ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో.. అంటూ ఓ తెలుగు సినిమా డైలాగ్ అప్పట్లో చాలా పాపులర్ అయ్యింది. ‘తాడి తన్నేవాడుంటే తల తన్నేవాడుంటాడు’ అని మనకు ఒక సామెత కూడా ఉన్నది. నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత, మానవమాత్రులకు ఎవరూ సాధ్యం కానంత వేగంగా పెరిగిపోయిన అదానీ వ్యాపార సామ్రాజ్యంపై హిండెన్బర్గ్ వెలువరించిన నివేదికను చూస్తే ఒకేసారి ఈ రెండూ గుర్తుకు రాకమానవు.
అక్రమాల పుట్ట, అవినీతి గని అంటూ అనేక విశేషణాలను వాడుతుంటాం. కానీ, అవన్నీ అదానీ వ్యాపారాల ముందు బలాదూర్ అయ్యాయి. అడ్రస్ కాదుగనా కనీసం ఫోన్ నెంబర్ కూడా ఉండదు. కానీ, కాగితాలపై అదొక కంపెనీగా ఉంటుంది. అక్కడి నుంచి వందలు, వేల కోట్ల రూపాయల నల్లధనం అదానీ కంపెనీల్లోకి ప్రవహిస్తుంది. దీనిని చూపించి జనం చేత వాటాలు కొనిపిస్తారు. అంతే, ఆ వందలు, వేల కోట్లు లక్షల కోట్లవుతాయి. ఈ రకంగా మూడంటే మూడేండ్లలోనే అదానీ అక్షరాలా రూ.11 లక్షల కోట్లు సంపాదించారు.
అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ సంస్థ ఆర్థిక అక్రమాలపై పరిశోధనలు జరిపే సంస్థ. దీనిని 2017లో నాథన్ అండర్సన్ ఏర్పాటు చేశారు. 1937లో అమెరికాలో హిండెన్బర్గ్ అనే ఎయిర్షిప్ పేలిపోయి 36 మంది మరణించారు. దీని స్మృత్యర్థం అండర్సన్ తన కంపెనీకి హిండెన్బర్గ్ అని పేరు పెట్టారు. ఈ కంపెనీ పరిశోధన ఏ స్థాయిలో ఉంటుందంటే, ప్రపంచంలోని కొన్ని అగ్రశ్రేణి కంపెనీల్లో జరిగిన ఆర్థిక అక్రమాలపై సాక్ష్యాధారాలతో నివేదికలను వెల్లడిస్తే.. వేల కోట్ల డాలర్లుగా ఉన్న ఆ కంపెనీల ఆస్తుల విలువ పదుల కోట్ల డాలర్లకు పతనమైంది. ప్రకటించిన నివేదికలకు తూచ తప్పకుండా కట్టుబడి ఉండటం కూడా హిండెన్బర్గ్ ప్రత్యేకత. కోర్టుకు ఈడుస్తామని అదానీ కంపెనీ ప్రకటిస్తే.. స్వాగతం అని బదులిచ్చింది.
అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ స్టాక్ మార్కెట్ల గురించి, వాణిజ్య వ్యవహారాల గురించి, వ్యాపారంలోని అవకతవకల గురించి ఫోరెన్సిక్ పరిశోధనలు జరిపే సంస్థ. రెండేండ్లపాటు అదానీ గ్రూపు కంపెనీలలో జరుగుతున్న అక్రమాల గురించి క్షుణ్ణంగా పరిశోధన చేసింది. ఏ స్థాయిలోనంటే, అదానీ గ్రూపు కంపెనీల కార్యకలాపాలు కొనసాగుతున్న ఆరు దేశాలకు వెళ్లి అక్కడ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూడా పరిశీలించారు. అనేక మందితో మాట్లాడారు. అనేక సమాచార పత్రాలను, డాక్యుమెంటరీ ఎవిడెన్సును సేకరించారు. దీని నుంచి 45 నిర్ధారణలు చేశారు. ఈ మొత్తం ప్రక్రియను పూర్తి పారదర్శకంగా ఉంచారు. ఎక్కడెక్కడి నుంచి తాము సమాచారం సేకరించారో తెలుపుతూ, 720 సైటేషన్స్ను (ఆధారాల్ని) వెల్లడించా రు. పారదర్శకతకు కట్టుబడి ఉంటామన్న అదానీ మాటలను ఉటంకిస్తూ, తమ 45 నిర్ధారణలపై ఆధారపడి అదానీ గ్రూపున కు 88 ప్రశ్నలు వేశారు. చెప్పిన మాటను చేతల్లో చూపించాలని, పారదర్శకతను నిరూపించుకోవాలని కోరారు. ఇప్పుడు ఈ నివేదిక అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిలువెల్లా కంపింపజేస్తున్నది.
ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుల్లో 3వ స్థానంలో ఉన్న (హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో 11వ స్థానానికి పడిపోయారు) అదానీకి ఏడు లిస్టెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలతోపాటు అనేక ఇతర కంపెనీలున్నాయి. ఈ కంపెనీలు ఎట్లా నడుస్తున్నాయి? సెబీ నియమాల ప్రకారమే ఇవి స్టాక్ మార్కెట్లలో లావాదేవీలు నిర్వహిస్తున్నాయా? అని పరిశీలిస్తే, ఆ నియమాలన్నింటినీ ఉల్లంఘించారని తేలింది. అయినప్పటికీ ఎక్కడా అదానీకిగానీ, ఆయన కంపెనీలకు శిక్ష పడలేదు. అదానీ తన కుటుంబ సభ్యులతో కలిసి చేసిన అక్రమాలు కూడా అనేకం. ఎక్కడా ఉనికిలో లేని, ఏ పనీ చేయని డొల్ల కంపెనీలు, దొంగ కంపెనీలు పెట్టి, తప్పుడు మార్గంలో నల్లధనాన్ని తమ కంపెనీలకు వీరు రాబట్టుకున్నారు. ఆ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులను చూపించి, ఇవి చాలా పరపతి ఉన్న కంపెనీలు అని దొంగ కాగితాలు సృష్టించారు. ఈ విధంగా యథేచ్ఛగా స్టాక్ మార్కెట్ మ్యానిపులేషన్కు (అక్రమాలకు) పాల్పడి తిమ్మిని బమ్మిని చేశారు. అకౌంటింగ్ ఫ్రాడ్కు పాల్పడ్డారు. లెక్కల్లో అవకతవకలు అడుగడుగునా ఉన్నాయి. దీని ఫలితంగానే కేవలం గత మూడేండ్లలోనే గౌతమ్ అదానీ సంపద నికర విలువ 12 వేల కోట్ల డాలర్లు.. అంటే 11 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది.
ఇక అదానీ కంపెనీల రుణ చరిత్ర మరో చీకటి అధ్యాయం. ఆ కంపెనీలకు భారీ ఎత్తున రుణాలు తీసుకున్నారు. దీని కోసం వాళ్లు తమ స్టాకులను ధరావత్తుగా పెట్టారు. ఈ స్టాకుల ధరలను పెంచి తమ ధరావత్తు ఎక్కువ అని చూపించారు. అక్కడ కూడా తవ్విన కొద్దీ అక్రమాల పుట్ట పగులుతున్నది.
అదానీ వ్యాపారాలకు తగినట్లుగానే అతడి కంపెనీలను నడిపించే వారున్నారు. ఈ విషయాన్ని కూడా హిండెన్బర్గ్ నివేదిక బయటపెట్టింది. గౌతమ్ అదానీ తమ్ముడు రాజేశ్ అదానీ వజ్రాల వ్యాపారంలో అక్రమాలు చేశాడని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పరిశోధన నిఘా విభాగం (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్) 2004-05లో కేసులు పెట్టి, విచారణ జరిపింది. ఆయన నేరం చేశాడని ధ్రువీకరించింది. అంతేకాదు, పన్నులు ఎగ్గొట్టి అవినీతికి పాల్పడ్డాడని, ఫోర్జరీ చేశాడని కూడా తేల్చింది. అటువంటి ఘనమైన చరిత్ర ఉన్న వ్యక్తి నేడు అదానీ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. మరో ప్రముఖుడు సమీర్ వోరా. గౌతమ్ అదానీకి బావమరిది. ఆయనపై కూడా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ కేసులు పెట్టి విచారణ జరిపింది. ప్రభుత్వ సంస్థల ఎదుట వోరా తప్పుడు వాంగ్మూలాలిచ్చాడని, నమ్మదగిన వ్యక్తి కాదు అని ప్రకటించింది. ఆయన ఈరోజు అదానీ ఆస్ట్రేలియా డివిజన్ వ్యాపారాలకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు.
గౌతమ్ అదానీ అన్న వినోద్ అదానీ అసలు దొరకని మనిషి అనీ, తప్పించుకొని పారిపోతున్న వ్యక్తి అని దేశంలోని నిఘా సంస్థలు ప్రకటించాయి. హిండెన్బర్గ్ రిపోర్టులో కనీసం 10 నుంచి 12 ఆరోపణలు వినోద్ అదానీపై ఉన్నాయి. ఆయన మారిషస్లో 38 దొంగ కంపెనీలు (షెల్ కంపెనీలు) పెట్టాడు. అలాంటి దొంగ కంపెనీలకు ఏ వివరాలూ ఉండవు. అవి ఏ పనీ చేయవు. కంపెనీలో ఉద్యోగులుండరు. కానీ, కంపెనీ రిజిస్టర్ అయి ఉంటుంది. అక్రమ డబ్బు లావాదేవీలు జరపడానికి, నల్లధనం సరఫరా, చలామణి, రవాణా చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి. వినోద్ అదానీ ఇటువంటి దొంగ కంపెనీలు పెట్టి వాటి పేరు మీద 13 వెబ్సైట్లను ఒకేరోజు, ఒకే అడ్రస్తో క్రియేట్ చేశారు. ఆ కంపెనీలు ఏం ఉత్పత్తులు చేస్తాయో పేర్కొనలేదు. కానీ, రెండు కంపెనీలకు మాత్రం consumption abroad అని పేర్కొన్నారు. కానీ, ఎటువంటి consumption? అన్న వివరాలు మాత్రం లేవు. ఏం వ్యాపారమో చెప్పలేదు. ఇవి కేవలం అక్రమ ధనాన్ని రవాణా చేయడానికి ఉపయోగించే కంపెనీలు మాత్రమే అని హిండెన్ బర్గ్ నివేదిక పేర్కొన్నది. అదానీ గ్రూపు కంపెనీల్లో 1700 కోట్ల డాలర్ల మేర అక్రమాలు జరిగాయని తెలుస్తోంది.
ఇక తమ కంపెనీల ఆదాయాన్ని పెంచుకోవటానికి అదానీలు అనుసరించిన పద్ధతి కూడా పూర్తిగా అక్రమమైనది. తమ కంపెనీకే చెందిన షేర్ల ధరను పెంచడానికి ఆ షేర్లను కొంటున్నాం అని స్టాక్ పార్కింగ్ కంపెనీల ద్వారా ప్రకటింపజేస్తారు. దానికి భారీ ఎత్తున ప్రచారం కల్పిస్తారు. నిజానికి ఆ స్టాక్ పార్కింగ్ కంపెనీలు కూడా వారివే. అంటే, నికరంగా వారు కొనేదేమీ ఉండదు. కానీ, వీళ్ల తప్పుడు ప్రచారాలు చూసి మధ్యతరగతి మదుపరులు, చిన్న మదుపరులు ఆ షేర్లను విపరీతంగా కొంటారు. అపుడు ఆ దొంగ కంపెనీ వెనక్కి వెళ్లిపోతుంది. పేద, మధ్యతరగతి వాళ్లు కొన్న షేర్ల డబ్బులన్నీ గౌతమ్ అదానీ కంపెనీకి చేరతాయి. ఈ విధమైన స్టాక్ పార్కింగ్, స్టాక్ మ్యానిపులేషన్ వంటి ఆర్థిక అక్రమాల్లో అదానీ గ్రూపుది ఆరితేరింది.
సైప్రస్ అనే దేశానికి చెందిన ఒక కంపెనీ కేవలం మూడు నెలల కాలంలో అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీలో 420 మిలియన్ డాలర్ల షేర్లు కొన్నది. ఆ కంపెనీ తనకున్న మొత్తం నిధులలో 95శాతం అదానీ కంపెనీలోనే పెట్టుబడులు పెట్టింది. ఇది నిజంగానే షేర్లు కొనే కంపెనీయా? లేదా అదానీ సంబంధీకుల అక్రమ ధనం మారిషస్, సైప్రస్ల నుంచి వెనక్కి వస్తున్నదా? అని 2007లో సెబీ పరిశోధన జరిపింది. ముంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీలో అనేక అక్రమాలకు పాల్పడి, జైలు శిక్షను అనుభవించిన ఖేతన్ పరేఖ్ అనే స్టాక్ బ్రోకర్.. అదానీ గ్రూపు కంపెనీలతో లావాదేవీలు జరిపినట్లు సెబీ పరిశోధనలో వెల్లడైంది. ఈ అక్రమ అనుబంధం ఇప్పటికీ కొనసాగుతున్నదని ప్రస్తుత హిండెన్బర్గ్ నివేదిక వెల్లడించింది.
అదానీ లీలలు అన్నీ ఇన్నీ కావు. దీనికి మరొక విదేశీ ఉదాహరణ.. మారిషస్లో వినోద్ అదానీ నడుపుతున్న ఎమర్జింగ్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనే రిజిస్టర్డ్ కంపెనీలో ఒక్క ఉద్యోగి కూడా లేడు. కానీ, ఆ కంపెనీ అదానీ పవర్ గ్రూపులోకి 100 కోట్ల డాలర్లు అంటే 8 వేల కోట్ల రూపాయలు పంపించింది.
మోదీ రాజకీయ అధికారాన్ని ఉపయోగించుకొని అదానీ ఏ విధంగా అందలం ఎక్కారో హిండెన్బర్గ్ నివేదిక వెల్లడిస్తున్నది. అంతేకాదు దేశ సామాజిక, సాంస్కృతిక రంగాలను తన విద్వేషపూరిత ఎజెండాతో కకావికలం చేస్తున్న బీజేపీ.. ఆర్థికరంగంలో ఎంతటి నష్టదాయకమైన పనులకు పాల్పడుతున్నదో దీని ద్వారా తెలుస్తోంది. 30 ఏండ్ల క్రితం ఒక హర్షద్ మెహతా బయటపడితేనే దేశంలోని స్టాక్మార్కెట్లు కుప్పకూలాయి. మరి, ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో అంతుపట్టని పరిస్థితి. దేశ భవిష్యత్తును పణంగా పెట్టి బీజేపీ ఆడుతున్న ఈ జూదానికి అడ్డుకట్ట వేయాలి. లేకపోతే, భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు.
సూర్యకిరణ్