తెలంగాణ రాష్ట్రంలోని 40 కులాలతో కలిపి దేశవ్యాప్తంగా 3,867 బీసీ కులాలు కేంద్ర ఓబీసీ జాబితాలో లేక అవస్థలు పడుతున్నాయి. ఈ 40 కులాలకు సంబంధించి గత ఏడాది డిసెంబర్ 21నుంచి 24 వరకు జాతీయ బీసీ కమిషన్ ఢిల్లీ కార్యాలయంలో విచారించి వివరాలు సేకరించింది.
విచారణ తుది నివేదికను భారత సామాజిక, న్యాయ మంత్రిత్వ శాఖకు పంపుతామని తెలిపారు. ఈ నివేదికలోని అన్ని కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చుతామని జాతీయ బీసీ కమిషన్ చైర్మ న్, ఇతర కమిటీ సభ్యులు హామీ ఇచ్చారు. దాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఓబీసీ జాబితాలో చేర్చాలని బాధిత కుల సంఘాల నాయకులు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే బిల్లు పెట్టి తమను జాబితాలో చేర్చి ఓబీసీ వర్గీకరణలో అవకాశం కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు బీసీ కులాలు అన్ని రంగాలలో నిరాదరణకు గురయ్యాయని ఆయా బీసీ కులాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం కేంద్ర పాలకులకు, పార్టీలకు,అధికారులకు తెలుసు. అయినా వారెవ్వరూ ఈ సమస్యను పరిష్కరించడానికి ముందుకు రావడం లేదని ఆయా కులాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
బుక్కయ్యవారు, గోత్రాల, బొందిలి, అరేమరాఠీ,ఆరె, అఘుముడియార్, సుంది, వారాల, సిస్టకరణ, వీరశైవలింగాయత్, అచ్చుకట్ల వారు, అద్దపువారు, బాగోతుల, బైలు కమ్మర, ఏనుటి, గంజికూటి, గౌడజెట్టి, కాకిపడిగల, పటంవారు, ఓడ్ సన్నాయిల,శ్రీ క్షత్రియరామజోగి, బైకాని/తెరచీరల, తోలుబొమ్మలవారు, ఆహీర్ యాదవ్, గౌలి, కుల్లకడిగి, అత్తర్ సాయబ్లు, దోబిముస్లిం, పక్కిర్ సాహెబ్లు, గారడీ ముస్లిం, గోసంగి ముస్లిం, గుడ్డేలుగుల వాళ్ళు, నాయిముస్లిం, లబ్బాయి, పక్కర్లు, తురుక కాషా, సరోళ్లు తదితర బీసీ కులాల వారు తమను ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
ఓబీసీ వర్గీకరణపై 2017 అక్టోబర్లో ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి ఆధ్వర్యంలో ఒక కమిషన్ను వేసింది. ఈ కమిషన్ కాల పరిమితిని ప్రభుత్వం ఇప్పటికే 12 సార్లు పొడిగించింది. ప్రస్తుతం కమిటీ కాల పరిమితి 31 జనవరి 2023తో ముగియనున్నది. దీంతో ప్రభుత్వానికి తుది నివేదికను ఇవ్వడానికి కమిషన్ సిద్ధపడింది. మరోవైపు, దేశవ్యాప్తంగా ఓబీసీలకు విద్య, ఉద్యోగాలలో కల్పిస్తున్న 27 శాతం రిజర్వేషన్లను బీసీల్లోని అన్ని కులాలకు వారి వారి జనాభా ప్రాతిపదికన అందించి న్యాయం చేయాలనే డిమాండ్ బలంగా ఉన్నది.
2017 అక్టోబర్లో రోహిణి కమిషన్ ఏర్పడేనాటికి దేశవ్యాప్తంగా 2,633 కులాలు మాత్రమే కేంద్ర ఓబీసీ జాబితాలో ఉన్నాయి. వారి జీవన విధానాలను పరిశీలించి 27 శాతం రిజర్వేషన్లను కేటగిరిలుగా విభజించాలని కమిషన్ భావిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ కమిషన్ తుది నివేదిక ఆధారంగానే కేంద్రం ఓబీసీ కులాల వర్గీకరణ చేయనుంది. దీని ప్రకారం ఆయా రాష్ర్టాల్లో ఉన్న ఓబీసీల జనాభా ఆధారంగా ఓబీసీ కేటగిరిలోకి వచ్చే కులాలను నాలుగు ఉప విభాగాలుగా విభజించే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. 27 శాతమున్న రిజర్వేషన్లను కేటగిరీల వారీగా 2, 6, 9, 10 శాతాలుగా నిర్ణయించనున్నారు. అలాగే ఏ కేటగిరీలో ఏ కులం ఉండాలనేది నిర్ధారణ చేయనున్నారు. ఇలా చేయడం వల్ల గతంలో నష్టం జరిగిన కులాలు లబ్ధి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందనేది కమిషన్ ఆశాభావం.అయితే కేంద్రం ఇక్కడో విషయాన్ని గమనించాలి. దేశ స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీష్ పాలనకాలంలో 1881 నుంచి 1931 వరకు దేశంలో కుల ఆధారిత జనగణన ఆరుసార్లు జరిగినట్టు, ఆ జనగణనలో దాదాపు దేశవ్యాప్తంగా 6,500 బీసీ కులాలు ఉన్నట్టు చరిత్ర చెబుతున్నది. కానీ నేటి కేంద్ర ఓబీసీ జాబితాలో కేవలం 2,633 కులాలు మాత్రమే ఉన్నాయి. అంటే మిగిలిన 3,867 కులాలు ఏమైనట్టు? దీన్ని బట్టి కేంద్రం వాటిని జాబితాలో చేర్చకపోవడం లేదా వాటిని బీసీ కులాలుగా గుర్తించకపోవడమే కారణమని తెలుస్తున్నది.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు కావస్తున్నా కుల ఆధారిత జనగణన ఇప్పటివరకు చేయలేదు. దీంతో బీసీ సామాజిక వర్గాల జనాభా వివరాలు లేకుండా పోయాయి. ఈ క్రమంలో జస్టిస్ రోహిణి కమిషన్ కేవలం ఓబీసీ జాబితాను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం సరికాదు. దేశవ్యాప్తంగా బీసీ కులాలుగా గుర్తింపు పొందిన అన్ని కులాలను పరిగణనలోకి తీసుకొని వర్గీకరణ చేయాలని ఆయా వర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో మొత్తం 130 బీసీ కులాలుంటే కేవలం 90 కులాలు మాత్రమే కేంద్ర ఓబీసీ జాబితాలో ఉన్నాయి. అందువల్ల మిగిలిన 40 కులాలకు వర్గీకరణ ఫలితాలు అందకుండా పోతున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో 146 బీసీ కులాలుంటే కేవలం 108 కులాలు మాత్రమే కేంద్ర ఓబీసీ జాబితాలో ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులాలను గుర్తించి కేంద్రానికి నివేదిక పంపినా వారిని ఓబీసీల్లో చేర్చకపోవడం విడ్డూరం. కమిషన్ కాల పరిమితిని 31 జనవరి 2023 వరకు పొడిగించారు కాబట్టి మిగిలిన కులాలను కూడా ఓబీసీ జాబితాలో చేర్చి ఆ కులాల ప్రజలను ఆదుకునే ఆలోచన చేయాలని బీసీ కులాలు కోరుతున్నాయి. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఓబీసీ బిల్లును ప్రవేశ పెట్టాలని ఆయా వర్గాల ప్రజలు కోరుతున్నారు.
(వ్యాసకర్త : శ్రీనివాస్ తిపిరిశెట్టి 99494 26536, అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర గోత్రాల కుల సంఘం)