అంబేద్కర్ పేరు వింటేనే అదో ధైర్యం. దళితులు, గిరిజనులు, మైనారిటీలకు ఆయనొక ఆశాజ్యోతి. బడిలో.. గుడిలో.. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా తట్టుకొని నిలబడ్డారు. ఈ సమాజంలో రుగ్మతలపై చివరి శ్వాస వరకు పోరాడారు. సమ సమాజాన్ని స్థాపించాలని స్వప్నించారు.
ఊరూరా అంబేద్కర్ విగ్రహం.. ప్రతి హృదయంలో ఆయన స్థానం పదిలం. ఆయన రచించిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా పురుడు పోసుకున్నది. కులం పునాదుల మీద ఒక నీతిని, జాతిని నిర్మించలేమని కుండబద్దలు కొట్టిన మహనీయుడు. అస్పృశ్యత, అంటరానితనం, అమానవీయ ఘటనలపై ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నోరులేని మేకలనే బలిస్తారని, సింహాలను కాదని.. అందుకే ప్రతి ఒక్కరూ సింహం మాదిరిగా బతుకాలన్నారంటే సమాజాన్ని ఆయన ఎంత సునిశితంగా పరిశీలించారో అర్థమవుతుంది. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదని, పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి అని ఆయన ఘంటాపథంగా చెప్పారు. నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు.. జనం కోసం జీవిస్తే జాతి హృదయంలో నిలిచిపోతావని గొప్పగా చెప్పారు. మీ బానిసత్వాన్ని మీరు పోగొట్టుకోవాలని.. దేవుడు, మహానుభావుల మీద ఆధార పడవద్దని సొంతకాళ్ల మీద నిలబడి పోరాడాలనే ప్రతి మనిషిలో ధైర్యాన్ని నింపాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అంబేద్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. భారతదేశమే కాకుండా ఈ ప్రపంచంపై ప్రభావం చూపిన అతిగొప్ప మంది వ్యక్తుల్లో అగ్రగణ్యులు అంబేద్కర్. ఉన్నత చదువు కొందరికే పరిమితమైన రోజుల్లో.. అంటరానితనం, అస్పృశ్యత, అనాగరికం రాజ్యమేలుతున్న రోజుల్లో ఆయన అవమానాలను దాటుకొని చదివారు. ఉన్నత చదువులు చదివారు. లెక్కలేనన్ని డిగ్రీలు సాధించారు. అపార జ్ఞానాన్ని సంపాదించారు. మహా మేధావిగా ఈ ప్రపంచంలో పేరుగాంచారు.
అంబేద్కర్ తన మేధస్సును తన జాతికోసం.. తన దేశం కోసం వినియోగించారు. తన అద్భుత మేధస్సుతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించి భారతదేశ బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు. కాలాలు మారినా.. యుగాలు మారినా భారతదేశ ప్రజల్లో ఆయన చిరస్థాయిగా.. ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలిచిపోతారు. అనేక మతాలు, జాతులు.. విభిన్న సంస్కృతులు.. సంప్రదాయాలకు నెలవు మన భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వంలా మన దేశం నిలబడిందంటే అది మన రాజ్యాంగం గొప్పతనం. అందరూ సమానంగా, సగౌరవంగా బతికేలా మన రాజ్యాంగాన్ని అంబేద్కర్ నేతృత్వంలో రూపొందించారు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా మన దేశాన్ని కంటికి రెప్పలా పరిరక్షిస్తున్నది మన రాజ్యాంగం. ఇలాంటి మంచి రాజ్యాంగాన్ని రూపొందించి అంబేద్కర్ను భారతజాతి సర్వదా స్మరించుకున్నటుంది. అ మహనీయుడి ఖ్యాతిని నలుదిశలా చాటేలా 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డును ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు కృతజ్ఞతాభివందనాలు. తెలంగాణ ఉద్యమంలో తన ప్రాంత ప్రజల పక్షాన కేసీఆర్ నిలిచారు. పీడితుల పక్షాన బీఆర్ అంబేద్కర్ నిలిచారు. వీరిద్దరు అవమానాలు ఎదుర్కొని, అడ్డంకులు దాటుకొని, లక్ష్యం సాధించే దిశగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేశారు. లెక్కలేనంత కీర్తితో ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు.
– యనిగండ్ల అశోక్
99083 50676