లండన్ : ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, మాజీ మంత్రి హరీశ్ రావు జన్మదిన వేడుకలను లండన్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ రెండు నిమిషాల మౌనం పాటించి ఘన నివాళులు అర్పించారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రవాస తెలంగాణవాసులు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాపేట్, సత్యమూర్తి చిలుముల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అమరవీరుల త్యాగాలు, ప్రజల చిరకాల ఆకాంక్షలు, కేసీఆర్ నాయకత్వంలో సాగిన ఉద్యమ ఫలితమని అన్నారు.
యూత్ వింగ్ నాయకురాలు అమరేశ్వరి బోయిన మాట్లాడుతూ.. నేటి తరానికి తెలంగాణ ఉద్యమ చరిత్రను, కేసీఆర్ పోరాట విషయాల్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలని, చరిత్ర తెలియకుండా చాలా మంది చౌకబారు రాజకీయ విమర్శలు చేస్తున్నారన్నారు. అలాగే మాజీ మంత్రి హరీశ్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ హరీశ్ రావు ప్రజలతో మమేకమై పనిచేసే నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే నాయకులు అంజాన్ రావు, కార్యదర్శి (ఐటీ, మీడియా & పీఆర్) రవి ప్రదీప్ పులుసు, వెంకట్ రెడ్డి దొంతుల, సురేష్ బుడగం, రామకృష్ణ, పవన్ గౌడ్, అంజన్ రావు, అమరేశ్వరి, హరికృష్ణ, రాజు, సాయి, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.