హైదరాబాద్ నగరం, మూసీ నది అవిభక్త కవలలు. స్వచ్ఛమైన మూసీనది ఒడ్డున అందాల హైదరాబాద్ నగరం నిర్మించబడింది. కానీ సీమాంధ్ర వలస పాలనలో వివక్ష, వినాశకర విధానాలతో హైదరాబాద్ నగరం తన ప్రభను కోల్పోయింది. మూసీ నదిని వారు మురికికూపంగా, డంప్యార్డుగా మార్చారు. సీమాంధ్ర పాలకుల వల్ల హైదరాబాద్లో జరిగిన విధ్వంసాన్ని సరిచేయడం కోసం కేసీఆర్ గత తొమ్మిదేండ్లుగా హైదరాబాద్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. హైదరాబాద్ నగరాన్ని పునఃనిర్మిస్తున్నారు. అట్లాగే మూసీనది పునరుజ్జీవం కోసం మూసీ రివర్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటుచేయడమే కాకుండా గోదావరిని మూసీనదితో అనుసంధానం చేసే మహత్తర కార్యక్రమానికి పూనుకున్నారు.
మంత్రి కే తారక రామారావు కృషితో పారిశ్రామిక, వ్యాపార రంగాలతో పాటుగా ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, యానిమేషన్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఘనమైన అభివృద్ధిని సాధించింది. కేటీఆర్ కృషి ఫలితంగా సామాజిక, ఆర్థిక, వాణిజ్య, రియల్ ఎస్టేట్ రంగాల్లో అత్యంత క్రియాశీలక నగరంగా హైదరాబాద్ అవతరించింది. అతి తక్కువ కాలంలోనే విశ్వ నగరాల్లో ఒకనగరంగా మారింది.
కేసీఆర్ పదే పదే చెప్తున్నట్టుగా హైదరాబాద్ నగరం చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం కలిగి ఉన్నది. ఇది అప్పటికప్పుడు చంద్రబాబు లాంటి ఒకరిద్దరు సీమాంధ్ర పాలకులచే నిర్మించబడలేదు, అభివృద్ధి చెందలేదు. వారిది ఇత్తేసి పొత్తుగూడె మొండి, తొండి వైఖరి. పైపెచ్చు వారి నిర్వాకం వల్లనే ప్రపంచంలో ఒక గొప్ప నగరంగా పేరున్న హైదరాబాద్ నగరం ధ్వంసమైంది. వారి నిర్లక్ష్య, వివక్షాపూరిత పాలనలో మూసీనది పరీవాహక ప్రాంతం అత్యంత కాలుష్య వాతావరణంలోకి నెట్టబడింది.
తెలంగాణ సిద్ధించి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేనాటికి మూసీ నది గృహ, పారిశ్రామిక, ఫార్మా, డ్రగ్ ఇండస్ట్రీస్ వ్యర్థాలను వదిలే ఒక డంప్యార్డ్, భారతదేశంలో ఉన్న అత్యంత విషపూరితమైన జలాలు గల నది. మూసీనది అంటే పాత కొత్త హైదరాబాద్లను వేరు చేసే ఒక సరిహద్దు విభజన రేఖ. పేద, ధనిక వర్గాలు విడివిడిగా నివసించే ఒక అడ్డుగోడ. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మూలవాసుల వలస జీవుల మురికివాడలు గల ప్రాంతం.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014-15 నుంచే హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించారు. ముఖ్యంగా మూసీ నది పునరుజ్జీవ అవసరాన్ని గుర్తించి కేసీఆర్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటుచేశారు. దీనిద్వారా దాదాపు 55 కిలోమీటర్ల మేరకు మూసీనది, పరీవాహక ప్రాంతాన్ని పర్యావరణహితంగా అభివృద్ధి చేశారు. దీనికి రూ.16,635 కోట్లు కేటాయించి మూసీ ఇసా నదులపై రోడ్లు, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీ), ప్యారిస్, గ్రీస్ తరహా బ్రిడ్జిలను నిర్మించనున్నారు. అందులో భాగంగానే మొన్న కేటీఆర్ మూసీ ఇసా నదులపై 7 బ్రిడ్జిలకు శంకుస్థాపన చేశారు. ఓఆర్ఆర్ తరహాలో పశ్చిమవైపు నుంచి తూర్పు దిక్కుకు వెంట రోడ్ కమ్ ఎలివేటెడ్ బ్రిడ్జిని నిర్మించబోతున్నామని అందుకు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని మొన్న కేటీఆర్ ప్రకటించారు. దీంతో చారిత్రక పాత హైదరాబాద్కు మరింత ప్రాధాన్యం పెరుగనున్నది. మూసీ నదికి ఇరువైపులా జీవించే ప్రజలకు మెరుగైన ఆధునిక సౌకర్యాలు లభించబోతున్నాయి. హైదరాబాద్ మూసీ అందాలు ద్విగుణీకృతం కానున్నవి.
రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది పునరుజ్జీవ కార్యక్రమంలో భాగంగా గోదావరిని మూసీతో అనుసంధానం చేసే మరో బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిద్వారా కొండపోచమ్మ నుంచి గండిపేటకు రూ.1,250 కోట్ల ఖర్చుతో గోదావరి నీటిని తీసుకువస్తారు. గండిపేట నుంచి దిగువకు గోదావరి నీటిని మూసిలోకి వదలడం వల్ల మూసీనది సజీవ నదిగా మారబోతున్నది. దీన్ని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. కానీ కేసీఆర్ కలలు కని, వాటిని సాకారం చేసి అద్భుతాలు సృష్టిస్తున్నారు.
తెలంగాణ గుండెకాయ, ప్రగతి రథచక్రమైన హైదరాబాద్ను విశ్వనగరంగా ఎదిగించాలనే లక్ష్యంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రభు త్వం చేపట్టింది. ఎస్ఆర్డీపీ (స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం), ఎస్ఎన్డీపీ (స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం) అనే ప్రత్యేక కార్యక్రమం తీసుకొని ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు, అండర్పాస్లు, కేబుల్ బ్రిడ్జిలు, స్టీల్ బ్రిడ్జిలు, స్కైవేలను నిర్మాణం చేసి కేవలం తొమ్మిదేండ్లలోనే హైదరాబాద్లో భారతదేశంలో ఏ ఇతర నగరాల్లో లేనటువంటి మౌలిక వసతులను ఏర్పాటు చేసింది. మొన్న కేసీఆర్ 2వ దశ మెట్రో విస్తరణ ప్రకటనతో హైదరాబాద్ నగర అభివృద్ధి మరింత వేగం కానున్నది.
బహుముఖ వ్యూహంతో హైదరాబాద్ నగరాన్ని ఒకవైపు అభివృద్ధి చేస్తూనే మరోవైపు పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నది. నగర ప్రజలను కాలుష్యం నుంచి, మానసిక ఒత్తిడి నుంచి రక్షించి వారికి ఆరోగ్య, ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తున్నది. అందుకుగాను తెలంగాణ ప్రభుత్వం అర్బన్ ఫారెస్టు విధానంలో భాగంగా అర్బన్లంగ్ స్పేస్లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ చుట్టూ గల ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్యగల చిన్నచిన్న పట్టణాలను గార్డెన్ సిటీలుగా, పాలిసెంట్రిక్ సిటీలుగా మార్చాలనే ప్రయత్నం చేస్తున్నది.
తెలంగాణలో సుస్థిర పాలన, మౌలిక వసతుల కల్పన, పర్యావరణ అనుకూలతలతో పాటు పారదర్శక పాలన వల్ల హైదరాబాద్ నగరం పెట్టుబడులకు స్వర్గధామమైంది. ముఖ్యంగా మంత్రి కే తారక రామారావు కృషితో పారిశ్రామిక, వ్యాపారరంగాలతో పాటుగా ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్, యానిమేషన్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఘనమైన అభివృద్ధిని సాధించింది. కేటీఆర్ కృషి ఫలితంగా సామాజిక, ఆర్థిక, వాణిజ్య, రియల్ ఎస్టేట్ రంగాల్లో అత్యంత క్రియాశీలక నగరంగా హైదరాబాద్ అవతరించింది. అతి తక్కువ కాలంలోనే విశ్వ నగరాల్లో ఒక నగరంగా మారింది. హైదరాబాద్ తన పూర్వవైభవాన్ని సంతరించుకొంటున్నది. ఈ అభివృద్ధిలో మూసీ నదికి ఇరువైపుల గల పాత హైదరాబాద్ నగర ప్రజలను భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో మూసీనది పునరుజ్జీవ కార్యక్రమానికి కేసీఆర్ పూనుకున్నారు. సమగ్ర, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధియే నిజమైన అభివృద్ధి అని ఆచరణలో చూపిస్తున్నారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగడం కోసం కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
డి.రాజారాం యాదవ్
97051 31472