కోల్కతా: వ్యభిచార కూపం నుంచి బయటపడిన 14 ఏండ్ల బాలిక తిరిగి పాఠశాలకు వచ్చి పరీక్షల్లో 70 శాతం మార్కులు సాధించి అందరినీ అబ్బురపరిచింది. బాధిత బాలిక ఆశా (పేరు మార్పు) పలు రాష్ట్రాల్లోని వివిధ వ్యభిచార గృహాల్లో నరకం అనుభవించింది. పోలీసులు ఆమెను కాపాడిన అనంతరం తిరిగి స్కూల్లో చేరి అత్యధిక మార్కులు సాధించి సత్తా చాటింది. బాలిక ఇటీవల వెల్లడైన మాధ్యమిక పరీక్షల్లో 70 శాతం మార్కులు సాధించి ఔరా అనిపించింది.
2019 మే 23న అదృశ్యమైన బాలికను దళారులు విక్రయించడంతో త్రిపుర, ఢిల్లీ, రాజస్ధాన్, యూపీలోని వేశ్యా వాటికల్లో తీవ్ర శారీరక, మానసిక హింసను అనుభవించింది. ఈ ఏడాది జూన్ 18న ఆమె తన తండ్రికి ఫోన్ చేసి పరిస్ధితి వివరించడంతో ఎన్జీవో కార్యకర్తలతో కలిసి పోలీసులు బాధితురాలిని కాపాడారు. ముగ్గురు ట్రాఫికర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక నరకకూపం నుంచి బయటపడిన తర్వాత తిరిగి స్కూల్లో చేరి తన చదువును కొనసాగిస్తోంది.
తాను ఆర్ట్స్ చదవాలని నిర్ణయించుకున్నానని ఇంగ్లీష్, బెంగాలీలో తనకు 70 శాతం మార్కులు వచ్చాయని బాలిక చెప్పుకొచ్చింది. తాను స్కూల్ టీచర్ ఉద్యోగం సాధించి తల్లితండ్రులను బాగా చూసుకుంటానని తెలిపింది. తనకు తొమ్మిదవ తరగతిలో ఇంకా మెరుగైన గ్రేడ్లు రాలేదని, చీకటి రోజులను మరిచి చదువులో తిరిగి రాణించేందుకు కొంత సమయం పడుతుందని ధీమాగా చెప్పింది.