ముంబై : కొవిడ్-19తో మృత్యుముఖం నుంచి బయటపడిన ఆమె మలిదశలో ఎంచుకున్న వ్యాపారం ఆమెను సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేసింది. బాల్యంలో తాను ఆస్వాదించిన స్వచ్ఛమైన దేశీ నెయ్యిని ఎలాంటి రసాయనాలు కలపకుండా సహజంగా అందించాలనే సంకల్పంతో 50 ఏండ్ల వయసులో కమల్జిత్ కౌర్ సాగించిన ప్రయాణం నలుదిశలకూ చేరింది. దేశంలోని నగరాల్లోనే కాకుండా కిమ్ముస్ కిచెన్ నెయ్య వాసనలు ఇప్పుడు దేశ విదేశాలకూ పాకాయి. పంజాబ్లోని లుథియానాలోని చిన్న గ్రామంలో పుట్టిపెరిగిన కమల్జిత్ స్వచ్ఛమైన పాలు, నెయ్యి, వెన్న తింటూ పెరిగారు.
తనకు చిన్ననాటి నుంచి ఎప్పుడూ జ్వరం, జబ్బు బారిన పడినట్టు గుర్తులేదని, సహజమైన నాటి ఆహారం నేడు అందరికీ చేరవేయాలన్న లక్ష్యంతో థానేలో కిమ్ముస్ కిచెన్కు శ్రీకారం చుట్టానని ఆమె చెబుతున్నారు. ఫుడ్ అనేది కేవలం ఏదో తిన్నామా..కడుపు నింపామా అని కాదని, అది స్వచ్ఛంగా, సహజంగా మనం అందుకుంటున్నామా అనేది కీలకమని ఆమె అంటారు. భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయమే తనను వ్యాపారవేత్తగా మలిచిందని చెప్పుకొచ్చారు. ఎలాంటి కృత్రిమ రంగులు, రసాయనాలు లేకుండా ఫార్మ్ ప్రెష్ దేశీ నెయ్యిని అందించడమే తమ విజయ రహస్యమని కమల్జీత్ చెబుతారు.
కిమ్ముస్ కిచెన్ ప్రస్ధానం ఇప్పుడు నెలకు రూ 20 లక్షల రాబడికి చేరగా ప్రతినెలా 4500 బాటిల్స్ను విక్రయిస్తారు. తాము ఆర్జించే సొమ్ములో కొంత భాగంగా గురుద్వారాల వద్ద ఉండే పేదల ఆకలిని తీర్చడం వంటి సామాజిక సేవా కార్యక్రమాలపై వెచ్చించడం తమకు సంతృప్తి ఇస్తుందంటారామె. ఇప్పటివరకూ తాము భారత్లోనే దేశీ నెయ్యిని సరఫరా చేస్తుండగా, ఇటీవలే పోలండ్ నుంచి ఆర్డర్ వచ్చిందని చెప్పుకొచ్చారు. సరసమైన ధరల్లో సహజమైన ఫాం ఫ్రెష్ నెయ్యిని అందిస్తూ అటు సేవా కార్యక్రమాలతోనూ కమల్జిత్ సత్తా చాటుతున్నారు.