కరోనా వ్యాక్సిన్ అనేది ఇప్పుడు అందరికీ అవసరం. కానీ.. మారుమూల పల్లెల్లో మాత్రం కరోనా వ్యాక్సిన్ అందించడం చాలా కష్టం. ఎందుకంటే.. సరైన రోడ్డు ఉండదు. ప్రయాణించడానికి మార్గం ఉండదు. అడవుల్లో, కొండల్లో ఉండే పల్లెల్లో అందుకే వ్యాక్సిన్ శాతం పెరగలేదు. హిమాచల్ ప్రదేశ్లోని మలానా అనే గ్రామం పరిస్థితి కూడా అంతే. అది కూడా గుట్టల మీద ఉంటుంది. ఆ గ్రామానికి వెళ్లడానికి ఒకే ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం కూడా ఇటీవల కొండచరియలు విరిగిపడటంతో బ్లాక్ అయింది.
దీంతో.. ఆ ఊరికి రాకపోకలు బంద్ అయ్యాయి. గత నెలలోనే డాక్టర్ల బృందం ఆ గ్రామానికి వెళ్లి మొదటి డోస్ను ఇచ్చి వచ్చారు. ఆ తర్వాత సెకండ్ డోస్ కోసం ఆ గ్రామానికి వెళ్లాల్సి రావడంతో డాక్టర్ బృందం మరోసారి ఆ గ్రామానికి బయలుదేరింది. కానీ.. అప్పటికే ఆ ఊరికి వెళ్లే రోడ్డు మధ్యలో కొండచరియలు విరిగి పడటంతో తప్పని పరిస్థితుల్లో కొండలు, గుట్టలు ఎక్కి ప్రాణాలకు తెగించి ఆ ఊళ్లో అడుగుపెట్టారు డాక్టర్లు.
అయితే.. మొదటి డోస్ వ్యాక్సిన్ వేయడానికి ఆ గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు ఎవరూ వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రాలేదట. ఆ ఊళ్లో ఉన్న 1100 మంది యూత్ని ఒప్పించడం కోసం తల ప్రాణం తోకకు వచ్చిందని డాక్టర్లు వెల్లడించారు. వాళ్లకు నమ్మకం లేక.. ఆ ఊరి ప్రజలు కొలిచే దేవుడి ముందు వ్యాక్సిన్ వేయించుకున్నారట. మొత్తం మీద రెండో డోస్ కోసం మాత్రం ఆ గ్రామానికి మూడు గంటల పాటు ట్రెక్కింగ్ చేసి మరీ వెళ్లాల్సి వచ్చిందని డాక్టర్ల బృందం వెల్లడించింది.