అదో.. చిన్న పల్లెటూరు. ఆ గ్రామంలో 400 గడప ఉంటుంది. అది, తెలంగాణ పల్లెకు అచ్చమైన ప్రతిరూపం. గత నెల 28న ఆ గ్రామంలో కొత్తగా వివిధ దేవుళ్ళ ప్రతిష్టాపన, ధ్వజస్తంభం ప్రతిష్ట జరిగింది. బొడ్రాయి పండుగకు ఊరి వాళ్ళందరూ తప్పక హాజరు కావాలనే నియమం ఉండటంతో ఎక్కడెక్కడో సెటిల్ అయ్యి, చాలా ఏళ్ల కిందటే ఊరును వదలిన వాళ్ళందరూ ఊరికి వచ్చారు. వారిలో మేమూ ఉన్నాం.
నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం పిట్టంపల్లిలో మే 28న బొడ్రాయి, ధ్వజస్తంభ ప్రతిష్ట సందర్భంగా కనిపించిన పరిస్థితి చూసి ఆశ్చర్యమేగాక, ఒకింత గర్వంగానూ అనిపించింది. బొడ్రాయి పండుగకు, ఆ చిన్న గ్రామానికి దాదాపు వెయ్యి కార్ల వరకు వచ్చాయి. ప్రతీ ఇంటికి కనీసం రెండు కార్లలో వచ్చారు. ఒక్కో ఇంటిలో ఆ రోజు కనీసం రూ.50 వేల నుంచి లక్ష వరకు ఖర్చు చేశారు. ఇది, తెలంగాణ రాష్ట్రంలో మారిన గ్రామాల ఆర్థిక స్థితిని తెలియచేస్తున్నది.
2014 కన్నా ముందు పిట్టంపల్లి నుంచి దాదాపు 70 శాతం మంది సమీపంలోని నల్లగొండ పట్టణానికి వివిధ పనుల నిమిత్తం, ఉపాధికై వెళ్లి తిరిగి రాత్రికి ఊరికి వచ్చేవారు. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో అన్ని తెలంగాణ గ్రామాలలాగే పిట్టంపల్లిలో కూడా నీటి కొరత , కరెంటు కోతలు, కనీస సౌకర్యాల లేమి వంటి సమస్యలు ఉండేవి. వ్యవసాయానికి నీటి సౌలభ్యం అంతంత మాత్రంగానే ఉండేది. కానీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం, గ్రామాల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. సౌడు ఇల్లు, గుడిసెల స్థానంలో పక్కా ఇండ్లు, మంచి బంగ్లాలు రావడం ఊరిలో మెరుగుపడిన ఆర్థిక పటిష్ఠతను తెలియచేస్తున్నది. గతంలో ఊరికి పోదామంటే, ఆమ్మో! అక్కడ కరెంటు ఉండదు, నీళ్లు ఉండవనే వంకతో పిల్లలు తప్పించుకునేవారు. కానీ, ఊరి పండుగకు రికార్డు స్థాయిలో, ఒక్క మా కుటుంబ సభ్యులమే దాదాపు 80 మందిమి వెళ్లినా ఏ విధమైన నీటి సమస్య గానీ, కరెంట్ సమస్యగానీ కలుగలేదు. దీనితో పిల్లలందరూ ఎంజాయ్ చేశారు. బోనాలు, బలిహరణ, ప్రతిష్టా కార్యక్రమాలు నయనానందకరంగా సాగాయి.
-కన్నెకంటి వెంకట రమణ
98499 05900