తెలంగాణ అన్ని రంగాల్లోనూ దూసుకువెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఇది ఓర్వలేని కేంద్రం రాష్ట్రంపై మరో తప్పుడు ప్రచారానికి తెరలేపింది.తెలంగాణ అస్తిత్వాన్ని, పరిపాలనను, అభివృద్ధిని దెబ్బతీయడానికి ఇప్పటివరకు చేసిన కుట్రలు, కుతంత్రాలు పారకపోవడంతో రాష్ట్రం భారీ అప్పులు చేసిందంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నది.
బీజేపీ తొమ్మిదేండ్ల పాలనలో వంద లక్షల కోట్ల అప్పుజేసినట్టుగా నివేదికలు చెబుతున్నాయి. ఇంత అప్పు చేసిన కేంద్రం.. తెలంగాణ మాదిరిగా ‘దేశానికి ఇది చేశాం. ప్రజలకు అది చేశాం. ఒక స్థిరాస్తిని సంపాదించి పెట్టాం’ అని చెప్పగలదా..? పైగా అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తున్న తెలంగాణపై వివక్ష చూపుతూ.. మొగున్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా బీజేపీ వ్యవహరిస్తున్నది.
తెలంగాణ చేసిన అప్పులను భవిష్యత్తు తరాల కోసం వివిధ పథకాల పెట్టుబడులకు వినియోగించింది. పలురకాలుగా స్థిర, సుస్థిర ఆస్తులను తెలంగాణ సమాజానికి సమకూర్చింది. అందుకు సంబంధించిన ఫలాలను ఇప్పటికే ప్రజలకు అందించింది. ఇదంతా కేంద్రానికి తెలిసినా ఏదో ఒక అభాండం వేయాలన్న దురుద్దేశంతోనే ఆలోచనలు చేస్తున్నది. దేశ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లాంటివాళ్లు రాష్ర్టానికి వచ్చి పదేపదే ఈ విషయాన్ని చెప్తున్నారంటే దీనివెనుక ఉన్న మర్మం ఏమిటో అర్థమవుతున్నది. గడిచిన ఎనిమిదన్నరేండ్లలో చేసిన వంద లక్షల కోట్ల అప్పులను పక్కకుపెట్టి, అప్పుల పేరిట రాష్ట్రంపై బురద జల్లి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం కేంద్రం ఎందుకు చేస్తుందన్న విషయాన్ని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది.
కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా రాష్ట్రం చేసిన అప్పులను జల్సాలకు వాడిందా? లేక, సమైక్య పాలనలో అన్యాయం జరిగిన పలురంగాలను బలోపేతం చేయడానికి పెట్టుబడి పెట్టిందా? అన్నదానిపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే ఏది అప్పు? ఏది పెట్టుబడి? ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? ప్రజలపై మమకారం ఉన్నదెవరికి? లేనిదెవరికి? ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసిందెవరు? చేయనిదెవరు? ప్రజల భవిష్యత్తు అవసరాలకు అనుకూలంగా స్థిరాస్తులను సమకూర్చిందెవరు? అప్పులు తెచ్చి, ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మి ఆ నిధులను జల్సాలకు వినియోగించిందెవరు? అన్న ఎన్నో విషయాలను అర్థం చేసుకోవచ్చన్నది ఆర్థికరంగ నిపుణల విశ్లేషణ!
దేశ ప్రజలకు జరుగుతున్న అన్యాయం, కార్పొరేట్ సంస్థల ముందు మోకరిల్లుతున్న తీరు, వనరులున్నా సద్వినియోగం చేసే సత్తా, సామర్థ్యం లేని ప్రధాని, కేంద్ర అసమర్థత, కీలకరంగమైన వ్యవసాయంపై వివక్ష, నియంతృత్వ పోకడల వంటి వాటిపై ఎదురుతిరిగి ప్రశ్నిస్తున్న ఏకైక సీఎం కేసీఆరే. కానీ, బీజేపీ అగ్ర నాయకత్వం తాను చెప్పిందే శాసనం అన్నట్టుగా వ్యవహరిస్తూ కేసీఆర్ అడుగుతున్న సూటి ప్రశ్నలను జీర్ణించుకోలేకపోతున్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం అస్తిత్వం, ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్నది. రాష్ర్టానికి న్యాయబద్ధంగా రావాల్సిన నిధులు, గ్రాంట్లు ఇవ్వకపోగా ఎఫ్ఆర్బీఎం పరిమితుల పేరిట మోకాలడ్డుతున్నది. ఇవి చాలవన్నట్టుగా ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలకు తెరలేపిన విషయం ఇటీవలే కండ్లారా చూశాం. ఆ విషయం బహిర్గతం కావడంతో ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులే టార్గెట్గా ఈడీ, ఐటీ, సీబీఐ, వంటి సంస్థలతో వరుస దాడులు చేయిస్తున్నది. అయినా కేసీఆర్ సర్కారు వాటిని లెక్క చేయకుండా ఎదురొడ్డి పోరాడటమే కాదు, కేంద్ర వైఫల్యాలను ఇతర రాష్ర్టాల్లోనూ ఎండగడుతున్నది. దీంతో కాషాయ పార్టీ కూకటి వేళ్లు కదిలే పరిస్థితులు ఏర్పడుతుండగా, రాష్ట్రంపై బురద జల్లేందుకు శత మార్గాల్లో ప్రయత్నిస్తున్నది. అయినా ఆ పార్టీ కపట నాటకాలు, కుట్రలు, కుతంత్రాలు, అవరోధాలను అలవోకగా అడ్డుకుంటున్న కేసీఆర్ను ఎలా దెబ్బకొట్టాలో తెలియక ఇప్పుడు అప్పులంటూ ప్రజలను పక్కదారి పట్టించే సరికొత్త డ్రామాకు తెరలేపింది.
ప్రాజెక్టులు దాని అనుబంధ రంగం, విద్యు త్తు రంగం, మిషన్ భగీరథ ఈ మూడు రంగాలను మనం ఉదాహరణగా తీసుకుంటే.. రాష్ట్రంపై కేంద్రం ఎంత తప్పుడు ప్రచారానికి ఒడిగడుతున్నదో అర్థమవుతుంది. 2014-15 వరకు తెలంగాణ ప్రాజెక్టులపై అప్పటి ప్రభుత్వాలు పెట్టిన ఖర్చు కేవలం రూ.38 వేల కోట్లే. తెలంగాణ అవతరించిన అంటే గడిచిన ఎనిమిదేండ్లలో భారీ, మధ్యతరహా, చిన్నతరహా ప్రాజెక్టులన్నింటిపైనా రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది లక్షా 69 వేల కోట్లు. సాగునీటి రంగానికి ఇచ్చిన ప్రాధాన్యం ఫలితంగా.. 2014-15 నాటికి 23.44 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే అది నేడు ఏకంగా 73లక్షల 33వేల ఎకరాలకు పెరిగింది. రాబోయే మూడేండ్లలో మరో 50 లక్షల 24 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది.
స్వరాష్ట్రంలో కోటికిపైగా ఎకరాల ఆయకట్టును సృష్టించాలనే సీఎం సంకల్పం సాకారం కానున్నది. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరిట లక్షా 69 వేల కోట్ల పెట్టుబడి వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై పెట్టినప్పుడు ప్రజలకు చేకూరిన ప్రయోజనాలు ఏమిటి? తద్వారా తెలంగాణ సమాజానికి సమకూరిన స్థిరాస్తులు ఏమిటి? అన్న దానిని కూడా పరిశీలించాలి. రాష్ట్రంలో వరి ఉత్పత్తి మూడు రెట్లు పెరిగింది. 2014-15లో ఉన్న 68.17 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నుంచి 2021-22 నాటికి 2 కోట్ల 2 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకున్నది. ఈ రోజు దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ మారింది. భూగర్భజలాలు పుష్కలంగా పెరిగాయి.అన్నింటికీ మించి భూముల ధరలు ఆకాశాన్నంటాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రంలో కనకవర్షమే కురిపించింది. గతంలో ఓ మారుమూల ప్రాంతంలో ఒక ఎకరం ధర రూ.2 లక్షలుంటే.. ఈ రోజు ఏ మూలకు వెళ్లినా రూ.20 లక్షలకు తక్కువ లేదు. పడావు పడ్డ భూములకు సైతం లక్షల్లో ధరలు పలుకుతున్నాయి. మెయిన్ రోడ్డు పక్కన భూములున్న రైతులు కోటీశ్వరులే. అలా లెక్కిస్తే పెరిగిన భూముల విలువ కొన్ని లక్షల కోట్ల ఉంటుంది. ఇది ప్రత్యక్షంగా రైతులకు చేకూరిన ప్రయోజనం. చెరువు నిండితే ఊరు బాగు పడుతుందన్నది సామెత. నీరు సమృద్ధిగా ఉంటే సమస్త కులవృత్తులు పునర్జీ వం పోసుకుంటాయి. దీనికి నిదర్శనం 2016 -17లో 1.93 లక్షల టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి కాగా, ఆనాడు దాని విలువ రూ.2, 190 కోట్లు. ప్రస్తుతం 2021-22లో ఆ సంపద 3.9 లక్షల టన్నులకు పెరగగా, దీని విలువ రూ.5,860 కోట్లకు చేరింది. రైతుబం ధు కింద 65 లక్షల మంది రైతులకు నేరుగా 65వేల కోట్ల పెట్టుబడి సాయం అందించిన ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై పెట్టిన పెట్టుబడులే నేడు దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణను దేశం ముందు తీర్చిదిద్దాయి.
ప్రాజెక్టులు, దాని అనుబంధ
రంగాలపై లక్షా 69 వేల కోట్లు, విద్యుత్తు రంగంపై రూ.38,070 కోట్లు, మిషన్ భగీరథపై రూ.36,900 కోట్లు ఈ మూడు రంగాలపై మొత్తం ఇప్పటివరకు ప్రభుత్వం రూ.2,43,970 కోట్ల పెట్టుబడులు పెట్టి అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నది. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా ప్రాజెక్టులు కట్టి తెలంగాణ ప్రజలకు తరగని స్థిర ఆస్తులను సంపాదించి పెట్టింది.
ఇవన్నీ కండ్ల ముందు కనిపిస్తున్న నిజాలు. తెచ్చిన అప్పుతో ఈ పనులు చేశాం అని చెప్పడానికి మన కండ్ల ముందు కనిపిస్తున్న ప్రాజెక్టులు, 24 గంటల విద్యుత్తు, స్వచ్ఛమైన తాగునీరే నిదర్శనం. ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతిరంగంలో సీఎం కేసీఆర్ దార్శనికత, భవిష్యత్తు తరాలకు సరిపోయే విజన్, ఈ ప్రాంతానికి మంచి చేయాలన్న తపన కనిపిస్తాయి. బీజేపీ తొమ్మిదేండ్ల పాలనలో వంద లక్షల కోట్ల అప్పుజేసినట్టుగా నివేదికలు చెబుతున్నాయి. ఇంత అప్పు చేసిన కేంద్రం.. తెలంగాణ మాదిరిగా ‘దేశానికి ఇది చేశాం. ప్రజలకు అది చేశాం. ఒక స్థిరాస్తిని సంపాదించి పెట్టాం’ అని చెప్పగలదా..? పైగా అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తున్న తెలంగాణపై వివక్ష చూపుతూ.. మొగున్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా బీజేపీ వ్యవహరిస్తున్నది. అందుకే ఏదీ అప్పు? ఏదీ పెట్టుబడి? అన్న విషయాలపై తెలంగాణ ప్రజలు లోతైనా ఆలోచన చేయాల్సిన అవసరమున్నది.
(వ్యాసకర్త: నమస్తే తెలంగాణ, ప్రతినిధి కరీంనగర్)
-కడపత్రి ప్రకాశ్రావు
80966 77022