నీళ్లు, నిధులు, నియామకాలు కరువై తెలంగాణ ప్రాంతం అరిగోస పడుతున్న కాలం. నెర్రెలు బారుతున్న పొలాలను చూసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న రోజులు. బుక్కెడు బువ్వ కరువై దారాన్ని నమ్ముకున్న నేతన్న ఆ దారానికే ఉరి పోసుకొని వేలాడుతున్న చీకటి రోజులు. రాత్రిపూట వచ్చే కరెంటు కోసం వెళ్లి పాము కాటుకు, కరెంటు షాక్కు గురై మరణించిన అన్నదాతల ఆక్రందనలు మార్మోగుతున్న గడియలు.. ఇంతటి దారుణ ఘటనలు జరుగుతున్నా అప్పటి తెలంగాణ ప్రాంత నాయకులకు చీమ పారినట్టుగానూ అనిపించలేదంటే అతిశయోక్తి కాదు.
వలసాంధ్ర ప్రాంత నాయకుల మోచేతి నీళ్లు తాగుతూ, వాళ్లకు వంతపాడిన తెలంగాణ ప్రాంత నాయకులు తమ స్వార్థం కోసం తెలంగాణ ప్రాంత ప్రయోజనాలనే తాకట్టు పెట్టారు. చూస్తూ కూర్చున్న సమయంలో ఒక బక్క పలుచటి ప్రాణం తెలంగాణ ప్రాంతం కాష్టంగా మారకముందే రాష్ట్రం సాధించాలని తెగించి ఒక్క అడుగు ముందుకువేసింది. ఆ బక్క పలుచటి ప్రాణమెవరిదో మనకు తెలిసిందే. ఇప్పటి సీఎం కేసీఆర్ది.
ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేసిన నాయిన అప్పుడూ ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధి. అప్పట్లో ఆయన కొడుకు ఉన్నత చదువులు చదివి అమెరికాలో ఉన్నతోద్యోగం చేస్తున్నారు. మామూలు వ్యక్తి అయితే నాకెందుకులే ఉద్యమం, రాజకీయం. తెలంగాణ ఇచ్చేదా, వచ్చేదా అనుకునేవాడే.. కానీ, ఆయన అలా అనుకోలేదు. ఉద్యమంలో ఉరుమైండు. నాయినతో కలిసి నడువాలనుకున్నరు. ఆలోచన వచ్చిందే తడవుగా కొలువుకు సులువుగా రాజీనామా చేశారు. తాను పుట్టిన గడ్డ విముక్తి కోసం జరుగుతున్న ఉద్యమంలో తానూ ఓ నిప్పు కణికగా మారారు. ఆ కొడుకు ఎవరో కాదు, మన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.
రాష్ర్టాన్ని సాధించాలన్న ఆశయం తండ్రి కేసీఆర్ది అయితే, ఆ ఆశయం సాధన కోసం ‘నేను సైతం’ ఉద్యమంలో భాగస్వామిని అవుతానని అడుగులో అడుగు వేశారు కొడుకు కేటీఆర్. పోరాటాల పురిటిగడ్డ, ఉద్యమానికి ఊపిరి అయిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో తనదైన పాత్ర పోషించారు. ఇందులో భాగంగా తెలంగాణ ఉద్యమంలో పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, సడక్ బంద్ వంటి వినూత్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆఖరికి రెండు నెలల పాటు జైలు జీవితాన్నీ గడిపారు.
2014, జూన్ 2… తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తొలి తెలంగాణ ప్రభుత్వ క్యాబినెట్లో ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ తొలుత తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లపై ప్రత్యేక దృష్టిసారించారు. తనను గెలిపించి చట్టసభలకు పంపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు కంకణం కట్టుకున్నారు. నాడు ఉరిసిల్లగా మారిన సిరిసిల్లను అభివృద్ధిలో ఇప్పుడు ఉరికిపిస్తున్నారు. ఓ పదేండ్ల కింద సిరిసిల్లకు వెళ్లిన వ్యక్తి మళ్లీ ఇప్పుడు అదే సిరిసిల్ల వెళ్తే.. ‘ఇది సిరిసిల్ల కాదు, నేను దారి తప్పిపోయి వచ్చాన’నుకుంటాడు. ఇది వంద శాతం నిజం. దేశానికి తెలంగాణ మాడల్గా ఎలా ఎదిగిందో.. అలా రాష్ర్టానికి సిరిసిల్ల మాడల్గా ఎదిగింది. ఏ నాయకుడైనా తనను నేరుగా కలిసి సమస్యను విన్నవించుకుంటేనో, లేకుంటే బాధితుని ఇంటికి వెళ్లో సమస్యను పరిష్కరిస్తారు. కానీ కేటీఆర్ అందుకు భిన్నం. ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంటే, ఎక్కడినుంచైనా చేసి చూపించవచ్చని నిరూపించారు. ప్రజా సమస్యలను వినేందుకు సామాజిక మాధ్యమాలనూ వేదిక చేసుకున్నారు. ట్విట్టర్ వేదికగా సమస్యలు వింటూనే వాటిని పరిష్కరిస్తూ బాధిత ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ఒక్క సిరిసిల్లనే కాదు, రాష్ట్ర నలుమూలల నుంచి ఎవ్వరికి ఆపతి వచ్చింది ‘అన్నా’ అని సందేశం పంపితే చాలు ‘నేనున్నా..’ అని కేటీఆర్ భరోసా కల్పిస్తున్నారు.
జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మాట్లా డే కేటీఆర్ వాక్పటిమను పలువురు అంతర్జాతీయ నాయకులు కీర్తించిన విషయం మనకు తెలిసిందే… మచ్చుకు తీసుకుందాం. ‘ఇరవై ఏండ్ల తర్వాత కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) భారత ప్రధాని అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంత స్పష్టత, భావవ్యక్తీకరణ ఉన్న యువ రాజకీయ నాయకుడిని నేనెప్పుడూ చూడలేదు’ అని అమెరికా సిలికాన్వ్యాలీకి చెందిన వెంచర్ క్యాపిటలిస్ట్ అశా జడేజా మోత్వాని అన్నారు.
పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ బుత్రోత్సాహంబునాడు పుట్టును సుమతీ!
తన పనితనం, తన వాక్చాతుర్యంతో జాతీయ, అంతర్జాతీయ వేదికల నుంచి ప్రశంసలందుకుంటున్న కేటీఆర్ నుంచి ఉద్యమ నాయకుడు, తెలంగాణ ప్రదాత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతకన్నా ఆశించేదేముంటుంది? జన హృదయనేత కల్వకుంట్ల తారక రామారావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
(వ్యాసకర్త: రాష్ట్ర టీఎస్ఎఫ్డీసీ చైర్మన్)
అనిల్ కూర్మాచలం
90254 66666