హైదరాబాద్: సింగపూర్లో (Singapore) స్వరలయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు (Thyagaraja Aradhana) ఘనంగా నిర్వహించారు. వరుసగా రెండో ఏడాది జరిగిన ఈ కార్యక్రమంలో సింగపూర్లో నివసించే తెలుగు గాయనీ గాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంగీత సాగరంలో ఓలలాడి, రామభక్తిలో మునిగి తేలారు. యడవల్లి శేషు కుమారి, సౌభాగ్య లక్ష్మి, షర్మిల, సౌమ్య, కిరిటి, శేషశ్రీ తదితరులు ఘన రాగ పంచరత్న కీర్తనలు ఆలపించారు.
అదేవిధంగా యడవల్లి శ్రీ విద్య.. ‘తెర తీయగ రాధా’ అనే కీర్తనతో స్వామిని కొలువగా, ఆరగింపవే అనే భక్తి నైవేద్యాలతో.. పతికి మంగళ హారతీరే అంటూ మంగళ హారతులతో ఆహుతులు త్యాగరాజ స్వామి ఆరాధనలను మిక్కిలి భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. అనంతరం స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షులు శేషు కుమారి గాయకులకు బహుమతులు అందించారు.