Singapore | సింగపూర్లోని చైనాటౌన్లో (Chinatown) ఉన్న మారియమ్మన్ ఆలయంలోని (Mariamman Temple) శ్రీ వాసవి మాత (Vasavi Matha) జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ (VCMS) ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబురాల్లో సింగపూర్ ఆర్యవైశ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వాసవి జయంతితోపాటు వీసీఎమ్మెస్ పదో వార్షికోత్సవ వేడుకలను కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో సుమారు ఎనిమిది గంటల పాటు నిర్విఘ్నంగా జరిగిన పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సుమారు 350 మందికి పైగా ఆర్య వైశ్యులు పాల్గొని తమ శ్రద్ధ, భక్తి ప్రపత్తులను చాటి చెప్పారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన, అలంకార పూజ, రథయాత్ర మొదలైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. వీసీఎమ్మెస్ కార్యనిర్వాహక బృందానికి చెందిన నాగరాజ్ కైల, శ్రీధర్ మంచికంటి మాట్లాడుతూ అతి కొద్దిమంది ఆర్యవైశ్యులతో చిన్న సంస్థగా ప్రస్థానాన్ని ప్రారంభించిన వీసీఎమ్మెస్.. ఈ పదేండ్లలో ఒక వటవృక్షంగా ఎదగటం ఆనందించదగిన విషయమని చెప్పారు. దీని వెనక ఎందరో సింగపూర్ ఆర్యవైశ్యుల అంకితభావం, కృషి ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా పాల్గొన్న బొబ్బ శ్రీనివాస్కు ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఇందులోభాగంగా ‘గణానాం త్వ గణపతిం’ అంటూ కారె సాయి కౌశాల్ గుప్త చేసిన గణపతి ప్రార్ధనతో కార్యక్రమాలు మొదలయ్యాయి. శిల్పా రాజేష్ సారథ్యంలో కోలాట నృత్య ప్రదర్శన బృందం వేదికపై వాసవి మాతకు కోలాటంతో వందనాలు సమర్పించారు. సింగపూర్లో మొదటిసారిగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్రను నాటక రూపంలో ప్రదర్శించారు. అంతేగాక యువ కళాకారులు అక్షరశెట్టి మాడిచెట్టి, ముక్తిధ మేడం, ఉమా మోనిష నంబూరి ల భరతనాట్య ప్రదర్శనలు, తన్వి మాదారపు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఆనంద్ గంధే, కిరణ్ కుమార్ అప్పన, కొండేటి ఈశాన్ కృష్ణ తమ గాత్ర ప్రతిభతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. సాయంత్రం అమ్మవారికి జరిపిన కుంకుమార్చన అలంకార పూజ పిదప జరిగిన రథయాత్రలో భాగంగా శ్రీమతి గాదంశెట్టి నాగ సింధు గారి నేతృత్వంలో 16 మంది తరుణీమణులు చేసిన మరొక కోలాటం వచ్చే ప్రదర్శన కూడా అందరినీ ఎంతో ఆకట్టుకుంది.
ఇదే సందర్భంగా వీసీఎమ్మెస్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ప్రెసిడెంట్గా మురళీకృష్ణ పబ్బతి, సెక్రటరీగా సుమన్ రాయల, కోశాధికారిగా ఆనంద్ గంధే, మహిళా అధ్యక్షురాలిగా సరిత విశ్వనాథన్ ను ఆహూతులకు పరిచయం చేశారు. ఆ తరువాత సంస్థ అభివృద్ధికి కృషిచేసిన నరేంద్ర కుమార్ నారంశెట్టిని ఘనంగా సత్కరించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు సంధానకర్తగా ఆత్మూరి వెంకట రామ ఫణేష్, సహవ్యాఖ్యాతగా వాసవి ఫణేష్ ఆత్మూరి వ్యవహరించారు. ఈ కార్యక్రమం విజయవంతమవడానికి కృషిచేసిన అందరికీ మురళీకృష్ణ పబ్బతి కృతజ్ఞతలు తెలిపారు.