దామరచర్ల, జూన్ 05 : రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీధర్ బాబు ఉన్నతాధికారుల ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని, కావునా ఆయన మరణంపై విచారణ జరుపాలని గిరిజన గురుకులం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. కలెక్టరేట్లో గిరిజన సంక్షేమ శాఖలో ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న వడ్త్య శ్రీధర్ బాబు అకాల మరణం పట్ల గిరిజన గురుకులం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ నాయక్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రమేష్ నాయక్, రాష్ట్ర నాయకులు వీరా నాయక్, రాజేష్, స్వరాజ్యం, ఇతర సిబ్బంది మృతుడికి నివాళులర్పించారు.
ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి, నిజానిజాలను వెలికితీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంఘం డిమాండ్ చేసింది. మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరింది. శ్రీధర్ బాబు కుటుంబానికి న్యాయం జరిగే వరకు గిరిజన గురుకులం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం తన పోరాటాన్ని కొనసాగిస్తుందని రాష్ట్ర నాయకులు స్పష్టం చేశారు.