ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావటం, వారు తమ విధులను నిష్పాక్షికంగా నిర్వహించే పరిస్థితులు లేకుండా నిబంధనలను మార్చటంపై 82 మంది రిటైర్డ్ సివిల్ సర్వీసుల అధికారులు తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు.‘కాన్స్టిట్యూషన్ కాండక్ట్ గ్రూప్’ అనే సంస్థకు చెందిన ఈ మాజీ అధికారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ యథాతథంగా…
దేశాన్ని సమైక్యంగా ఉంచటానికి, కేంద్రం-రాష్ర్టాల ప్రయోజనాలను సమన్వయపరచటానికి ఉపయోగపడుతున్న ఐఏఎస్, ఐపీఎస్ సర్వీసుల సమాఖ్యతత్వాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయి. తాము ఏ రాష్ర్టానికి కేటాయించబడ్డారో ఆ రాష్ర్టానికి కాకుండా కేంద్రానికి విశ్వాసబద్ధంగా ఉండేలా ఉన్నతాధికారుల మీద ఒత్తిడి తెస్తున్నారు. దీనికి నిరాకరించిన వారి మీద శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. కేంద్ర డిప్యుటేషన్లకు తప్పనిసరిగా వచ్చేలా సర్వీసు నిబంధనలను మార్చుతున్నారు. సంబంధిత అధికారుల అంగీకారంగానీ, వారు పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదంగానీ తీసుకోకుండానే ఇది చేస్తున్నారు. దీనివల్ల ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులకు తన కింద పనిచేసే అధికారుల మీద నియంత్రణ ఉండని పరిస్థితి తలెత్తుతున్నది. ఈ చర్యలన్నీ సివిల్ సర్వీసుల సమాఖ్య తత్వాన్ని దెబ్బతీస్తున్నాయి. సివిల్ సర్వీసుల అధికారులు కేంద్రం-రాష్ర్టాల మధ్య నలిగిపోతున్నారు. నిష్పాక్షికంగా ఉండలేని పరిస్థితులు వారిపై రుద్దబడుతున్నా యి. అధికారులను వారి సైద్ధాంతిక ఇష్టాయిష్టాల ఆధారంగా పోస్టులకు ఎంపిక చేస్తున్నారు.ఈ ధోరణికి మద్దతుగా ప్రధానమంత్రితోపాటు కీలకమైన వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఉదాహరణకు మూడు దృష్టాంతాలు..
2021లో ఐపీఎస్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్ను ఉద్దేశించి జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ప్రసంగిస్తూ, పౌర సమాజాన్ని నాలుగోతరం యుద్ధరంగంగా భావించాలని పిలుపునిచ్చారు. జాతి ప్రయోజనాలను దెబ్బతీసే పాత్రను పౌరసమాజం పోషిస్తుందని చెప్పారు. పౌరసమాజం నిరంతరం రాజ్యంతో ఘర్షణలో ఉండే వ్యవస్థ అని చేసే ప్రచారంలో భాగమే ఇదంతా. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి తీరని ముప్పు తీసుకొస్తాయి.
ఈ ఏడాది ఏప్రిల్ 21న సివిల్ సర్వీసుల దినోత్సవం సందర్భంగా, సివిల్ సర్వీసు అధికారులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు చేసిన తప్పుల మీద కఠినంగా వ్యవహరించాలని ఉద్బోధించారు. ఈ మాట సహజంగానే అనిపించినప్పటికీ, ప్రతిపక్షాల మీద గురి పెట్టమని అధికారులకు ఆయన పరోక్షంగా సూచించారు.
ముస్సోరిలోని లాల్బహదూర్శాస్త్రి అకాడమీ డైరెక్టర్ ఇటీవల ఒక పత్రికలో ఒక వ్యాసం రాశారు. ‘సివిల్ సర్వీసుల అధికారులకు భారతీయ విలువలను నిర్వచించే పని దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75వ సంవత్సరంలో మొదలైంది. ఈ మేరకు, జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన పంద్రాగస్టు ప్రసంగం మార్గదర్శకత్వాన్ని ఇచ్చింది. దేశానికి ఒక ప్రణాళికను నిర్దేశించింది’ అని ఆ వ్యాసంలో పేర్కొన్నారు.
కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వం సివిల్ సర్వీసులను దెబ్బతీస్తున్నది. పాలకపార్టీ కార్యకర్తలుగా సివిల్ సర్వీసుల అధికారులను మారుస్తున్నది. ఈ సందర్భంగా 1947లో రాజ్యాంగ సభలో సర్దార్ పటేల్ చేసిన ప్రసంగంలోని మాటలను ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ‘సివిల్ సర్వీసులతో కూడిన పాలనా యంత్రాంగానికి ప్రత్యామ్నాయమే లేదు. తన మనసులోని మాటలను నిర్భయంగా చెప్పగలిగే స్వాతంత్య్రం, తన చేతలకు కట్టుబడి ఉండే భద్రత సివిల్ సర్వీసులకు లేనప్పుడు సమైక్య భారతదేశం అనేదే ఉండదు. దీనిని మీరు పాటించకపోతే, ప్రస్తుత రాజ్యాంగాన్ని కూడా పాటించాల్సిన అవసరం లేదు. అన్నింటినీ తొలగించండి. అదే పరిస్థితి వస్తే, అల్లకల్లోల భారతదేశం తప్ప నాకు మరొకటి కనిపించటం లేదు’.