Agriculture | హైదరాబాద్, జులై 13 (నమస్తే తెలంగాణ): ‘గంటలో ఎకరం పార్తది.. ఈ లెక్కన వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తే రైతులకు మస్త్’ ఇదీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గుడ్డి లెక్క. కానీ వాస్తవ పరిస్థితి ఏమిటి? ఆయన అన్నట్టుగానే ఎకరం పొలం గంటలో పారుతుందా? వ్యవసాయానికి రోజుకు మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందా? అనే అంశాలపై శాస్త్రీయ కోణంలో పరిశీలిస్తే రేవంత్రెడ్డి చెప్పిన లెక్క వాస్తవ పరిస్థితికి పూర్తి విరుద్ధంగా ఉన్నది. రేవంత్రెడ్డి లెక్క ప్రకారం మూడు గంటల కరెంట్తో అర ఎకరం పొలం కూడా పారదని పలువురు వ్యవసాయ, నీటిపారుదల శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడిన పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు వాస్తవ లెక్కలను వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
వరి సాగుకు 100 రోజుల సమయం పడుతుంది. ఈ లెక్కన ఎకరం విస్తీర్ణంలో వరి సాగు చేయాలంటే మొత్తం 60 లక్షల లీటర్ల నీళ్లు అవసరం అవుతాయి. అంటే రోజుకు 60 వేల లీటర్లు కావాలి. రాష్ట్రంలో శాస్త్రీయ లెక్కల ప్రకారం 5 హెచ్పీ సామర్థ్యం కలిగిన మోటరు గల బోరు ప్రతి గంటకు 8-10 వేల లీటర్ల నీటిని ఎత్తిపోస్తుంది. ఈ లెక్కన 60 వేల లీట ర్ల నీళ్లు కావాలంటే ఆ బోరు 6 గంటల పాటు నడవాల్సిందే. దీని ప్రకారం పరిశీలిస్తే ఒక ఎకరం పొలం పారేందుకు 5-6 గంటల సమ యం పడుతుంది. ఇది నాట్లు వేసిన తర్వాత పరిస్థితి. అదే తొలిసారి మడి తయారు చేసేందుకు, ఒక ఎకరం నీళ్లు పారేందుకు రెండు రోజులు పడుతుంది. ఈ విధంగా ఎకరం వరి సాగు చేయాలంటే 6 గంటల విద్యుత్ ఇవ్వాల్సిందే. పసుపు, మర్చి, టమాట, ఇతర కూరగాయల వంటి ఉద్యాన పంటల విషయానికొస్తే ప్రతి ప్రతి ఎకరాకు 15 వేల వరకు మొక్కలుంటాయి. ఒక్కో మొక్కకు 2-3 లీటర్ల నీళ్లు అవసరం అవుతాయి. ఈ లెక్కన రోజుకు కనీసం 30 వేల లీటర్ల నీళ్లు అవసరం పడతాయి. ఒక బోరు గంటకు 8-10 వేల లీటర్ల నీటిని తోడిపోస్తే ఒక ఎకరం కూరగాయల చేను పారించేందుకు 3-4 గంటల సమయం పడుతుంది. అంటే ఆ బోరుకు 3-4 గంటల విద్యుత్ అవసరం అవుతుంది.
ఒక బోరు సగటున గంటకు 8-10 వేల లీటర్లను ఎత్తిపోస్తుంది. ఒక ఎకరం వరి సాగుకు రోజుకు 60 వేల లీటర్లు, కూ రగాయల సాగుకు 30 వేల లీటర్లు అవసరం అవుతుందనేది శాస్త్రీయ లెక్క. స్థానిక పరిస్థితులను బట్టి ఇందులో మార్పులు, చేర్పులు ఉంటాయి. స్థానికంగా భూగర్భ జలాలు, భూమి రకంపై ఈ లెక్క ఆధారపడి ఉంటుంది. ఎర్రటి నేలలు అధికంగా నీటినీ తీసుకుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ నీళ్లు అవసరం అవుతాయి. కొన్ని బోర్లు నిరాటంకంగా పోస్తే.. కొన్ని గ్యాబ్ ఇస్తూ పోస్తాయి. దీంతో కూడా లెక్కల్లో తేడా ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏ పంట సాగు చేయాలన్నా సరే వ్యవసాయానికి కనీసం 18 గంటల వి ద్యుత్ ఉండాల్సిందేనని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. లేకుంటే పంటల సాగు కష్టమవుతుందని తేల్చి చెప్పారు.
రైతుల బాధలు, వ్యవసాయం గురించి రేవంత్రెడ్డికి ఏం తెలువది. కాంగ్రెస్ పాలనల ఎన్ని తిప్పలు పడితిమో గుర్తుకొస్తునే ఒళ్లు జలదరిస్తది. అప్పట్ల ఇత్తనాలు నుంచి ఎరువుల దాకా దుకణాల ముందు చెప్పులు పెట్టి నిలుచునేటోళ్లం. తెలంగాణ సర్కార్ అచ్చిన తర్వాతనే రైతులకు ఫాయిదా జరుగుతున్నది. కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంట్ మస్తు సరిపోతదని అంటుర్రు. అది ఆళ్లకే తెలువాలే. ఎకరా పొలం గంటలోపే పారుతుందంటే ఎట్ల సాధ్యమైతదో గా కాంగ్రెసోళ్లు చెప్పాలే. మళ్ల రైతులను ఆగం జేస్తరేంది.
– మల్లేశం, రైతు, ఫసల్వాది గ్రామం, సంగారెడ్డి జిల్లా
కాంగ్రెసోళ్లు మునుపు అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ ఇయ్యక గోసపెట్టిండ్రు. ఇప్పుడిప్పుడే కొంచెం మంచిగైతుందంటే. మళ్ల కాంగ్రెసోల్లు మూడు గంటలు సాలు. రైతుకు దినమంత కరెంట్ ఎందుకు అంటూ దిక్కుమాలిన మాటలు మొదలు పెట్టిండ్రు. రేవంత్కు ఎవుసం ఏం తెలుసు? రైతులను నిండా ముంచుడు తప్ప. పదేండ్ల కింద కరెంట్ కోసం పడ్డ తిప్పలు మామూలు తిప్పలు కాదు. ఎప్పుడు కరెంట్ ఇత్తరో తెలువదు. ఎప్పుడు కరెంట్ పోతదో తెల్వదు. ఎండకాలంలో అయితే ఇక కరెంట్ కోసం పడిన తిప్పలు యాదికి అత్తె ఇప్పటికీ దుఃఖం అత్తది.
– చెట్టె మహేశ్, రైతు, తిమ్మాపూర్, జగిత్యాల రూరల్ మండలం
తొమ్మిదేండ్ల కింద కాంగ్రెస్ సర్కా రు తొమ్మిది గంటల కరెంటు ఇత్తమని చెప్పింది. ఎప్పుడత్తదో ఎప్పుడు పోతదో తెలువకుండే. తెల్లందాక పొద్దుందాక పొలం కాడనే సచ్చినం. ఎటు పోదామన్న కరెంటత్తదని ఆశతో చెట్టుకింద కాపలా గాసినం. నాకున్న మూడెకరాలలో వరేత్తే వచ్చిన 3 గం టల కరెంటుతో మూల తడవలే. నీళ్లకు గోసనే, కరెంటుకు తండ్లాటనే. కరెం టు అట్లిత్తం, ఇట్లిత్తమన్నోళ్లు చీకట్లనే ఉంచిండ్రు. ఇత్తులు, ఎరువులు, కరెం టు ఒకటా రెండా యవసాన్ని పాపిష్టోళ్లు పాడు చేసిండ్రు. గాళ్లను నమ్మకుంటే మన్ను బుక్కుడే అయితది.
-లింగంపల్లి పోచయ్య రైతు, బోనాల, రాజన్న సిరిసిల్ల జిల్లా