ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని జాతుల ప్రజలు అభివృద్ధి చెందితేనే ఆ దేశ ప్రజాస్వామ్యానికి పరిపూర్ణత వస్తుంది. అది విజయవంతం కావాలంటే పాలకులకు ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి ఉండాలి. తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటుతర్వాత బీసీల అభివృద్ధికి అంకురార్పణ జరిగింది. బీసీల సమస్యలు తెలిసిన కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి అయినాక బీసీల జీవన ప్రమాణాల్లో మార్పు చోటుచేసుకున్నది.
2014, జూన్ 2న రాష్ట్రంలో బీసీల అభివృద్ధికి బీజం పడింది. దశాబ్దాలుగా బీసీలు బలంగా కోరుకుంటున్న బీసీ రిజర్వేషన్ల పెంపు, బీసీ జనగణన, బీసీ మంత్రిత్వ శాఖల కోసం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ బెదిరింపులకు వెరవకుండా అత్యంత బలంగా డిమాండ్ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే. కేంద్రం పరిష్కరించాల్సిన అంశాలపై కొట్లాడుతూనే మూడున్నర కోట్ల రాష్ట్ర జనాభాలో మన వద్ద కూడా యాభై శాతానికి మించి బీసీ జనాభా ఉన్నదని సాధికారికంగా సకల జనుల సర్వే ద్వారా తేల్చారు. ఈ వెనుకబడిన వర్గాలను విద్య, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ప్రయత్నాలు సీఎం కేసీఆర్, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ సారథ్యంలో చిత్తశుద్ధితో జరుగుతున్నాయి.
తెలంగాణ ఏర్పడేనాటికి అరకొర నిధులతో కేవలం 19 బీసీ గురుకులాలు పనిచేస్తుంటే, విద్య లేకపోతే జ్ఞానం రాదు, జ్ఞానం రాకపోతే బలహీన వర్గాల్లో చైతన్యం వెల్లివిరియదన్న మహాత్మా జ్యోతిబాపూలే మాటలను ఆదర్శంగా తీసుకొని, ఆ మహనీయుని పేరున బీసీ గురుకుల విద్యాసంస్థలను వజ్ర సంకల్పంతో ఏర్పాటుచేశారు కేసీఆర్. దీంతో బీసీ గురుకులాల 281కి పెరిగింది. పౌష్టికాహారం, సకల సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందుకుంటున్నారు. ఫలితంగా బీసీ విద్యార్థులు నీట్, ఐఐటీ వంటి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తూ దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందుతున్నారు. ఆటల్లో సైతం అదేస్థాయిలో రాణిస్తూ చాంపియన్లుగా అవతరిస్తున్నారు. అంతేకాదు, ఇండియన్ నేవీ, ఆర్మీలో సెలక్టయి దేశరక్షణలో భాగస్వాములవుతున్నారు. గురుకులాల్లో చదివిన మెరికల్లాంటి బీసీ బిడ్డలు రాష్ట్ర సగటు ఫలితాల్లో అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విధంగా గడిచిన పదేండ్లలో బీసీల విద్యాభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చుచేసిన కేసీఆర్ సర్కార్కు ఆత్మగౌరవం విలువెంతో తెలుసు. అందుకే బీసీలు ఆత్మగౌరవంతో ఉన్ననాడే నిజమైన పాలన అందుతుందని నమ్మి హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున దాదాపు రూ.6 వేల కోట్ల విలువ గల స్థలాలను బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల కోసం కేటాయించారు. ఇప్పటికే కొన్ని కులాల భవనాల నిర్మాణం పూర్తికాగా, మరికొన్ని భవనాల నిర్మాణం జరుగుతున్నది.
ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతూనే.. బీసీల హక్కుల కోసం కేంద్రంపై పోరాడుతున్నది. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ మొదటినుంచి డిమాండ్ చేస్తున్నారు. ఇక కులాలవారీగా జనగణన చేపట్టాలని బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని గట్టిగా అడుగుతున్నది. సావిత్రీబాయి, మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్ బహుజనులకు దిక్సూచిగా నిలుస్తున్నారు. అందుకే నేడు జరిగే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిగా చేసే బృహత్కార్యంలో మనమంతా భాగమవుదాం!
(వ్యాసకర్త: రాష్ట్ర లీగల్ అడ్వైజర్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ)
-ఎంసీ చంద్రశేఖర్ ముదిరాజ్
96478 19999