జిల్లా ప్రభుత్వాస్పత్రికి ఒక పూజారి వచ్చాడు. తన కృష్ణుడి చెయ్యి విరిగిపోయిందని, కట్టు కట్టాలని డాక్టర్లను అడిగాడు. మరి కృష్ణుడు ఎక్కడ? అంటే తన చేతుల్లో ఉన్న బాలకృష్ణుడి విగ్రహం చూపించాడు. అతని మాటలు విన్న డాక్టర్లు ఒక క్షణం నివ్వెరపోయారు. ఆ తర్వాత ఇదేమన్నా ప్రాంకా? అని అతన్ని పట్టించుకోలేదు.
దీంతో ఆ పూజారి అక్కడే కూర్చొని బోరున విలపించడం ప్రారంభించాడు. ఈ ఘటన యూపీలోని ఆగ్రాలో వెలుగు చూసింది. లేఖ్సింగ్ అనే పూజారి చాలా కాలంగా బాలకృష్ణుడి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. ‘లడ్డూ గోపాల్’ అని పిలిచే బాలకృష్ణుడి విగ్రహానికి ఉదయం స్నానం చేయించే సమయంలో అతని చెయ్యిజారింది. దీంతో విగ్రహం చెయ్యి విరిగింది.
వెంటనే ఆ విగ్రహాన్ని తీసుకొని ఆసుపత్రికి వచ్చిన లేఖ్ సింగ్.. తన కృష్ణుడికి వైద్యం చేయాలని, చేతికి కట్టు కట్టాలని అడిగాడు. అతని మాటలు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఏడవడం ప్రారంభించాడు. దీంతో అతని బాధ చూడలేని వైద్యులు ‘శ్రీ కృష్ణ’ అనే పేషెంట్కు వైద్యం చేస్తున్నట్లు రిజిస్టర్ చేసుకొని, ఆ విగ్రహానికి కట్టు కట్టి పంపారు.