2023- 24 ఆర్థిక సంవత్సరం కోసం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ కుబేరులు, సంపన్నుల కోరిక మేరకు రూపొందించినట్టుగా స్పష్టమవుతున్నది. ఈ బడ్జెట్ రైతులు, పేదలు, కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులు తక్కువగా ఉన్నాయి. ఎం.ఎస్.స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం… కనీస మద్దతు ధరలను (ఎంఎస్పీ) అమలు చేయడానికి కేంద్రం నిరాకరించింది. రైతుల కష్టాలను తగ్గించడం కోసం ఎంఎస్పీకి చట్టపరమైన హామీని నిలబెట్టుకోలేదు. కార్పొరేట్ అనుకూల మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతులు పోరాటం చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమం కారణంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర అవమానానికి గురైంది. దానికి ప్రతీకారంగా గ్రామీణ ఉపాధి హామీ, ఆహారభద్రత, ఎరువుల సబ్సిడీ మొదలైన వాటిపై భారీగా కోత విధించినట్టుగా కేంద్ర బడ్జెట్ ప్రతిని చూస్తే అర్థమవుతున్నది.
2022- 23 బడ్జెట్లో కేంద్రం వ్యవసాయం కోసం రూ.1,24,000 (అంచనా) కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం 1,15,531.79 కోట్లు కేటాయించింది. ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’కి గత ఏడాది కేటాయించిన బడ్జెట్తో పోలిస్తే ఈ ఏడాది కేటాయింపులు పెంచలేదు. ఈ పథకం కోసం రూ.60,000 కోట్లు కేటాయింపులు చేసింది. దాదాపు 12 కోట్ల మంది లబ్ధిదారులకు ‘కిసాన్ సమ్మాన్ నిధి’ అందుతుందంటూ కేంద్రం చేసే వాదనలను పరిగణనలోకి తీసుకున్నా… రూ.72,000 కోట్లు కేటాయించాలి. కానీ కేంద్రం అలా చేయలేదు. ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’పై కూడా 2022-23 బడ్జెట్ రూ.15,500 (అంచనా) కోట్లతో పోలిస్తే ఈ బడ్జెట్లో రూ.13,625 కోట్లు మాత్రమే కేటాయించింది.
‘హరిత విప్లవం’ పథకాన్ని కేంద్రం ఇంతకుముందు కోర్ స్కీమ్గా ప్రచారం చేసింది. అందుకోసమే 2021-22 బడ్జెట్లో రూ.6,747 కోట్లు కేటాయించింది. కానీ, ప్రస్తుత బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరపలేదు. 2022-23కి గాను ఎరువుల సబ్సిడీలలో రూ.2,25,000 (అంచనా) కోట్లు కేటాయించింది. 2023-24 బడ్జెట్లో రూ.1,75,000 (అంచనా) కోట్లు కేటాయించింది. అంటే రూ.50 వేల కోట్లతో 22 శాతం కోత విధించింది. ఇలాంటి చర్య ఆహారధాన్యాల ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ బడ్జెట్లో సేంద్రియ వ్యవసాయానికి రూ.459 కోట్లు కేటాయింపులు చేసింది. ఇది మొక్కుబడి మాత్రమే. గత బడ్జెట్లో ‘రాష్ట్రీయ కృషి వికాస్ యోజన’కు రూ.10,433 కోట్లు కేటాయించిన కేంద్రం ఈ యేడు రూ.7,150 కోట్లు కేటాయించి భారీగా కోత విధించింది. 2022-23 బడ్జెట్లో ‘ప్రధానమంత్రి కిసాన్ సంచార్ యోజన’ కోసం రూ.12,954 కోట్లుగా ఉన్న కేటాయింపులు ప్రస్తుత బడ్జెట్లో రూ.10,787 కోట్లకు తగ్గాయి. మార్కెట్ ఇంటర్వెన్షన్, ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కోసం గత బడ్జెట్ 2022-23లో రూ.1500 కోట్లు కేటాయిస్తే.. 2023-24 బడ్జెట్లో కనీసం ఆ ప్రస్తావనే లేదు.
2022-23లో గ్రామీణ ఉపాధి కోసం రూ.1,53,525.41 కోట్లు (సవరించిన అంచనాల్లో)గా ఉన్న కేటాయింపులు 2023-24లో బడ్జెట్ అంచనాల్లో రూ.1,01,474.51 కోట్లకు భారీగా తగ్గించబడ్డాయి. ఎంజీఎన్ఆర్ఈజీఏ కోసం కేటాయింపులు 2022-23 రూ.89,000 కోట్ల (సవరించిన అంచనాల్లో) నుంచి 2023-24 బడ్జెట్ అంచనాల్లో రూ.60,000 కోట్లకు తగ్గించబడ్డాయి. చట్టబద్ధంగా హామీ ఇచ్చిన 100 రోజుల ఉపాధిని కల్పించాలని ప్రభుత్వం భావిస్తే 2.72 లక్షల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసిన తరుణం ఇది. ఈ బడ్జెట్ కేటాయింపులు దాని సొంత ఆర్థిక సర్వేను విస్మరించాయి. ఇది గ్రామీణ ఉపాధి పథకం కింద ఇప్పటికీ మహమ్మారి ముందుకాలం కంటే ఎక్కువగా డిమాండ్ ఉందని చూపింది. ఇది గ్రామీణ కష్టాలను సూచిస్తుంది. కీలకమైన పథకం కింద నిధుల కేటాయింపులు సరిపోకపోవడంపై నిరంతర నివేదికలు వచ్చాయి. ఇది చెల్లింపులు ఆలస్యం కావడానికి, రాష్ట్రవ్యాప్తంగా పను లను నిలిపివేసేందుకు దారితీసింది. తద్వారా అందుబాటులో ఉన్న ఉపాధి రోజులను దూరం చేసింది. ఈ ఏడాది బడ్జెట్ దేశంలోని గ్రామీణ పేదల పట్ల ప్రభుత్వ ఉదాసీనతను ప్రతిబింబిస్తున్నది. ‘ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన’కు కేటాయింపులు కూడా రూ.5,7 58 కోట్ల నుంచి రూ.2,273 కోట్లకు తగ్గాయి. ఏటా 2 కోట్ల మందికి ఉపాధి కల్పించాలన్న మాటలన్నీ సునాయాసంగా మర్చిపోయారు.
ఆహార సబ్సిడీ బిల్లులో అతి పెద్ద పతనం కనిపించింది. 2022-23లో రూ.2,87,194 కోట్ల నుంచి 2023-24లో రూ.1,97,350 కోట్లకు (31 శాతం) తగ్గించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఆహారధాన్యాలకు, వికేంద్రీకృత సేకరణకు బడ్జెట్ కేటాయింపులు 2022-23లో రూ.72,282.50 కోట్ల నుంచి రూ.59,793.00 కోట్లకు తగ్గించింది. దాదాపు రూ.12,500 కోట్లు (17 శాతానికి) తగ్గాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఆహార సబ్సిడీ కేటాయింపును భారీగా తగ్గించారు. 1,45,920 కోట్ల నుంచి రూ.1,37,207 కోట్లకు తగ్గించారు. ద్రవ్యోల్బణ ధోరణులను పూర్తిగా తగ్గించలేనప్పుడు ఈ చర్యలు రైతుల ఆదాయాల పరంగానే కాకుండా భారతదేశ ఆహారభద్రతపై కూడా ఆందోళన కలిగిస్తాయి. 2022-23లో రూ.500 కోట్లు కేటాయించారు. కానీ సవరించిన అంచనాల్లో రూ.150 కోట్లకు తగ్గించారు. వ్యవసాయం కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చర్చ రైతులకు కాకుండా కార్పొరేట్ కంపెనీలకు సహాయం చేయడానికి కూడా ఉద్దేశించబడింది.
‘అమృత్ కాల్’ గురించిన చర్చలన్నీ బూటకమైనవి. భారతదేశంలోని ఆహార ఉత్పత్తిదారులకు, కార్మిక ప్రజానీకానికి, పేదలకు గణనీయమైన ఉపశమనం లభించలేదు. అసలు కేటాయింపులను ఒకసారి పరిశీలిస్తే ఆర్థికమంత్రి ప్రసంగంలో చేసిన వాదనలు అవాస్తవాలుగా బయటపడుతాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చివరి బడ్జెట్ సారాంశం ఏమంటే.. ప్రజా వ్యతిరేక, రైతు, కార్మిక అనుకూల విధానాలను విస్మరించారనేది వాస్తవం.
ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రతపరంగా బడ్జెట్లో ప్రజలకు ఎలాంటి ఉపశమనం జరగలేదు. మైనారిటీల అభివృద్ధికి నిధులను రూ.1,810 కోట్ల నుంచి రూ.610 కోట్లకు తగ్గించడం ద్వారా బీజేపీ ప్రభుత్వం తన మతతత్వ స్వభావాన్ని మరోసారి బయటపెట్టుకున్నది.
(వ్యాసకర్త: తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి)
-మూడ్ శోభన్
99497 25951