కాంగ్రెస్ పాలనలో తెలంగాణలోని పేదల బతుకులు ఆగమవుతున్నాయి. మరీ ముఖ్యంగా రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఓవైపు కరెంటు కోతలతో నానా అవస్థలు పడుతుంటే, మరోవైపు రుణాలు చెల్లించాలంటూ బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయి. డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి హామీ ఇవ్వడంతో రైతులు కాంగ్రెస్ను గెలిపించారు. నమ్మినవారిని నట్టేట ముంచడంలో ఆరితేరిన కాంగ్రెస్ పాలకులు రుణమాఫీ చేయకుండా రైతులను ముంచి తమ పేరును సార్థకం చేసుకున్నారు.
డిసెంబర్ కాదు కదా, ఫిబ్రవరి 09 వస్తున్నా రుణమాఫీపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుబంధు ఇంకా పూర్తిస్థాయిలో అందరికీ అందలేదు. రుణమాఫీ కూడా పూర్తికాకపోవడంతో పెట్టుబడుల కోసం మిత్తికి తీసుకొచ్చిన నగదుపై రోజురోజుకు వడ్డీ పెరిగిపోతున్నది. రూ.500 బోనస్ చెల్లించి వడ్లు కొనుగోలు చేస్తామని, మ్యానిఫెస్టోలో ప్రకటించి ఇప్పుడు దానిపై సప్పుడు చేయడం లేదు. దీంతో కాంగ్రెస్ సర్కార్ అసలు రూపం బయటపడిందని రైతులు చర్చించుకుంటున్నారు. అధికారంలోకి వచ్చేందుకే అబద్ధాలు చెప్పారని మాట్లాడుకుంటున్నారు.
రైతుల వద్ద నుంచి రావాల్సిన బకాయిలను ముక్కుపిండి వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు అన్నదాతలపై ఒత్తిడి చేస్తున్నారు. 20 రోజుల కిందట రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ శాఖ అధికారులు, బ్యాంకర్లతో సమావేశమయ్యారు. రైతు రుణాలను రికవరీ చేయాలని, కట్టని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి బ్యాంకు అధికారుల వేధింపులు మొదలయ్యాయి. ‘మీరు కట్టకుంటే మా ఉద్యోగాలు పోతాయి’ అని అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.రుణమాఫీ చేసే ఉద్దేశం లేనప్పుడు వెంటనే రూ.2 లక్షలు రుణం తెచ్చుకోవాలని ఎందుకు చెప్పారని రైతన్నలు కాంగ్రెస్ పాలకులను ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాల్సిందిపోయి, తిరిగి వసూలు చేస్తుండటంపై కర్షకులు మండిపడుతున్నారు.
ప్రజాపాలన అంటూ గొప్పగా ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ పాలకులు ఈ తరహా చర్యలకు దిగడం సరికాదు. ప్రజాపాలన అంటే రైతులను, ప్రజలను వేధించడమా? ఇప్పటికే పంటలు పండక రైతులు అవస్థలు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు బ్యాంకుల ఒత్తిళ్లకు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయి. బడా వ్యాపారులకు రూ.కోట్ల రుణాలు ఇచ్చే బ్యాంకులు వాటిని వసూలు చేయవు. ఆ మొత్తాలను రైటాప్ పేరిట మాఫీ చేస్తూ.. రైతుల పట్ల మాత్రం కఠినంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రజాప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ పాలకులు ఇప్పటికైనా స్పందించాలి. రుణమాఫీ చేసేంత వరకు రైతులపై ఒత్తిడి చేయవద్దని బ్యాంకు అధికారులను ప్రభుత్వం ఆదేశించాలి.
-గుండమల్ల సతీశ్ కుమార్
94931 55522