సూర్యుని నుంచి వెలువడే నేరుగా భూమ్మీద పడితే సకల జీవరాసులకూ ముప్పు వాటిల్లుతుంది. ఆ ప్రమాదాన్ని అడ్డుకునేందుకు ప్రకృతి అద్భుతమైన సహజ రక్షణ కవచాన్ని ఏర్పాటుచేసుకున్నది. భూమి చుట్టూ ఆవరించి ఉన్న ఈ సహజ కవచమే ‘ఓజోన్ పొర’. ఇది భూమి నుంచి స్ట్రాటో ఆవరణంలో 15-50 కిలోమీటర్ల మందంలో విస్తరించి ఉన్నది. ఈ రక్షణ కొరవడితే మానవాళితో పాటు సమస్త జీవరాశి మనుగడకే ముప్పు వాటిల్లుతుంది.
క్షీణతకు కారణాలు: ఓజోన్ క్షీణతకు కారణమయ్యే క్లోరో ఫ్లోరో కార్బన్లు, హైడ్రో ఫ్లోరో క్లోరో కార్బన్లు, కార్బన్ టెట్రా క్లోరైడ్, బ్రోమినేటెడ్ ఫ్లోరో కార్బన్ల వంటి రసాయనాలు ఓజోన్ పొరను దెబ్బతీస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రసాయనాలన్నింటికే స్థూలంగా ‘ఓజోన్ డెప్లీటింగ్ సబ్స్టె న్సెస్’ (ఓడీఎస్) అని పేరు పెట్టారు. ఈ ఓడీఎస్ రసాయనాల్లో చాలావరకు పర్యావరణానికి నేరుగా ముప్పు కలిగించవు. భూమికి చేరువగా ఉన్న వాతావరణంలో ఇవి ఉన్నంతసేపూ వీటివల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. ఇవి భూమిని ఆవరించి ఉన్న తొలి వాతావరణ పొర అయిన ట్రాపోస్పియర్ను దాటుకొని, స్ట్రాటోస్పియర్ను చేరుకున్నప్పుడే ప్రమా దాలు ఏర్పడుతాయి. ఓజోన్ పొరపై ప్రభా వం చూపుతాయి.
క్షీణతకు అడ్డుకట్ట: ప్రమాదకర రసాయనాలు స్ట్రాటోస్పియర్ వరకు వ్యాపించడంతో ఓజోన్ పొర దెబ్బతినడం ఆరంభమైంది. 1985లో అంటార్కిటికా ధృవం వద్ద ఓజోన్ పొర మందం తగ్గిందని శాస్త్రవేత్తలు గుర్తించగా, 1985, మార్చి 27న ఈ విషయంపై వియన్నాలో ఓ అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఓజోన్ పొరకు నష్టం కలిగించే రసాయనాల వాడకాన్ని తగ్గించే విషయమై చర్చలు జరిపారు. ఓజోన్ పొర క్షీణత వల్ల పెను ప్రమాదాలను గుర్తించిన ఐరాస 1987, సెప్టెంబర్ 16న కెనడాలోని మౌంటేరియా సిటీలో ప్రపంచస్థాయి సదస్సును నిర్వహించింది. ఈ సందర్భంగా ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న పదార్థాల నియంత్రణ కోసం రూపొందించిన మాంట్రియల్ ప్రోటోకాల్పై ప్రపంచదేశాలు సంతకాలు చేశాయి. 1992లో భారతదేశం కూడా ఈ ఒప్పందంలో భాగస్వామిగా మారింది. మాంట్రియల్ ఒడంబడిక తర్వాత దానిపై సంతకాలు చేసిన దేశాలు క్లోరోఫ్లోరోకార్బన్ రసాయనాల వాడకాన్ని గణనీయంగా తగ్గించుకున్నాయి. మాంట్రియల్ ప్రోటోకాల్ పరిధిలోకి రాని రసాయనాలు కొన్ని ఇప్పటికీ వాడకంలో ఉన్నాయి. వీటి విషయంలో అశ్రద్ధ చూపకుండా ఓజోన్ పొరను మరింత సురక్షితం చేసుకోవలసిన అవసరం ఉన్నదని ప్రపంచ దేశాలు గుర్తించాయి. ఈ విషయమై గతంలో చేసుకున్న మాంట్రియల్ ప్రోటోకాల్పై మరిన్ని సవరణలు చేయడం కోసం 2016లో రువాండా రాజధాని అయిన కివాలిలో ప్రపంచ దేశాలు సమావేశం అయ్యాయి.
2045 నాటికి ప్రపంచవ్యాప్తంగా హెచ్ఎఫ్సీల వినియోగాన్ని 85 శాతం తగ్గించాలని తీర్మానం చేశాయి. దీనికోసం ఇప్పటికే 122 దేశాలు కివాలి సవరణపై ఆమోదాన్ని తెలిపాయి. ఈ సవరణ ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలు హైడ్రో ఫ్లోరో కార్బన్ల తగ్గింపును 2019 నుంచి ప్రారంభించాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలైతే 2024 నుంచి చేపట్టాలి. మొత్తంగా ఈ ఉద్గారాలను 2050 నాటికి పూర్తిగా నిర్మూలించాలి. ఈ విషయమై అమెరికా ఈ క్లోరోఫ్లోరో ఉద్గారాలను 2035 నాటికి 80 శాతం అరికడతామని, అదే చైనా అయితే 2045 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రకటించాయి. 1992 జూన్ 19న ఓజోన్ పొరను క్షీణింపజేసే పదార్థాలపై మాంట్రియల్ ప్రోటోకాల్కు మన దేశం కూడా కట్టుబడింది. అప్పటినుంచి సవరణలను మనం ఆమోదిస్తున్నాం. తాజాగా ఇప్పుడు ప్రధాన మంత్రి హైడ్రోఫ్లోరోకార్బన్లను దశలవారీగా తగ్గించడానికి మాంట్రియల్ ప్రోటోకాల్కు కివాలి సవరణను ఆమోదించడం హర్షణీయం. 2023 నుంచి వివిధ దశల్లో 2047 నాటికి 80 శాతం హెచ్ఎఫ్సీలను తగ్గించాలని భారత్ నిర్ణయం తీసుకున్నది.
ఓజోన్ క్షీణతకు దోహదపడే ఉత్పత్తులు, వాటి వినియోగంపై కఠిన చట్టాలు తీసుకురావాలి. అవి అమలు కావాలంటే ప్రత్యామ్నాయ రిఫ్రిజిరేటర్లు, తక్కువ ఉద్గారాలు విడుదల చేసే సంబంధిత టెక్నాలజీల కోసం దేశీయ ఆవిష్కరణలను ప్రోత్సహించాలి. ప్రత్యామ్నాయాలపై పరిశోధనలు సాగించకుండా నియంత్రణే లక్ష్యంగా ముందుకు ప్రయాణం చేస్తే ఎప్పటికీ లక్ష్యాన్ని చేరుకోలేం. ప్రపంచంలో మనవంతు బాధ్యతగా కివాలి సవరణను ఆమోదించడమే కాదు, దీన్ని మనం నిర్దిష్ట సమయంలో ఆచరణలో చూపగలగాలి. అప్పుడే ఇతర ప్రాణికోటి ఉనికిని కాపాడుకోవడంతో పాటు భావితరాల ప్రయోజనాలను కాపాడిన వాళ్లమవుతాం.
(వ్యాసకర్త: రుద్రరాజు శ్రీనివాసరాజు , 94412 39578 లెక్చరర్, ఐ.పోలవరం)