TAUK | లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో 200 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన వాళ్లందరికీ టాక్ ఉపాధ్యక్షురాలు శష్ముణ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహిలా నాయకత్వానికి టాక్ సంస్థ ఇచ్చే ప్రాముఖ్యత, సంస్థ చేపడుతున్న సాంస్కృతిక సేవా కార్యక్రమాలను వివరించారు.
మహిళలు బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుంటుందని టాక్ ఉపాధ్యక్షురాలు శష్ముణ రెడ్డి తెలిపారు. ఆత్మ విశ్వాసం, ధైర్యం ప్రధాన ఆయుధాలుగా ఆడపిల్లలు జీవితంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వచ్చిన ప్తరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారని పేర్కొన్నారు. ప్రతి అవకాశాన్ని ఛాలెంజ్గా తీసుకోవాలని సూచించారు. పురుషుల కంటే కూడా మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించాలన్నారు. దేశాభివృద్ధిలో మహిళలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. సమాజ నిర్మాణంలో సగ భాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం అని అన్నారు. భారతీయ మహిళలు స్థానికంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంటే తమ దృష్టికి తీసుకురావాలని వాళ్లకు అండగా ఉంటామని తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డ ఎమ్మెల్సీ కవిత స్ఫూర్తితో ముందుకెళ్తున్నామని చెప్పారు. అన్ని సందర్భాల్లో తమ వెంట ఉండి ముందుకు నడిపిస్తున్నందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలు విజయవంతం కావడంలో సహకరించిన టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, టాక్ మహిళా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
100 మందికిపైగా మహిళలు ఒక్క చోట చేరి మహిళా దినోత్సవం జరుపుకోవడం నూతన ఉత్తేజాన్ని ఇచ్చిందని టాక్ మహిళా విభాగం కార్యదర్శి క్రాంతి రేతినేని తెలిపారు. ఈ వేడుకలు ఇంతటి విజయం సాధించడానికి కారణమైన ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి, ఇతర మహిళా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షుడు రత్నాకర్ కృతజ్ఞతలు తెలిపారు. మహిళల సంరక్షణ, సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతుందని అన్నారు. స్థానిక సంస్థలల్లో మహిళా కోటా తెచ్చి మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్స్ను చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు. మహిళా సాధికారతలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు.
ప్రస్తుత సమాజంలో పురుషులకు ధీటుగా మహిళలు అద్భుత విజయాలు సాధిస్తున్నారని టాక్ అడ్వైజరీ బోర్డు సభ్యురాలు స్వాతి బుడగం తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలకు ప్రతీకగా ప్రపంచమంతా జరుపుకునేదిగా అభివర్ణించారు. టాక్ సంస్థలో ప్రవాస మహిళలంతా భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు. టాక్ మహిళా సెల్ నాయకురాలు శ్వేతా మహేందర్ వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి తో పాటు క్రాంతి, సుప్రజ, స్వాతి, విజిత, పావని రత్నాకర్, మౌనిక,శ్వేతా,స్నేహ,ఉమా గణేష్,శ్రీ లక్ష్మి రాకేష్,హారిక, మమతా, నంతిని, దీపాక్షర తదితరులు పాల్గొన్నారు.