న్యూఢిల్లీ : ఈరోజుల్లో చివరినిమిషంలో పెండ్లి తంతును రద్దు చేసుకుంటున్న వధూవరులు తారసపడటం తరచుగా జరుగుతోంది. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా సుధాలియాలో వరుడు తప్పతాగి కనిపించడంతో కంగుతిన్న పెండ్లికూతురు అతడితో తాళి కట్టించుకునేందుకు ససేమిరా అంది.
పెండ్లికొడుకుతో పాటు అతడి తరపు బంధువులు సైతం తాగి ఊగుతుండటంతో షాక్ తిన్న వధువు ఈ నిర్ణయం తీసుకుంది. పీకలదాకా మద్యం సేవించిన పెండ్లికొడుకు సరిగ్గా నిలబడలేకపోవడంతో పెండ్లి మంటపంలో కూర్చునేందుకు నిరాకరించిన పెండ్లికూతరు అతడిని పెండ్లి చేసుకోనని, ఈ ఆవారా తనకు సరిజోడు కాదని తల్లితండ్రులతో తెగేసి చెప్పడంతో వారు మారుమాట్లాడలేదు. పోలీసులు సైతం పెండ్లికూతురు నిర్ణయానికి పూర్తి మద్దతు పలికి వారికి అండగా నిలిచారు.