దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. రాజధాని ఢిల్లీలో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా ఇక్కడ అధికంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనాను నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది.
శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకూ వీకెండ్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా నియంత్రణకు ఈ నిబంధన బాగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ వీకెండ్ కర్ఫ్యూ సందర్భంగా ఢిల్లీ పోలీసులకు, ఒక ట్విట్టర్ యూజర్కు మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
పునీత్ శర్మ అనే ట్విటర్ యూజర్ ఒక ప్రశ్న వేశాడు. ‘‘సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి క్రికెట్ ఆడుకోవచ్చా?’’ అని పునీత్ ప్రశ్నించాడు. దీనికి ఢిల్లీ పోలీసులకు క్రికెట్ పరిభాషలోనే సమాధానం ఇచ్చారు.
‘‘అది సిల్లీ పాయింట్ సర్. ఇప్పుడు మనం ఎక్స్ట్రా కవర్ తీసుకోవాలి. అంతేకాదు, ఢిల్లీ పోలీసులు క్యాచింగ్లో నిపుణులు’’ అంటూ బదులిచ్చారు.
ఇది చూసిన నెటిజన్లు ఢిల్లీ పోలీసుల రిప్లైని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అద్భుతమైన గూగ్లీ’’ అంటూ ఒక యూజర్ మెచ్చుకోగా.. సూపర్ రిప్లై అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.