లండన్ : పెండ్లిండ్లు మూణ్ణాళ్ల ముచ్చటగా మారిన ఈ రోజుల్లో వారి వైవాహిక బంధం 81 ఏండ్లుగా కొనసాగుతోంది. కలతలు లేకుండా కాపురం సాగిస్తున్న వీరిద్దరూ వయసు రీత్యా 100 ఏండ్ల మైలురాయిని దాటి బ్రిటన్లోనే వైవాహిక బంధంతో అత్యధిక కాలం కలిసున్న జంటగా రికార్డులకెక్కారు. బకింగ్హాంషైర్లో 1941లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట 2021 జనవరి 4న 81వ పెండ్లి రోజు జరుపుకోగా వీరికి అభినందనలు తెలుపుతూ రాణి ఎలిజబెత్ పర్సనల్ గ్రీటింగ్ కార్డును పంపారు. రాన్ (100), జోస్ బాండ్ (102) 1941లో ఒక్కటైన వేళ ఇంత దీర్ఘకాలం వారు కలిసి ఉంటారని స్నేహితులు ఊహించలేదు.
పెండ్లి అయిన వెంటనే రాన్ రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనేందుకు వెళ్లాడు. ఈ జంటకు ఐలిన్, బిల్ అనే ఇద్దరు సంతానం కాగా ముగ్గరు మనవలు, ఆరుగురు మునిమనవలు, ఒక ముని మునిమనవడు ఉన్నారు. వారు ఇంతకాలం కలిసి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి రహస్యాలేంటో కూడా చెప్పుకొచ్చారు. తాము తొలిచూపులోనే ప్రేమలో పడ్డామని అప్పటి నుంచి ఇప్పటివరకూ అదే బంధానికి కట్టుబడ్డామని వారు చెబుతుంటారు. తమ ఇద్దరికీ ఎలాంటి ఇగోలు, అడ్డుగోడలు లేవని జోస్ బాండ్ చెబుతారు. తమకు ఎవరూ బాస్ కాదని, ఇద్దరం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మెలుగుతామని అంటారు.
తమ వైవాహిక బంధం 81వ ఏట అడుగుపెడుతుందని తాము ఊహిచలేదని, ఈ అద్భుత మైలురాయిని అధిగమించడం తమ అదృష్టమని నమ్ముతామని రాన్ చెప్పుకొచ్చారు. తాము జీవితంలో ఎన్నడూ ఘర్షణ పడలేదని, అవగాహనతో ముందుకెళతామని అదే దీర్ఘకాలంగా కొనసాగుతున్న తమ ప్రేమానుబంధ రహస్యమని వారు చెబుతుంటారు. తమ తండ్రి కుటుంబం ఉన్నతస్థితిలో ఉండేందుకు రెక్కలు ముక్కలు చేసుకుంటే ఇల్లును తీర్చిదిద్దేందుకు తల్లి కష్టపడేవారని వారి అనుబందం వివరిస్తూ వృద్ద జంట కూతురు ఎలీన్ చెప్పారు.