జెంగ్ఝూ : సెంట్రల్ చైనాలో బయటపడిన 8,000 ఏండ్ల నాటి మట్టి కుండల్లో చైనా ప్రజలు మొనాస్కస్ను ఉపయోగించి మద్యం తయారు చేసినట్టు ఆధారాలు లభించాయని పురావస్తు శాస్త్రవేత్తలు వెల్లడించారు. హెనాన్ ప్రావిన్స్లోని పీలిగాంగ్ ప్రాంతంలో లభించిన రెండు మట్టి కుండల అవశేషాల్లో పెద్ద మొత్తంలో మొనాస్కస్ హైఫా, క్లిస్టోథెసియా, బియ్యం నుండి పులియబెట్టిన గంజిని గుర్తించామని చైనీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీకి చెందిన సహాయ పరిశోధకుడు లి యోంగ్కియాంగ్ చెప్పారు.
లి యోంగ్కియాంగ్ చైనీస్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ అసిస్టెంట్ రీసెర్చర్గా పనిచేస్తున్నారు. బయటపడిన మట్టి కుండలను ఒకప్పుడు మద్యం తయారీకి మద్యం నిల్వ చేయడానికి ఉపయోగించిన ఆనవాళ్లున్నాయని లి చెప్పారు. పీలిగాంగ్ చైనాలోని శిధిలమైన గ్రామాల్లో ఒకటి కాగా, ఇది దాదాపు 8,000 సంవత్సరాల నాటిదని చరిత్రకారులు పేర్కొన్నారు.
ఈ మట్టికుండలు బయటపడటంతో వ్యవసాయం పుట్టుక సేద్యం రూపాంతరం చెందడం, కుండల తయారీ, చేనేత పరిశ్రమ ఎదుగుదల, ప్రాచీన కాలంలో మద్యం తయారీ పద్ధతులపై పరిశోధనలకు ఊతమిచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు.