ఆధునిక భారత నిర్మాతల్లో ఒకరు బాబూ జగ్జీవన్రామ్. రాజకీయాల్లో ఆచరణవాది. సానుకూల దృక్పథం, స్పష్టమైన దార్శనికత, విస్తృతమైన అధ్యయనం, గొప్ప మేధోశక్తి, స్థిరమైన సంకల్పబలం ఆయన సొంతం. ఓరిమి, కారుణ్యం, చర్చించే గుణం, ఒప్పించే గుణం, ఆత్మవిశ్వాసం, ధైర్యం, సేవానిరతి, కార్యనిర్వహణాదక్షత మొదలైన లక్షణాల నిండుదనంతో బలమైన సుగుణశీల వ్యక్తిత్వం ఆయనది. కులవివక్ష, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించిన అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్రామ్.
1908 ఏప్రిల్ 5న జగ్జీవన్రామ్ బీహార్ రాష్ట్రంలోని చాంద్వా అనే చిన్నగ్రామంలో వసంతీదేవి, శోభీరామ్ దంపతులకు జన్మించారు. వీళ్లకు వ్యవసాయ భూములుండేవి. సామాన్య కుటుం బం. చర్మకార కులం. ఆరేండ్ల వయసులో 1914లో జగ్జీవన్రామ్ గ్రామ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడం తో సాంఘిక, ఆర్థిక ఇబ్బందుల మధ్య తల్లి వసంతీదేవి సంరక్షణలో జగ్జీవన్రామ్ తన చదువు కొనసాగించారు. తన 11వ ఏటా 1919లో 7వ తరగతి పాసయ్యారు.
ఆరా పట్టణంలోని ఇంగ్లీష్ మీడియం మాధ్యమిక పాఠశాలో జగ్జీవన్రామ్ 8వ తరగతిలో చేరారు. రాత్రింబవళ్లు పట్టుదలతో చదివి, ఇంగ్లీష్ భాషపై మంచిపట్టు సంపాదించారు. అణగారిన కులాల విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ తీసుకోవడానికి నిరాకరించారు. అదే సమయంలో విద్యలో ప్రతిభ కనబరిచిన ఇతర విద్యార్థులకు ఇచ్చే స్కాలర్ షిప్ను పొందారు. జగ్జీవన్రామ్ చిన్ననాడే భోజ్పురితోపాటు హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు.
ఆరా టౌన్ స్కూల్లో మంచినీళ్ల కుండను అంటుకోనివ్వని రూపంలో మొదటిసారిగా అంటరానితనం, కుల అణచివేత జగ్జీవన్రామ్కు ఎదురైం ది. జగ్జీవన్రామ్ ముట్టుకున్న కుండలోని నీళ్లను తాగడానికి కొందరు విద్యార్థులు నిరాకరించారు. దీంతో ఎస్సీ కులాల విద్యార్థులకు స్కూల్లో ప్రత్యేక మంచినీటి కుండను ఏర్పాటుచేశారు. ఈ అవమానాన్ని సహించలేని జగ్జీవన్రామ్, పెట్టిన ప్రతి కుండను పగల గొట్టసాగారు. పరిస్థితిని అర్థం చేసుకున్న స్కూల్ హెడ్మాష్టర్ చివరికి అందరికీ ఒక్కటే మంచినీటి కుండను ఏర్పాటుచేశారు. తాను ఎదుర్కోవలసి వచ్చిన ఈ వివక్షాపూరిత విధానాలకు తీవ్ర ఆవేదన, ఆగ్రహం మనసులో రగిలింది జగ్జీవన్రామ్లో. స్కూల్లో అందరు విద్యార్థులకంటే మిన్న గా గణితం, సంస్కృతాల్లో వందశాతం మార్కులతో మెట్రిక్యులేషన్ మొదటి శ్రేణిలో పాసయ్యారు. దీనివల్ల అందరిలో జగ్జీవన్రామ్కు గౌరవ ప్రతిష్ఠలు పెరిగాయి.
1925లో ఆరా పట్టణంలో జరిగిన ఒక సభకు జగ్జీవన్రామ్ స్వాగతం పలికారు. ఆ సభలో పాల్గొ న్న పండిత మదన్మోహన్ మాలవ్య బనారస్ హిం దూ విశ్వవిద్యాలయం (బీహెచ్యు)లో చదువుకోవటానికి రావల్సిందిగా జగ్జీవన్రామ్ను ఆహ్వానించాడు. బీహెచ్యూలో ఇంటర్ పాసైన తర్వాత జగ్జీవన్రామ్ కలకత్తాలోని విద్యాసాగర్ కాలేజీ డిగ్రీలో ప్రవేశించాడు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి డిస్టింక్షన్లో బీఎస్సీ డిగ్రీ పట్టభద్రుడయ్యారు. జగ్జీవన్రామ్ కలకత్తా వచ్చిన ఆరు నెలల్లోనే విల్లింగ్టన్ స్క్వేర్లో 35 వేల మంది కార్మికులను కూడగట్టి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ విజయంతో జగ్జీవన్రామ్ సుభాష్చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి చాలామంది జాతీయ నాయకుల దృష్టికి వచ్చారు. కమ్యూనిస్టు మ్యానిఫెస్టో, పెట్టుబడి గ్రంథాలతోపాటు ఇతర సోషలిస్టు సాహిత్యం అధ్యయనం చేశారు. అప్పటికే కుల, వర్గరహిత భావజా లం కలిగిన జగ్జీవన్రామ్పై ఇది ఎంతగానో ప్రభా వం చూపింది. బ్రిటిష్ వలసవాద సంకెళ్లు తెంపి, దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం సాధించాలని, సామాజిక సమానత్వం నిర్మించాలని జగ్జీవన్రామ్ విద్యార్థి దశలోనే సంకల్పించుకున్నారు.
1934లో జగ్జీవన్రామ్ కలకత్తాలో అఖిలభారతీయ రవిదాస్ మహాసభను స్థాపించారు. సాంఘిక సంస్కరణల కోసం వ్యవసాయ కార్మికుల మహాసభను, ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్లీగ్ మొదలైన సంఘాలను స్థాపించారు.1935లో కాన్పూర్లో జరిగిన డిప్రెస్డ్ క్లాసెస్లీగ్ కాన్ఫరెన్స్కు జగ్జీవన్రామ్ అధ్యక్షత వహించారు. ఈ సంస్థకు 1936 నుంచి 1942 వరకు జగ్జీవన్రామ్ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
1935 జూన్1న కాన్పూర్కు చెందిన సంఘసేవకుడు డాక్టర్ బీర్బల్ కుమార్తె ఇంద్రాణిదేవితో జగ్జీవన్రామ్ వివా హం జరిగింది. 1936లో 28 ఏండ్ల వయస్సులోనే బీహార్ శాసనసభలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1937లో బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ నుంచి 14 రిజర్వ్డ్ స్థానాలకు జగ్జీవన్రామ్ అభ్యర్థులను పోటీకి నిలిపాడు. 14 మంది అభ్యర్థులు గెలవడంతో జగ్జీవన్రామ్ ఒక రాజకీయ నిర్ణయాత్మకశక్తిగా, కింగ్మేకర్గా ఎదిగారు. ఈ సమయంలోనే, తమతో చేతులు కలపవలసిందిగా జగ్జీవన్రామ్కు కాంగ్రెస్పార్టీ నుంచి ఆహ్వానం అందింది.
1937 బీహార్ శాసనసభలో వ్యవసాయం, సహకార పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు పార్లమెంటరీ సెక్రటరీగా జగ్జీవన్రామ్ నియమితులయ్యారు. కాగా, బ్రిటిష్ విధానాలకు నిరసనగా శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని 1940 డిసెంబర్ 10 ఆరాలో జగ్జీవన్రామ్ అరెస్టయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక శాసనోల్లంఘన, సత్యాగ్రహ ఉద్యమాల్లో పూర్తిగా మునిగిపోయారు. వాటితో స్ఫూర్తిపొందారు. వార్దా వెళ్లి గాంధీ ఆశ్రమంలో కొన్నాళ్లు ఉన్నారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో జగ్జీవన్రామ్ పాత్ర మకుటాయమానమైంది.1942 ఆగస్టు 19న పాట్నాలోని స్వగృహంలో జగ్జీవన్రామ్ అరెస్టయ్యారు. 1943 అక్టోబర్ 5న జైలు నుంచి విడుదలయ్యారు. 1946లో జరిగిన కేంద్ర ఎన్నికల్లో ఈస్ట్ సెంట్రల్ షాబాద్ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా జగ్జీవన్రామ్ ఎన్నికయ్యారు.
33 ఏండ్లకు పైగా కేంద్ర కేబినెట్మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా జగ్జీవన్రామ్ తీసుకున్న అసంఖ్యాక నిర్ణయాలు, ఆయన నాయకత్వాన చేసిన అనేక మౌలికమైన చట్టాలు దేశ సామాజిక పరివర్తనలో, అమలైన సామాజిక న్యాయంలో ప్రస్ఫుటంగా ప్రతిఫలిస్తున్నాయి. దేశంలోని పేద వర్గాలు, శ్రామిక ప్రజలు, సగటు మనుషులు, వెనుకబడినవర్గాలు, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వారి హక్కులు, అభివృద్ధి కోసం జగ్జీవన్రామ్ కృషి చేశారు. 1986 జూలై 6న బాబూజీ భౌతికంగా దూరమయ్యారు. దేశ ప్రజలు బాబూజీ సేవలను ఇప్పటికీ స్మరించుకుంటారు. సామాజిక, రాజకీయ బానిసత్వాలపై జీవితాంతం యుద్ధం చేసిన బాబూజీ ఎప్పటికీ స్ఫూర్తిదాత.
1946 ఆగస్టు 30న భారతదేశంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా బ్రిటిష్ వైశ్రాయి ఆహ్వానించిన 12 మంది దేశ నాయకుల్లో జగ్జీవన్రామ్ ఒకరు. 1946 సెప్టెంబర్ 2న ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వంలో కార్మికశాఖమంత్రిగా, అణగారిన సామాజికవర్గాలకు ఏకైక ప్రతినిధిగాను జగ్జీవన్రామ్ ఉన్నారు. మంత్రిమండలిలో పిన్న వయస్కుడైన జగ్జీవన్రామ్ను అందరూ ‘బేబి మినిష్టర్’ అని పిలిచేవారు.
– తీగల అశోక్ కుమార్
79891 14086