లక్నో: ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంతగడ్డ. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి బలమైన కోట. తూర్పు ఉత్తర ప్రదేశ్ లేదా పూర్వాంచల్లో ఒక ముఖ్యమైన కేంద్రం. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని గోరఖ్నాథ్ ధామ్ లేదా మఠం ముఖ్య స్థానం. యోగి గురువైన మహంత్ వైద్యనాథ్ కాలంలో ఈ మఠం గోరఖ్పూర్ రాజకీయ కేంద్రంగా మారింది. మహంత్ వైద్యనాథ్, గోరఖ్పూర్లోని ఒక స్థానం నుంచి ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 1962, 1967, 1969, 1974, 1977లో గోరఖ్పూర్ జిల్లాలోని మణిరామ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు.
కాగా, మహంత్ వైద్యనాథ్ గురువు మహంత్ దిగ్విజయ్ నాథ్ కూడా గోరఖ్పూర్ లోక్సభ ఎంపీగా ఉన్నారు. 1969లో ఆయన మరణించడంతో గోరఖ్పూర్ లోక్సభ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో 1970 ప్రారంభంలో మహంత్ వైద్యనాథ్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి లోక్సభకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్థానానికి ఆయన రాజీనామా చేశారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్లో 18 రోజుల రాష్ట్రపతి పాలన ఏర్పడింది. దీంతో సీఎం మార్పునకు ఇది దారి తీసింది. 1969లో కాంగ్రెస్ విభజన నేపథ్యంలో కాంగ్రెస్ (ఓ) నాయకుడు త్రిభువన్ నారాయణ్ సింగ్ 1970 అక్టోబర్లో ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆయన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు కాదు. దీంతో మహంత్ వైద్యనాథ్ రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికయ్యే అవకాశం లభించింది.
మరోవైపు త్రిభువన్ నారాయణ్ సింగ్ ప్రభుత్వానికి, బహుళ పార్టీల సంకీర్ణానికి మహంత్ వైద్యనాథ్ మద్దతు ఇచ్చారు. అయినప్పటికీ గోరఖ్పూర్లోని మణిరామ్ స్థానంలో త్రిభువన్ నారాయణ్ సింగ్కు సవాల్ విసిరిన కాంగ్రెస్ ఐ అభ్యర్థి రామకృష్ణ ద్వివేది విజయం సాధించారు. దీంతో ఓటమి కారణంగా 1971 ఏప్రిల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి త్రిభువన్ నారాయణ్ సింగ్ రాజీనామా చేయవలసి వచ్చింది.
కాగా, ఉత్తరప్రదేశ్ సిట్టింగ్ సీఎం గోరఖ్పూర్ స్థానం నుండి ఎన్నికలలో పోటీ చేసి ఓడిన ఏకైక ఉదాహరణ ఇదే. మరోవైపు గోరఖ్పూర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న రెండో సిట్టింగ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఈ నేపథ్యంలో 1971 నాటి చరిత్ర పునరావృతం కాకూడదని బీజేపీ భావిస్తోంది.