చెన్నై : తన ఆర్ధిక పరిస్ధితి అంతంతమాత్రమే అయినా నిలువెత్తు నిజాయితీని చాటుకున్న పారిశుద్ధ్య కార్మికురాలు అందరి ప్రశంసలూ అందుకుంటోంది. తమిళనాడులో చెత్తను సేకరించి వేరుచేసే పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న మేరీ తనకు దొరికిన వంద గ్రాముల బంగారు నాణేన్ని తిరిగి యజమానికి అప్పగించి ఆదర్శప్రాయంగా నిలిచింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొరియర్ కంపెనీలో పనిచేసే గణేష్ రామన్ తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో వంద గ్రాముల బంగారు నాణేన్ని ఇటీవల కొనుగోలు చేశాడు.
దాన్ని పింక్ కలర్ కవర్లో ఉంచి బెడ్ కింద దాచాడు. ఈ మధ్య హఠాత్తుగా గోల్డ్ కాయిన్ కనిపించకపోవడంతో కంగుతిన్న రామన్ భార్యను అడగ్గా, తాను గదిని శుభ్రం చేస్తూ కవర్ను చెత్తలో పడేశానని ఆమె చెప్పడంతో వెంటనే శాతంగులం పోలీసులకు పిర్యాదు చేశాడు. పోలీసులు ఆ ఏరియాలో ఆరోజు చెత్త క్లీన్ చేసిన సిబ్బంది ఎవరని ఆరా తీసేందుకు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. ఈలోగా చెత్తను శుభ్రం చేస్తుండగా తనకు దొరికిన కవర్లో కనిపించిన బంగారు నాణేన్ని మేరీ తన మేనేజర్ ద్వారా పై అధికారులకు అప్పగించింది. ఆపై రామన్ తన కుటుంబసభ్యులతో కలిసి సోమవారం శాతంగులం పోలీస్ స్టేషన్కు రాగా అందరి సమక్షంలో గోల్డ్ కాయిన్ను మేరి వారికి తిరిగి అప్పగించింది. మేరి నిజాయితీని ఆమె పై అధికారులతో పాటు పోలీసులు ప్రశంసించారు.