ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రజల జీవన విధానాల్లో వచ్చిన మార్పులను అందిపుచ్చుకొని ముందుకు నడిచేందుకు ప్రతి దేశం తమ విద్యా వ్యవస్థను నిత్యం ఆధునీకరించుకుంటుంది. దేశంలో 34 ఏండ్ల తర్వాత విద్యారంగంలో కీలక మార్పులు చేసేందుకు మోదీ సర్కార్ నడుం బిగించింది.
విద్యార్థులు సమగ్ర వికాసం చెందేలా భా రతీయ విలువలకు పెద్దపీట వేస్తూ కస్తూరి రంగన్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ నూతన విద్యా విధానం-2020కు సంబంధించి వెలువడిన డ్రాఫ్టును అందరికంటే ముందుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్), దాని అనుబంధ సంస్థలు భారతీయ శిక్షణ్ మండల్ (బీఎస్ఎం), శిక్షా సంస్కృతి ఉథ్థన్ న్యాస్ (ఎస్ఎస్యూఎన్), భారతీయ భాషా మంచ్ (బీబీఎం) లు ఘనంగా స్వాగతించాయి. కొత్త విద్యావిధానంలో 60 శాతానికి పైగా సూచనలు తాము చేసినవేనని ఆయా సంస్థలు బాహాటంగా ప్రకటించాయి.
గతంలో వచ్చిన రెండు విద్యా విధానాలూ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వాటిపై లోతైన చర్చలు జరిగాయి. కాని 2020నూతన విద్యా విధానం డ్రాఫ్ట్ పార్లమెంటుతో సంబంధం లేకు ండా ఆమోదించిన మొదటి విద్యా విధానం ఇదే. ఈ పాలసీ ఆధారంగా చాలా చట్టాలు వస్తాయి. కాబట్టి కచ్చితంగా వాటిని రాష్ర్టాలు పాటించి తీరాలి. దీంతో రాష్ర్టాలపై కేంద్ర నియంత్రణ పెరుగుతుంది. ఈ విద్యా విధానం కేంద్ర రాష్ర్టాల మధ్య వివాదాల విధానంగా ఉంది.
విద్య, అధ్యయనం తదితర అంశాలపై దృష్టి ని కేంద్రీకరించేందుకు వీలుగా మానవ వనరు ల మంత్రిత్వశాఖ పేరును కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖగా తిరిగి పేరు మార్చడం అభిలషణీయం. దీంతో విద్యా విధానాన్ని ఇప్పుడున్న 10 + 2 నుంచి 5+3+3+4 గా విభజిస్తారు. మొదటి ఐదేండ్లలో ప్రీ ప్రైమరీ నుంచి 2వ తరగతి వరకు ఉంటాయి. రెండవ దశలో 3 నుంచి 5వ తరగతి, తర్వాత దశలో 6నుంచి 8వ తరగతులు, చివరి నాలుగేండ్లలో 9 నుంచి 12వ తరగతి వరకు ఉంటా యి. పిల్లలు తమకు నచ్చిన కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు.
అన్ని పాఠశాలల్లో సంస్కృత భాషను ముఖ్య భాషగా ప్రవేశ పెడతారు. సంస్కృత విద్యాలయాలు కూడా విభి న్న తరహా కోర్సులు అందించే విద్యా సంస్థలుగా రూపాంతరం చెందుతాయి.భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పేరుతో వేదాలను ఉపనిషత్తులను పురాణాలను విద్యావ్యవస్థలో ప్రముఖ పాత్ర నిర్వహించనున్నట్లు అర్థమవుతుంది. ఇంగ్లీష్ భాష,శాస్త్ర,సాంకేతిక,రంగాలు పరిశోధనా రంగం వాటికై నూతన విద్యావిధానం చేస్తున్న ప్రత్యేకమైన కృషి. విద్యావ్యవస్థలో శాస్త్రీ య దృక్పథానికి కృషికి బదులు విశ్వాసాలు నమ్మకాలకే ప్రాధాన్యత కనబడుతోంది. ఇది ప్రస్తుత ప్రపంచ ప్రగతికి విరుద్ధమైన భావనగా అర్థమవుతుంది.
దేశ విద్యా విధానాన్ని కార్పొరేట్ వ్యాపార అనుకూలంగా మార్చటం, విద్యా కాషాయీకరణ చేసేందుకు ఈ నూతన విద్యా విధానం రూపొందించారని అర్థమవుతుంది. ఈ మార్పులను అం దిపుచ్చుకోలేని విద్యాసంస్థలన్నీ మూసివేతకు గురవుతాయి. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు విద్యకు దూరమవుతారు. కానీ ఢిల్లీ నుండి గల్లీ వరకు కార్పొరేట్ విద్యా వ్యవస్థ లు విస్తరించడానికి సరైన భూమిక ఏర్పడుతుంది.
విద్యా వ్యాపారీకరణ వలన ఎస్సీ, ఎస్టీ, ఓబీ సీ, మైనారిటీలు, వికలాంగులకు సామాజిక న్యా యం దూరం చేసే విధంగా ఈ జాతీయ విధానం ఉన్నది. కేంద్రం ఒకటే పరీక్షలు నిర్వహించే సం స్థ, రెగ్యులేషన్ సంస్థ, అక్రిడిటేషన్ సంస్థ, ఒకటే ప్రమాణాలు నిర్ణయించే సంస్థలను స్థాపించడం వల్ల రాష్ర్టాల హక్కులను కేంద్రం లాగేసుకుంటుంది.ఈ విద్యావిధానంలో ప్రైవేట్ విశ్వ విద్యాలయాలను, విదేశీ విద్యాలయాలను అనుమతిస్తారు. పాఠశాల విద్యలో బోర్డ్ ఆఫ్ గవర్నర్ పేరుతో సామాజిక కార్యకర్తలు, కౌన్సిలర్లు, సీనియర్ సిటిజెన్ల ముసుగులో పెద్ద ఎత్తున సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నియామకం జరుగనుంది. స్థూలంగా ప్రభుత్వం తాము అనుకున్న వారిని యూనివర్సిటీ పాలనలో నియమించడం, తన భావజాలానికి తగ్గట్టు యూనివర్సిటీలు, పరిశోధనలూ నడచుకునేలా చేయడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుంది.
ఉన్నత విద్యలో విద్యార్థులు, ఉపాధ్యాయుల పాత్ర గురించి ఈ పత్రం చర్చించలేదు. ఆదివాసీల విద్యాభివృద్ధి, వారి సంస్కృతి వికాసా నికి ఎలాంటి హామీ ఇవ్వలేదు. జాతుల సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు, ఆచార సంప్రదాయాలు ఆవశ్యకతను పెంపొందించి తద్వారా దేశ ఐక్యతకు దిశానిర్దేశం చేసేలా కనిపించడం లేదు.
-మందా సైదులు