మేడి పండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు.. అని అప్పుడెప్పుడో వేమన చెప్పిన మాటలు ప్రస్తుతం మన దేశంలోని పత్రికా స్వేచ్ఛకు అద్దం పడుతున్నాయి. ప్రాణాలు పణంగా పెట్టి వార్తలు రాయాల్సిన దారుణ పరిస్థితులను నికార్సైన జర్నలిస్టులు ఎదుర్కొంటున్నారు. మోదీ హయాంలో మీడియా స్వేచ్ఛ కనుమరుగైపోయిందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
2021లో ప్రపంచవ్యాప్తంగా 19 మంది జర్నలిస్టులు హత్యకు గురైతే అందులో నలుగురు భారత్కు చెందిన వారు. ఏటా సగటున నలుగురు నుంచి ఐదుగురు జర్నలిస్టులు మన దేశంలో హత్యకు గురవుతున్నారని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. 2022లో ఇద్దరు జర్నలిస్టులు చనిపోగా 10 మంది జైలు పాలయ్యారు. సాక్షాత్తు యునెస్కో కూడా భారతదేశంలో జర్నలిస్టుల హత్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. కొద్దిరోజుల క్రితమే వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్-2022 వివరాలు విడుదలయ్యాయి. మొత్తం 180 దేశాలకు గాను భారత్ 150వ స్థానంలో ఉంది. అంతకుముందు ఏడాదిలో భారత్ 142వ స్థానంలో ఉండగా, 2022లో 150వ స్థానానికి పడిపోయింది. దేశంలో హరించుకుపోతున్న మీడియా స్వేచ్ఛకు ఇది అద్దం పడుతున్నది.
దేశంలో గతంలో ఎమర్జెన్సీ కాలంలో ఇలాంటి దుస్థితిని చూశాం. ఆ తర్వాత కొంతమేర పరిస్థితి మెరుగుపడింది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయ్యాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయనేది అనేక మంది సీనియర్ పాత్రికేయులు చెబుతున్న మాట. మీడియా అంటే మాధ్యమం. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధి. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలుపాలి. ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు చేరవేయాలి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. విద్వేషం, విభేదాలు తప్ప మరేదీ కనిపించడం లేదు. కొన్ని వర్గాలను, కొన్ని మతాలను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టేలా చర్చా కార్యక్రమాలు నిర్వహించటం, వార్తలు ప్రచురించడం ఇప్పుడు సాధారణమైపోయింది. మరీ ముఖ్యంగా జాతీయ మీడియా సంస్థలుగా చెప్పుకొనే టీవీ ఛానళ్లు, పత్రికల్లోనే ఇలాంటి దారుణాలను మనం చూడాల్సి వస్తున్నది.
పెట్ డాగ్గా మారిన వాచ్ డాగ్: ప్రతీ సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న దౌర్భాగ్య పరిస్థితి ఏమిటంటే.. పరిష్కారం చూపాల్సిన వ్యవస్థల చేతులను మోదీ సర్కారు కట్టి పడేసింది. దేశంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే ఓ సంస్థ ఉంది. ప్రభుత్వ శాఖలపైనా తన అధికారాన్ని వినియోగించగల అవకాశం ఈ సంస్థకు ఉంది. కానీ మీడియా కాస్తా మోదీయా అయ్యాక, ప్రెస్ కౌన్సిల్ వంటి స్వతంత్ర సంస్థల రెక్కలను మోదీ సర్కారు విరిచేసిందనే ఆరోపణలున్నాయి. దీంతో, దారుణాలు జరిగినప్పుడు వాటిని ఖండిస్తూ ఓ ప్రకటన జారీ చేయటం తప్ప.. ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఆయా సంస్థలు పడిపోయాయనే విమర్శ ఉంది.
ప్రసార, ప్రచురణ మాధ్యమాల్లో ఇలాంటి విద్వేష వార్తలు పెరిగిపోవడానికి కారణం ఉంది. మీడియా ఒకప్పుడు పాత్రికేయ యాజమాన్యాల చేతుల్లోనే ఉండేది. కానీ, ఆ తర్వాత మీడియా రంగంలో ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెట్టడం మొదలైంది. క్రమంగా అది ప్రైవేటు, కార్పొరేటు వ్యాపారంగా మారింది. ఆ వ్యాపారులు కూడా దేశాన్ని పాలిస్తున్న వారికి మిత్రులు కావడంతో.. చాలా వరకు మీడియా సంస్థలు వారి చెప్పుచేతల్లోకే వెళ్లిపోయాయి. ప్రస్తుతం దేశంలో దాదాపు 70 మీడియా సంస్థల్లో ముఖేశ్ అంబానీ పెట్టుబడులు ఉన్నాయి. మోదీకి మరో మిత్రుడైన అదానీ కూడా మీడియాలోకి ప్రవేశించారు. మొన్నటి వరకు తటస్థ మీడియా సంస్థగా ఉన్న ఎన్డీటీవీని హస్తగతం చేసుకున్నారు. ఈ విధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలావరకు కార్పొరేట్ల గుప్పిట్లోకి వెళ్లిపోయి మోదీకి బాకాలూదున్నది. ప్రజా సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించాల్సింది పోయి.. ప్రజలనే నిందించే స్థాయికి అవి దిగజారాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులపై ఉగ్రవాదులంటూ ముద్ర వేసే స్థాయికి చేరుకున్నాయి. సరిహద్దులో ఉగ్రవాదుల చొరబాట్లు జరుగుతున్నా, చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తున్నా దాని గురించి ప్రజలకు తెలియజేయకుండా కెమెరాలకు ముసుగేసుకున్నాయి. హిందూ, ముస్లిం అంటూ గొడవలు జరిగేలా చర్చా కార్యక్రమాలు నిర్వహించడానికి మాత్రం సమయం కేటాయిస్తున్నాయి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికం వంటి అంశాలు జాతీయ మీడియాగా చెప్పుకునే వాటిల్లో కనిపించకుండా పోయి దాదాపుగా ఎనిమిదేండ్లు అవుతున్నది.
మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ విధంగా మోదీ భజన చేస్తున్న సమయంలో మీడియా పాత్రను కొంతవరకు డిజిటల్ మీడియా నిర్వర్తిస్తున్నది. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, వెబ్సైట్లు కేంద్రం వైఫల్యాలను ప్రశ్నిస్తున్నాయి. తప్పిదాలను ఎత్తి చూపుతున్నాయి. కేంద్రంలోని పాలకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతున్నాయి. వాస్తవాలేంటో ప్రజలకు చూపెడుతున్నాయి. ఇది కేంద్ర పాలకులకు కంటగింపుగా మారి.. బెదిరింపులకు గురిచేస్తున్నారు. న్యూస్ లాండ్రీ అనే డిజిటల్ ప్లాట్ఫాంపై ఐటీ సోదాలు జరిగాయి. దేశంలో ఫ్యాక్ట్ చెక్కు కేరాఫ్గా మారిన మహమ్మద్ జుబేర్ జైలు పాలయ్యారు. పలువురు మహిళా జర్నలిస్టులు కూడా బీజేపీ, దాని అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తల నుంచి సామాజిక మాధ్యమాల్లో దారుణమైన వేధింపులు ఎదుర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహం కేసులు పెట్టడం పరిపాటిగా మారింది. అనేకమంది రచయితలను దేశద్రోహులుగా చిత్రీకరించి జైళ్లలో బంధించింది. ఇది ఎంతమాత్రమూ సహించదగినది కాదు. సమాజానికి నాలుగో స్తంభంగా మీడియాను అభివర్ణిస్తారు. కానీ ఆ నాలుగో స్తంభమే లేకుండా చేయాలనే కుట్రలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి నియంతృత్వ పోకడలు ఎంతమాత్రం సరికావు. దీనిని సమస్త రంగాల ప్రజలూ వ్యతిరేకించాలి. (వ్యాసకర్త: చైర్మన్, టీఎస్ రెడ్కో)
-వై.సతీష్ రెడ్డి
96414 66666