాదించి, ఆచరించి అర్థవంతంగా జీవిద్దాం. జీవన పోరాటంలో గెలవడానికి తగిన స్ఫూర్తిని పెంపొందించుకుందాం.
భగవద్గీత బోధనలు సామాన్యులతోపాటు ప్రపంచ మేధావులను ఎంతగానో ఆకర్షించాయి. గీతా బోధనలు తరతమ భేదాలు లేకుండా మనుషులందరికీ ఆచరణీయం. కౌరవులతో యుద్ధం చేయడానికి కురుక్షేత్రంలో ప్రవేశించిన అర్జునుడికి ఒక్కసారిగా విచారం ఆవరించినప్పుడు బంధు మిత్రులను స్వార్థం కోసం హతమార్చడానికి అతడి మనస్సు అంగీకరించదు. అయితే కర్తవ్య నిర్వహణలో రాగద్వేషాలు ఉండకూడదని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు.జ్ఞానులు మరణించిన వారి గురించి, బతికున్న వారి గురించి కానీ శోకించరని తెలియజేస్తాడు. ధీరుడైనవాడు సుఖ దుఃఖాలను సమానంగా చూడాలని చెప్తాడు.
కృష్ణుడి బోధనలు మనిషి వ్యక్తిత్వ వికాసానికి, విద్యార్థుల క్రమశిక్షణకు తోడ్పడతాయి. నిష్కామ కర్మ వల్ల విపరీత ఫలితాలు ఉండవని, నిశ్చయాత్మక బుద్ధి ఒకటే ఉంటుందని కృష్ణుడు బోధిస్తాడు. ‘దుఃఖేష్వ నుదిగ్న మనాః సుఖేశు విగత స్పృహః’ అన్న శ్లోకంలో స్థితప్రజ్ఞుడి లక్షణాలను గీతాకారుడు వివరంగా తెలిపాడు. దుఃఖానికి కుంగిపోనివాడు, సుఖాలకు పొంగిపోనివాడు, ఆసక్తిని, భయాన్ని, కోపాన్ని వీడినవాడు స్థితప్రజ్ఞుడవుతాడని చెప్పాడు. దేని మీదా మమతాసక్తులు లేనివాడు, అనుకూల పరిస్థితుల్లో హర్షం, ప్రతికూల పరిస్థితుల్లో ద్వేషం లాంటి వికారాలకు లోనుకానివాడే స్థితప్రజ్ఞుడని బోధించాడు. భోగాసక్తులైన వివేక హీనుల బుద్ధి కోరికల వెంట పరుగులు తీస్తుందని హెచ్చరించాడు. విషయాసక్తుల వైపు మరలకుండా నిగ్రహించుకుంటే బుద్ధి స్థిరంగా ఉంటుందని గీతాకారుడు బోధించాడు.
‘ధ్యాయతో విషయాన్ పుంసః’ శ్లోకంలో మనిషి పతనానికి కారణాలు వివరించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు శ్రీకృష్ణుడు. ప్రాపంచిక విషయాల గురించి ఆలోచించే వాడికి వాటి పట్ల ఆసక్తి కలుగుతుందని, ఆ కోరికలు తీరకపోతే కోపం వస్తుంది తెలిపాడు. కోపం వ్యామోహానికి దారి తీస్తుందని… దీనివల్ల స్మృతి దెబ్బ తింటుందని వివరించాడు. దీని వల్ల బుద్ధి(జ్ఞాన శక్తి) నశిస్తుందని.. ఇది మనిషి పతనానికి దారి తీస్తుందని హెచ్చరించాడు.
మనిషి పతనం కాకుండా అంతః కరణాన్ని భక్తి, జ్ఞాన, కర్మ, యోగ మార్గాల ద్వారా ఎలా వశపరుచుకోవాలో కూడా శ్రీకృష్ణుడు గీతలో వివరించాడు. అంతఃకరణాన్ని వశం చేసుకున్న సాధకుడు రాగ ద్వేష రహితుడై విషయాలను ఇంద్రియాలు గ్రహిస్తున్నా మనశ్శాంతిని పొందుతాడని… దీంతో దుఃఖం నశిస్తుందని అర్జునుడికి వివరించాడు.
భగవద్గీత వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని లోకానికి వివరించింది. మనకు శత్రువైనా, మిత్రుడైనా మన బుద్ధేనని చెప్తుంది. సత్వ, రజో, తమో గుణాల ప్రభావాన్ని ఎలా జయించాలో కూడా భగవద్గీత వివరిస్తుంది. అనేక తాత్విక విషయాలు, విజ్ఞాన శాస్త్ర అంశాలు భగవద్గీతలో ఉన్నాయి. క్రమశిక్షణ, నిద్రాహారాలు, జీవన విధానం ఎలా ఉండాలో భగవద్గీత వివరిస్తుంది. నిద్రాహారాలలో పరిమితి ఉండాలని.. ఏదీ అతి మంచిది కాదని చెప్తుంది. తపస్సు మొదలుకొని దాన గుణం వంటి అనేక మంచి అభ్యాసాలు, అలవాట్ల గురించి మనకు జ్ఞానాన్ని అందిస్తుంది. తగిన స్థలంలో, తగిన సమయంలో అర్హులకు మాత్రమే తోడ్పడాలని బోధిస్తుంది. జ్ఞానాన్ని కూడా సత్వ, రజ, తమో గుణాల ఆధారంగా విభజించింది. ఇదే రీతిలో కర్మను కూడా వర్గీకరించింది. సంతోషాన్ని కూడా ఇదే రీతిలో వర్ణించింది.
విశ్వం పుట్టుక, స్వభావం గురించి భగవద్గీతలో స్పష్టంగా ఉన్నది. ఈ విశ్వం మొదలు, మధ్య, చివర లేనిదని ఆనాడే గీతాకారుడు చెప్పాడు. విశ్వం ఆవిర్భవించినట్టుగానే లయిస్తుందని కూడా చెప్పాడు. ఇదొక చక్రంలా పునరావృతమవుతూ సృష్టి, లయల కాలచక్రాన్ని శాస్త్రీయ గణాంకాలతో ఆనాడే భగవద్గీత వివరించడం విశేషం. ఇతర లోకాలు, గ్రహాల ప్రస్తావన కూడా భగవద్గీతలో కనిపిస్తుంది. గ్రహ వ్యవస్థలు విశ్వంలో తేలియాడుతూ ఉంటాయని, విశ్వం శక్తి స్వరూపమని తెలిపింది. తాను ఈ ప్రపంచాన్ని సృష్టించానని గీతాకారుడు భగవద్గీతలో పేర్కొన్నాడు. అయితే ఈ ప్రపంచం ఏ విధంగా ఉండాలో నిర్మించుకోవాల్సింది మనుషులేనని స్పష్టం చేశాడు. తాము కోరుకున్న ప్రపంచాన్ని నిర్మించుకునే స్వేచ్ఛ మానవులకు ఉన్నది. మానవులు వ్యక్తిత్వ నిర్మాణం ద్వారా సమాజ హితానికి పాటుపడాలనేదే భగవద్గీత సారాంశం. భగవద్గీత భారతీయుల వారసత్వ సంపద. గీత ప్రబోధించిన లక్షణాలు, గుణాలు కొందరు గొప్ప నాయకుల్లో ద్యోతకమవుతుంటాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ అందుకు ఒక ఉదాహరణ. భగవద్గీత బోధనలను కేసీఆర్ ఆచరిస్తుంటారు. వాటికి అనుగుణంగా ఉత్తమ పాలనను అందిస్తున్నారు. గీత బోధించిన కర్తవ్య పరాయణత్వాన్ని కలిగి ఉంటారు. అందుకే గీతా బోధనలను, అందుకు అనుగుణంగా ఉండే కేసీఆర్ ఆచరణను ఆదర్శంగా తీసుకుందాం. శ్రీ కృష్ణ జన్మాష్టమిని కర్తవ్య దినోత్సవంగా జరుపుకొందాం!
(వ్యాసకర్త: చైర్మన్, కృష్ణం వందే జగద్గురుం ఫౌండేషన్)
-గోసుల శ్రీనివాస్ యాదవ్
98492 90606