హైదరాబాద్ : సింగపూర్కు చెందిన ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా తెలుగు సాహితీ సంస్కృతికి తలమానికమైన అవధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగపూర్ వేదికపై వద్దిపర్తి పద్మాకర్ అష్టావధానం నిర్వహించడం ఇదే తొలిసారి కాగా.. ఆయనకు ఇది 1,240 అవధానం కావడం విశేషం. సంక్రాంతి పర్వదినం కానుకగా తెలుగు వారికి అందించేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని సంస్థ అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో గౌరవ అతిథులుగా మండలి మాజీ చైర్మన్ బుద్ధ ప్రసాద్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు, సంచాలకులుగా ఆస్ట్రేలియా నుంచి తటవర్తి కల్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. అవధానం ఆధ్యాంతరం చలోక్తులతో కొనసాగింది. ‘కృష్ణున్బొంది సుయోధనుండు మురిసెన్ గీతామృతాస్వాదియై’ అనే శార్దూల వృత్తంలో సమస్యాపూరణం, దత్తపది అంశంలో ‘గురువు’ అనే పదాన్ని నానార్థాలలో వాడుతూ చంపకమాల వృత్తం, ఆధునిక మహిళ విజయాలపై నిషిద్ధాక్షరి అంశం కొరకు కంద పద్యం, న్యస్తాక్షరి అంశం కొరకు ‘గాలిపటం’ అనే పదంలోని అక్షరాలను వేర్వేరు పాదాలలో వచ్చేలా ఉత్పలమాల పద్యం, రాముని అందాన్ని చూసి మైమరచిన విశ్వామిత్రుని స్పందన వర్ణన అంశం పద్యం మొదలైన అధ్భుత పూరణలు అందరినీ అలరించాయి.
పృచ్ఛకులుగా సమస్యాపూరణం – రాధిక మంగిపూడి, దత్తపది- రాధాకృష్ణ రేగళ్ల, నిషిద్ధాక్షరి – అపర్ణ గాడేపల్లి, న్యస్తాక్షరి – రోజారమణి ఓరుగంటి, వర్ణన – స్వాతి జంగా, ఆశువు పాటూరి రాంబాబు, అప్రస్తుతం – రత్నకుమార్ కవుటూరు, పురాణపఠనం – రాజేంద్రబాబు గట్టు పాల్గొని చక్కటి ప్రశ్నలతో సభను రక్తి కట్టించారు. సంస్థ కార్యవర్గ సభ్యులు చామిరాజు రామాంజనేయులు సభను నిర్వహించగా.. భాస్కర్ ఊలపల్లి వందన సమర్పణ చేశారు. ధరణీప్రగడ వెంకటేశ్వరరావు, రమాసత్యవతి దంపతులు ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సంస్థ ప్రతినిధులుగా వద్దిపర్తి పద్మాకర్ను సత్కరించారు. గణేశ్న రాధాకృష్ణ.. కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయగా.. ప్రపంచ నలుమూలల నుంచి వేలాదిమంది తెలుగు సాహితీప్రియులు వీక్షించారు.