హైదరాబాద్ : ఇటలీలో జరుగుతున్న అంతర్జాతీయ ఆర్ట్ ఎగ్జిబిషన్ ‘రొమాంటికా’లో భారత సంతతి కళాకారిణి మాధురి శ్రీకాంత్ కళాకృతులను ప్రదర్శించనున్నారు. ఇటలీలోని ఏప్రిల్ 23న ప్రారంభం కానున్న ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ‘రొమాంటికా’లో తన కళాకృతులను ప్రదర్శించేందుకు.. తెలంగాణకు చెందిన భారత సంతతి చిత్రకారిణి శ్రీమతి మాధురి శ్రీకాంత్కు ప్రత్యేక ఆహ్వానం అందింది.
కళలు, సంస్కృతి, ఫ్యాషన్ ప్రదర్శనలకు ప్రత్యేక స్థానమైన ఇటలీలోని మిలాన్లో ఈ నెల 23 నుంచి మే 3వ తేదీ వరకు ‘రొమాంటికా’ అంతర్జాతీయ చిత్ర ప్రదర్శన జరగనుంది. ఎంఏడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో తన కళను ప్రదర్శించనున్న ఏకైక భారతీయ చిత్రకారిణి మాధురి శ్రీకాంత్ కావడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాప్రేమికులు, కళాపోషకులు ఈ ఎగ్జిబిషన్లో పాల్గొని ఈ చిత్రాలను కొనుగోలు చేస్తారు. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలోని కేరీటౌన్కు చెందిన మాధురి ఈ ఎగ్జిబిషన్లో కింది కింద పేర్కొన్న తన మూడు చిత్రాలను ప్రదర్శించనున్నాను.
తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో జన్మించిన శ్రీమతి మాధురి, ఎవరి ప్రోద్బలం లేకుండా తనకు తానుగానే చిత్రకళపై ఆసక్తి పెంచుకున్నారు. కాన్వాస్ ద్వారా తన భావాలను ప్రపంచానికి చాటి చెప్పాలని ఆమె బలంగా విశ్వసిస్తారు. చిన్నతనంలో తల్లి వేసిన రంగోలి (ముగ్గులు) నుంచి స్ఫూర్తి పొంది, రంగులనే తన నేస్తాలుగా చేసుకుని చిత్రకళలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. పాఠశాల స్థాయిలోనే తనలోని చిత్రకళకు గానూ అందరి మన్ననలు పొందారు. చిన్నవయసులోనే జాతీయస్థాయిలో ప్రశంలు అందుకున్న తర్వాత ఆమె చిత్రకళ రంగంలో వెనక్కు తిరిగి చూడలేదు.
ప్రతిష్ఠాత్మక ‘రొమాంటికా’ చిత్ర ప్రదర్శనలో పాల్గొనేందుకు తనకు ప్రత్యేకమైన ఆహ్వానం అందడంపై శ్రీమతి మాధురీ శ్రీకాంత్ స్పందిస్తూ.. ‘అంతర్జాతీయ వేదికపై భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రదర్శించేందుకు.. ఈ ఆహ్వానాన్ని ఓ చక్కటి అవకాశంగా భావిస్తున్నాను. మన ఆలోచనలు, మన జ్ఞాపకాలను సందేశాల రూపంలో వెల్లడించడంతోపాటు.. చిత్రకళకు మరింత వెలుగునిచ్చేందుకు ఈ పండగ సరికొత్త అవకాశాలకు బాటలు వేస్తుంది.
అమెరికాలో నివాసం ఉంటున్న భారత సంతతి యువతులు తమ భావాలను వెల్లడించేందుకు చిత్రకళను ఎంచుకునేలా ప్రోత్సాహాన్ని ఇవ్వడంతోపాటు వారి ముందు ఓ మంచి ఉదాహరణగా నిలుస్తాను’ అని పేర్కొన్నారు.
ఇద్దరు పిల్లల తల్లి, అమెరికాలోని ప్రఖ్యాత ‘ట్రూయిస్ట్ బ్యాంక్’ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీమతి మాధురి శ్రీకాంత్.. ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే.. వివిధ రకాల చిత్రకళలపై పట్టుపెంచుకున్నారు. కలర్ పొట్రెయిట్స్ నుంచి మురాల్స్ వరకు, సైకత శిల్పాల (sand art) నుంచి తంజావూరు చిత్రాల వరకు.. శ్రీమతి మాధురి అసాధారణమైన ప్రతిభను కనబరిచారు.
మిలాన్ డిస్ట్రిక్ట్స్ లోని నావిగ్లి ప్రాంతంలో ఉన్న సమకాలీన ఆర్ట్ గ్యాలరీయే ‘ఎంఏడీఎస్’. అధునాతన సాంకేతికతతో కూడిన వీడియో సిస్టమ్ ద్వారా నిరంతరం మల్టీమీడియా ఎగ్జిబిషన్లను నిర్వహించేందుకు వివిధ స్క్రీన్లను ఇక్కడ ఏర్పాటుచేశారు. చిత్రకారులు తమ విశిష్టమైన కళను ప్రదర్శించేందుకు, కళాకృతుల విజువల్ క్వాలిటీని మరింతగా పెంచేందుకు, హై డెఫినిషన్ను, చిత్రాల్లోని వాస్తవికతను, త్రీడీ స్పష్టతను పెంచడంతోపాటు, చిత్రాలు, కళాకృతుల షిప్పింగ్, ప్యాకేజింగ్, ఇన్సూరెన్స్, కస్టమ్స్ తదతర అంశాల్లో ఖర్చులను తగ్గించే లక్ష్యంతో.. మొట్టమొదటి పూర్తిస్థాయి డిజిటల్ మల్టిమీడియా గ్యాలరీని ఎంఏడీఎస్ స్థాపించింది. దీంతోపాటుగా సమయాభావాన్ని, ఇతర అధికారిక ఇబ్బందుల్లేకుండా.. వాస్తవమైన కళాకృతుల సమగ్రతను కాపాడటం కూడా ఈ డిజిటల్ మల్టీమీడియా గ్యాలరీ లక్ష్యం.
ఇద్దరు పిల్లల తల్లి, వృత్తిపరంగా సాంకేతిక నిపుణురాలు (టెక్నోక్రాట్) అయిన శ్రీమతి మాధురి.. చిత్రకళను ఓ హాబీ గానో, ఆటవిడుపు కోసమో కాకుండా.. తన హృదయానికి అత్యంత ఇష్టమైన పనిగా రోజూవారి జీవితంలో భాగంగా మలుచుకున్నారు. నిరంతర అభ్యాసకురాలైన మాధురి… కళను కళాకారునిగా కాకుండా మిగిలినవారి దృష్టికోణంలో చూడాలంటారు. ఇప్పటివరకు చిత్రకళలోని ఆరు రూపాలతోపాటు 120 చిత్రాలు శ్రీమతి మాధురి గారి కుంచె నుంచి వెలువడ్డాయి. తంజావూరు, మధుబని, మురాల్స్, వర్లి, టెక్చర్ పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్స్ వంటివి వారి ప్రముఖమైన చిత్రాల్లో ఉన్నాయి.