2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అవినీతి వ్యతిరేక ఎజెండా సహాయపడింది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రజలు ఆశగా ఎదురుచూశారు. స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న అవినీతి మూటలను తెచ్చి తమకు పంపిణీ చేస్తారని భావించారు. కానీ వారి ఆశలు అడియాసలే అయ్యాయి.
ఇటీవలి వారాల్లో అవినీతి మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఒకటి కంటే ఎక్కువ విధాలుగా, అవినీతి ఆరోపణలు బిలియన్లను దాటిన 2012-14 దశను గుర్తు చేస్తుంది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ (సీపీఐ) 2023 నివేదికలో భారత్ భారీగా పతనమైంది. 180 దేశాలున్న ఈ జాబితాలో 2022లో 85వ స్థానంలో ఉన్న భారత్.. 2023 నాటికి 93వ స్థానానికి పడిపోయింది. మొత్తం స్కోరు 100 స్కేలుపై 40 నుంచి 39కి పడిపోయింది. భారత్ను ఆసియా-పసిఫిక్లో అత్యంత అవినీతి దేశంగా ఆ నివేదిక పేర్కొంది.
అవినీతి అనేది ప్రజల దైనందిన జీవితంలో ఒక వాస్తవం. ఉన్నత పదవుల్లో ఉన్నవారు చట్టానికి అతీతులని, అవినీతికి వ్యతిరేకంగా ప్రస్తుతం ఉన్న చట్టాలను వారు పట్టించుకోరన్నది వాస్తవం. ఎక్కువగా మధ్యతరగతి, కింది స్థాయి అధికారులే పట్టుబడతారు, అదీ కొన్ని సందర్భాల్లో మాత్రమే. పట్టుబడిన తర్వాత మళ్లీ అవినీతి మార్గాలను ఉపయోగించి చాలామంది తప్పించుకుంటారు. అజ్ఞాత దాతల నుంచి పెద్దమొత్తంలో డబ్బును రాజకీయ పార్టీలు సేకరించి ఎన్నికల్లో గెలిచేందుకు ఉపయోగించడంతో ఎన్నికలు అవినీతికి ఆలవాలంగా మారాయి.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్లీ అవినీతి మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు. ఇతర ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేసి తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారు. ఆ డబ్బు అంతా అవినీతి వ్యవస్థలోకి వెళ్తుంది. ప్రతిపక్షంలో ఉన్నవారిపైన, తమను విమర్శించేవారిపైన సెలెక్టివ్గా అవినీతి వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నారు పాలకులు. తమవారి, తమతో చేతులు కలిపినవారి అవినీతి పాలకులకు కనపడదు. అవినీతి నిరోధక చర్యలకు విశ్వసనీయత లేకపోవడంతో ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి.
న్యాయ వ్యవస్థలు బలహీనపడటం వల్ల ప్రభుత్వ అధికారుల్లో జవాబుదారీతనం తగ్గిపోయిందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ పేర్కొంది. న్యాయాన్ని నిరంకుశ, అప్రజాస్వామిక నాయకులు నిర్వీర్యం చేస్తున్నారని, లంచగొండితనం, అధికార దుర్వినియోగం అన్ని విభాగాల్లోనూ ఉందని వివరించింది. ఇది ప్రాథమిక హక్కులకు ముప్పుగా పరిణమించింది. పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రజల అణచివేత, పత్రికా స్వేచ్ఛ, ఇతర స్వేచ్ఛలపై జరుగుతున్న దాడులు బలహీనపరుస్తున్నాయి. అవినీతికి ఉత్తమ విరుగుడు పారదర్శకత, అది రాజకీయ పార్టీలతో సహా ప్రభుత్వం, పరిపాలన, సంస్థలలో ఎక్కడా కనిపించడం లేదు.
ప్రజలకు వారి హక్కుగా అందాల్సిన ప్రాథమిక సేవలను పొందడానికి కూడా డబ్బు చెల్లిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ సేవలను పొందడానికి ప్రతి 10 మందిలో ఏడుగురు లంచాలు ఇస్తున్నారని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ తెలిపింది. దేశంలో చెల్లిస్తున్న లంచాల్లో 73 శాతం తక్కువ ఆర్థిక వర్గాల నుంచేనని నివేదిక పేర్కొంది. కానీ, పెద్దపెద్ద మోసాల కేసులు వెలుగులోకి వచ్చినప్పుడు మాత్రమే అవినీతిపై దృష్టి సారిస్తారు. పేదలను ఎక్కువగా ప్రభావితం చేసే రోజువారీ అవినీతిపై పెద్దగా చర్చ జరగదు. రాజకీయ నాయకులు తెలివిగా ధనిక-పేద అంతరాలను చూపి ఓటర్లను పోలరైజ్ చేస్తారు.
పెద్దనోట్ల రద్దును అవినీతి నిర్మూలనకు అతిపెద్ద అడుగుగా ఎన్డీయే ప్రభుత్వం చెప్పుకున్నప్పటికీ అది పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ, సంపన్నులపై ఎక్కువగా ప్రభావం చూపిందనే భావనను సృష్టించింది. ధనవంతులపై ప్రతీకారం తీర్చుకోవాలనే తపనతో పేదలు మొదట్లో దాన్ని భరించారు. ఇది రాజకీయ నాయకుల ఉద్దేశానికి బాగా ఉపయోగపడింది. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయంటే ఎప్పటిలాగే అవినీతి వ్యతిరేక ఎజెండాతో ప్రజల ముందుకు రాజకీయ పార్టీలు వస్తాయి.
స్వామి ఆర్వీవీయస్